ఏపీ ఈసెట్ నోటిఫికేషన్ విడుదల - రేపటి నుంచి దరఖాస్తు స్వీకరణ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 14, 2024, 5:22 PM IST
APECET Notification Released in Anantapur District : రాష్ట్రంలో ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈసెట్ - 2024 నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభమవుతుందని అనంతపురం జేఎన్టీయూ వీసీ శ్రీనివాసరావు అధికారికంగా వెల్లడించారు. ఏప్రిల్ 15 వరకు ఎలాంటి రుసుములు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు. అనంతరం పెనాల్టీతో దరఖాస్తులను స్వీకరిస్తామని పేర్కొన్నారు. మే 8వ తేదీన పరీక్ష ఉంటుందన్నారు.
పాలిటెక్నిక్ డిప్లోమా (ఇంజినీరింగ్ ), బీఎస్సీ (మ్యాథమెటిక్స్), చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని వీసీ శ్రీనివాసరావు తెలిపారు. ఏపీ ఈసెట్ రిజిస్ట్రేషన్ ఫీజుగా ఓసీ అభ్యర్థులు రూ.600, బీసీ అభ్యర్థులు రూ. 550, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఈసెట్ 2024 పరీక్ష 14 కేంద్రాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏపీఈసెట్లో 14 కోర్సుల్లో అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. మే 8 (బుధవారం) రెండు సెషన్లో పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 వరకు పరీక్ష నిర్వహిస్తామని తెలియజేశారు.