ETV Bharat / state

రైతులకు సాగునీరు లేదు, ప్రజలకు తాగునీరు లేదు - ఈ వేసవి ఎలా గడుస్తుందో : చంద్రబాబు - Water crisis in ap

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 10, 2024, 7:26 PM IST

Water_Problem_in_AP
Water_Problem_in_AP

Water Problem in AP : రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందక రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమలోని పల్లెల నుంచి గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ వరకు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఉందని దుయ్యబట్టారు. ప్రజల కష్టాలు తీర్చడానికి వైసీపీ ప్రభుత్వం దగ్గర అసలు ప్రణాళికే లేదని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో అక్రమాలపై కాకుండా ఇప్పటికైనా ప్రజల తాగునీటి కష్టాల పరిష్కారంపై దృష్టిపెట్టాలని చంద్రబాబు 'ఎక్స్'లో పోస్టు చేశారు.

Water Problem in AP : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తీవ్ర తాగు నీటి ఎద్దడి ఏర్పడింది. ఎండల కారణంగా బోర్లు ఎండిపోవడంతో తాగేందుకు నీరు లేక ప్రజలు సతమతమవుతున్నారు. గుక్కెడు నీటి కోసం రోడ్లపై నీటి ట్యాంకర్ల కోసం గంటల తరబడి వేచిఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా వేసవికాలం పూర్తిగా మెుదలు కాకముందే ఈ దుస్థితి ఏంటని ప్రజలు వాపోతున్నారు.

'మాకు నీళ్లివ్వండి మహాప్రభో!- ఎంపీడీవో కార్యాలయం ముట్టడించిన గ్రామస్థులు

రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్యపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమలోని పల్లెల నుంచి గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ వరకు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఉందని దుయ్యబట్టారు. ఏ జిల్లా ఏ ప్రాంతం చూసినా అంతా దుర్భర పరిస్థితే నెలకొందని ఆక్షేపించారు.

ఈ వేసవి ఎలా గడుస్తుందో ప్రజలకు అర్థం కావట్లేదు : కరెంటు బిల్లులు కట్టక కొన్ని, నిర్వహణ లేక కొన్ని ఇలా తాగునీటి పథకాలన్నీ మూలనబడ్డాయని మండిపడ్డారు. ట్యాంకర్లతో మంచినీటి సరఫరా అన్నది ఎప్పుడో అటకెక్కిందని విమర్శించారు. ఈ వేసవి ఎలా గడుస్తుందో అర్థం కావడం లేదన్నారు. ప్రజల కష్టాలు తీర్చడానికి పాలకుడి దగ్గర అసలు ప్రణాళికే లేదని ధ్వజమెత్తారు. ఒక అసమర్థ ప్రభుత్వం వ్యవస్థలను ఎలా నాశనం చేస్తుందో, దానివల్ల ప్రజలకు ఎలాంటి కష్టాలు వస్తాయో చెప్పడానికి ఇదొక సజీవ సాక్ష్యమని విమర్శించారు. ప్రభుత్వం ఎన్నికల్లో అక్రమాలపై కాకుండా ఇప్పటికైనా ప్రజల తాగునీటి కష్టాల పరిష్కారంపై దృష్టిపెట్టాలని చంద్రబాబు 'ఎక్స్'లో పోస్టు చేశారు.

తాగునీటి కోసం ఎంపీడీవో ఛాంబర్​లో ఆందోళన : అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం ఎంపీడీవో కార్యాలయాన్ని దండువారిపల్లి గ్రామస్థులు ముట్టడించారు. తమ గ్రామానికి తాగు నీరందించాలని డిమాండ్ చేస్తూ ఎంపీడీవో ఛాంబర్​లో బైఠాయించి ఆందోళన చేశారు. వారంరోజులుగా తమ గ్రామంలో రెండు తాగునీటి బోర్లు ఎండిపోయాయని సర్పంచ్ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని వాపోయారు. బోర్లు మరమ్మతులు, తాగునీరందించేలా అధికారులు ప్రత్యమ్నాయ చర్యలు చేపట్టలేదని సర్పంచ్ భర్త నారాయణస్వామి మండిపడ్డారు. వేసవి కాలంలో తాగునీటి సమస్య వచ్చిందని తెలిసినా అధికారులు పట్టించుకోవడంలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

గుక్కెడు నీటి కోసం రోడ్లపై గంటల తరబడి వేచిఉండాల్సిన పరిస్థితి : ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎన్ని ఉన్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాగా రాష్ట్రంలో పరిస్థితి నెలకొంది. గుక్కెడు నీటి కోసం రోడ్లపై మండుటెండలో నీటి ట్యాంకర్ల కోసం ఎదురుచుసే పరిస్థితి ప్రకాశం జిల్లాలో నెలకొంది. జిల్లాలోని కనిగిరిలో నీటి ఎద్దడితో స్థానికులు సతమతమవుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రజల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ట్యాంకర్ల ద్వారా పట్టణ ప్రజలకు సరిపడా నీటిని అందించాల్సి ఉండగా 15 రోజులకు ఓసారి అరా కోరగా నీటిని అందిస్తుండడంతో అవి ఏమాత్రం సరిపోవటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

రైతులకు సాగునీరు లేదు, ప్రజలకు తాగునీరు లేదు - ఈ వేసవి ఎలా గడుస్తుందో : చంద్రబాబు

అధికారులకు పలుమార్లు నీటిని అందించాలని ఫోన్ ద్వారా అడిగినప్పటికీ వారి నుంచి ఎటువంటి సమాధానం రావడంలేదని తెలిపారు. ట్యాంకర్లు ఎప్పుడు వస్తాయోనని పనులు మానుకొని రోడ్ల వెంబడి గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అసలే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండగా దీనికి తోడు నీటి కష్టాలు తీవ్రం కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

దాహం కేకలు - అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజల ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.