ETV Bharat / state

పేదల ఇళ్లపై పగబట్టిన జగన్‌ సర్కార్ - అయిదేళ్లుగా పూర్తి చేయని వైనం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 9, 2024, 9:31 AM IST

ysrcp_government_negligence_in_tidco_houses
ysrcp_government_negligence_in_tidco_houses

YSRCP Government Negligence in Tidco Houses: "టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన పథకం అయితే చాలు తీసి పక్కనపెట్టేయ్‌. అది నిరుపేదలకు మేలు చేసేదైనా పట్టించుకోవద్దు “. ఇదీ గత ఐదేళ్లుగా జగన్‌ ప్రభుత్వ తీరు. ప్రధానంగా టిడ్కో ఇళ్లపై ఈ కక్షపూరిత వైఖరి మరింత ఎక్కువ ప్రదర్శించారు. ఈ పథకం లబ్ధిదారుల్లో 90 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన నిరుపేదలే ఉన్నారు. పదే పదే ఆయా వర్గాల గురించి నా అంటూ గుండెలు బాదుకొనే జగన్‌ టిడ్కో ఇళ్లను సకాలంలో పూర్తిచేయకుండా పరోక్షంగా వారిపైనే కక్షసాధించారు. ఫలితంగా వాయిదాలు కట్టాలంటూ బ్యాంకుల నుంచి తాఖీదుల రావడంతో పేద ప్రజల లబోదిబోమంటున్నారు.

పేదల ఇళ్లపై పగబట్టిన జగన్‌ సర్కార్ - అయిదేళ్లుగా పూర్తి చేయని వైనం

YSRCP Government Negligence in Tidco Houses: పేదలకు పెద్దఎత్తున ఇళ్లు కట్టిస్తున్నామంటూ ఐదేళ్లగా ఆశల పల్లకిలో ఊరేగించిన జగన్‌, తాను అధికార పీఠం ఎక్కేసరికే తెలుగుదేశం హయాంలో కట్టి ఉన్న టిడ్కో ఇళ్లపై శీతకన్ను వేశారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల వరకూ టిడ్కో గృహాలు అనేవి రాష్ట్రంలో ఉన్నాయనే విషయాన్నే ఆయన అసలు పట్టించుకోలేదు. ప్రతిపక్షాలు పోరాటాలు, ఆందోళనలు చేసేసరికి కొన్నిచోట్ల నిర్మాణ పనులు చేపట్టినా నత్తనడకనే కొనసాగించారు. బడ్జెట్‌ నుంచి డబ్బులు విడుదలయ్యేలా చేయని జగన్‌, అప్పులు తెచ్చుకుని కట్టుకోవాలంటూ భారం మొత్తాన్ని టిడ్కోపైనే వేసేశారు.

టీడీపీ ప్రభుత్వంలో 60 నుంచి 90 శాతం పూర్తి చేసిన ఇళ్లనూ జగన్‌ సకాలంలో లబ్ధిదారులకు ఇవ్వలేదు. లబ్ధిదారుల పేరిట టిడ్కో తీసుకున్న రుణానికి మారటోరియం గడువు ముగియడంతో వాయిదాలు చెల్లించాలంటూ కొంతమందికి బ్యాంకులు తాఖీదులు ఇస్తున్నాయి. మరి కొంతమంది ఖాతాలు ఇప్పటికే నిరర్థక ఆస్తులుగా మారాయి. దాదాపుగా 5 వేలమంది వరకు ఈ జాబితాలో చేరినట్టు తెలుస్తోంది. రాబోయే 2 నెలల్లో ఈ సంఖ్య మరింత పెరగొచ్చు. భవిష్యత్తులో రుణాలు తీసుకునే అవకాశం ఉండదని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. సకాలంలో ఇళ్లను పూర్తి చేసి ఇవ్వని వైసీపీ ప్రభుత్వం టిడ్కో లబ్ధిదారులకు మరో కొత్త సమస్యను తెచ్చిపెట్టింది.

'వారం నుంచి నీళ్లు లేవు - మా కాలనీ వైపు చూడండి కొడాలి నాని గారూ'

టీడీపీ ప్రభుత్వం 3.13 లక్షల గృహాల నిర్మాణం చేపట్టగా, వైసీపీ అధికారంలోకి రాగానే వీటిలో 52 వేల ఇళ్లను రద్దు చేశారు. మిగతా 2.62 లక్షల ఇళ్ల నిర్మాణాన్నే చేపట్టింది. 365చదరపు అడుగల విస్తీర్ణం గల గృహాలపై 3.15 లక్షల రూపాయలు, 430 చదరపు అడుగల విస్తీర్ణం గల ఇళ్లపై 3.65 లక్షల రూపాయల చొప్పున లబ్ధిదారుల పేరిట రెండేళ్ల మారటోరియంతో బ్యాంకుల నుంచి టిడ్కో రుణాన్ని తీసుకుంది.

వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇలా 65 వేల మందికి బ్యాంకులు రుణాలు మంజూరు చేసినట్లు సమాచారం. మారటోరియం గడువులోగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగిస్తే వారు 3 వేల చొప్పున నెలవారీ వాయిదాలు బ్యాంకులకు కట్టాలి. కానీ గృహాలను అప్పగించకముందే టిడ్కో తీసుకున్న రుణాలపై మారటోరియం గడువు ముగిసిపోతోంది. దీంతో ప్రతి నెలా పలువురు లబ్ధిదారుల అకౌంట్లు ఎన్‌పీఏలుగా మారుతున్నాయి.

అరకొర వసతులతో టిడ్కో ఇళ్లు పంపిణీ- తీవ్ర అవస్థలు, అనారోగ్యం ఇక్కట్లతో ప్రజలు

ఎన్​పీఏగా మారిన లబ్ధిదారులు ఎక్కువగా విశాఖ, కర్నూలు, గుంటూరు, అనంతపురం జిల్లాల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. గత 2, 3 నెలల్లోనే దాదాపుగా వెయ్యి ఖాతాలు నిరర్థక ఆస్తులుగా మారాయి. విజయవాడ, పాలకొల్లు, భీమవరం ప్రాంతాల్లో లబ్ధిదారులకు గృహాలను అప్పగించకుండానే వాయిదాలు చెల్లించాలంటూ బ్యాంకులు నోటీసులు జారీ చేశాయి. కొన్ని చోట్ల లబ్ధిదారులే వైసీపీ ప్రజాప్రతినిధుల్ని నిలదీస్తున్నారు.

ఇటీవల పెనుమలూరు నియోజకవర్గ పరిధిలో మంత్రి జోగి రమేశ్‌ను ఓ మహిళ నిలదీస్తే సమాధానం చెప్పలేక అందరూ నీళ్లు నమిలిన పరిస్థితి తలెత్తింది. ఎన్​పీఏగా (Non Performing Assets) మారిన 11 కోట్లు చెల్లించాలంటూ ఓ బ్యాంకు ఇటీవలే టిడ్కోను ఆశ్రయించింది. మరో బ్యాంకు కోటి రూపాయలు చెల్లించాలని స్పష్టం చేసింది. ఆ మాత్రం మొత్తాన్ని చెల్లించేందుకూ సొమ్ములు లేక టిడ్కో అధికారులు చేతులెత్తేస్తున్నాకు. ఎన్​పీఏ ఖాతాల సంఖ్య క్రమంగా పెరిగిపోతుండటంతో బ్యాంకులూ టిడ్కోకు రుణాలు ఇచ్చేందుకు వెనుకడుగు వేస్తున్నాయి.

టిడ్కో గృహాల నిర్మాణాలపై జగన్ హడావిడి - ఎన్నికలు సమీపిస్తుండడంతో హంగామా

బ్యాంకు ఖాతాలు ఎన్​పీఏగా మారుతూ పేదలు ఆందోళన చెందుతుంటే సీఎం హోదాలో ఉంటూ జగన్‌ తనకేమీ సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నారు. దీనిపై కనీస సమీక్షా లేదు. పైగా రుషికొండ ప్యాలెస్‌లో ఫర్నీచర్‌ ఏర్పాటుపై మాత్రం అధికారులను పిలిచి ఠంఛనుగా దిశానిర్దేశం చేస్తున్నారు. ఇది ఏరకమైన పెత్తందారీ పోకడో జగన్‌కే తెలియాలి? టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గుత్తేదారులకు దాదాపుగా 400 కోట్ల రూపాయల వరకు బకాయిలున్నాయి.

చాలా సంస్థలకు ఏడాదిగా చెల్లింపులు జరగలేదు. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే అవకాశాలున్నాయి. దీంతో చెల్లింపులు చేయాలని గుత్తేదారులు అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. దీనిపై అధికారులు ప్రభుత్వానికి నివేదించినా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఏంటని గుత్తేదారులు ఆందోళన చెందుతున్నారు. బకాయిలు చెల్లించనిదే నిర్మాణాలు చేపట్టేది లేదని ఇప్పటికే కొంతమంది గుత్తేదారులు స్పష్టం చేసినట్టు సమాచారం.

ఇల్లు దక్కేనా - కల నెరవేరేనా - టిడ్కో లబ్ధిదారుల ఆవేదన

టిడ్కో ఇళ్లను పంపిణీ చేయకపోతే తాను రాబోయే ఎన్నికల్లో గెలిచే అవకాశమే లేదని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ కీలక నేత ఇటీవల ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. ఎన్నికల నాటికి లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిందేనని ఆయన అధికారులపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. కృష్ణా, అనంతపురం జిల్లాలకు చెందిన మరో ఇద్దరు నేతలది సైతం ఇదే పరిస్థితి. అయినా అక్కడి నిర్మాణాలు పూర్తి కాని పరిస్థితి. ఎన్నికల గిమ్మిక్కులు చేయడంలో జగన్‌ దిట్ట కదా?

అందుకే గృహ సముదాయాల్లో మొత్తం ఇళ్లన్నీ పూర్తికాకుండానే హడావుడిగా పంపిణీ చేస్తున్నారు. ఒక గృహ సముదాయంలో ఐదారు వేల ఇళ్లు పూర్తి చేయాల్సి ఉంటే వెయ్యి, రెండు వేలు పూర్తయినవి ఇచ్చేసి జారుకుంటున్నారు. 2.62 లక్షల గృహాలకుగానూ 1.22 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించినట్లు అధికారులు లెక్కలు చూపుతున్నారు. ఇవి దాదాపుగా టీడీపీ హయాంలో పూర్తయినవే.

అష్టకష్టాలు పడుతున్న టిడ్కో లబ్ధిదారులు - చేతులెత్తేసిన వైఎస్ జగన్ సర్కారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.