ETV Bharat / state

ఈసీని కదిలించిన కథనాలు - ఆ గ్రామవాసులకు ఓటుహక్కు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 4, 2024, 9:19 AM IST

Villagers Thanked ETV BHARAT: జలాశయం నీటిలో గ్రామాలను ముంచేసి, స్థానికులకు ఓటు హక్కు ఇవ్వని వైనంపై ఈటీవీ - ఈటీవీ భారత్​లో ప్రసారమైన కథనాలకు ఈసీ స్పందించింది. మునిగిన గ్రామాల పరిధిలోనే ఇళ్లు కట్టుకున్నా, టీడీపీ సానుభూతిపరులని ఇన్నాళ్లు ప్రభుత్వం వారికి గుర్తింపు ఇవ్వలేదు. దీనిపై ఈటీవీ కథనం ప్రసారం చేసింది. ఇది వైరల్ అవ్వడంతో ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్లగా, స్థానికులకు ఓటు హక్కు కల్పించాలని జిల్లా కలెక్టర్‌కు వారు ఆదేశాలిచ్చారు. ఈటీవీ చొరవతోనే తమకు ఓటు హక్కు వచ్చిందని సీసీరేవు, మర్రిమేకలపల్లి వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Villagers_Thanked_ETV_BHARAT
Villagers_Thanked_ETV_BHARAT

ఈటీవీ భారత్ కథనాలకు స్పందించిన ఈసీ - ఓటు హక్కు కల్పించాలని ఆదేశం

Villagers Thanked ETV BHARAT: వారంతా సత్యసాయి జిల్లా మర్రిమేకలపల్లి, చిన్నచిగుళ్లరేవుకు చెందిన స్థానికులు. 2021లో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో గరిష్ఠ స్థాయిలో నీటి నిల్వ చేయాలని వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వీరిని ఇబ్బందుల పాలు చేసింది. కనీస సమాచారం ఇవ్వకుండా అధికారులు గ్రామాలను ఉన్నపళంగా ఖాళీ చేయాలని ఆదేశించారు. జలాశయం బ్యాక్ వాటర్ ఇళ్లలోకి వస్తుండగానే తట్టాబుట్టా సర్థుకొని గ్రామస్థులంతా ఊళ్లు వదిలి వెళ్లారు.

దీనిపై అప్పటి కలెక్టర్ గంధం చంద్రుడిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఊళ్లను వదిలి వెళ్లిన స్థానికులు నిలువనీడలేకుండా చాలా కాలం గడిపారు. తర్వాత అదే గ్రామాల పరిధిలో 300 ఇళ్లు నిర్మించుకున్నారు. కానీ వారిని అధికారులు గుర్తించలేదు. మూడేళ్లుగా ఈ గ్రామాల్లో ఎవరైనా చనిపోతే కనీసం డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలన్నా ఊరుపేరు లేదనే సాకుతో నిరాకరించేవారు. దీనిపై ఈటీవీ - ఈటీవీ భారత్ కథనాలు ప్రసారం చేసింది. ఇది వైరలై ఆ గ్రామానికి గుర్తింపునిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Chitravathi Balancing Reservoir Residents Problems: నాలుగేళ్లుగా కన్నీళ్లే మిగిలాయి.. ప్రభుత్వమే మాట తప్పితే.. పట్టించుకునే వారు ఎవరు..?

మర్రిమేకలపల్లిలో 3 సామాజిక వర్గాలకు చెందిన కుటుంబాల వారు ఎక్కువగా నివసిస్తున్నారు. వీరంతా టీడీపీ సానుభూతిపరులుగా ముద్రపడడంతో గ్రామానికి గుర్తింపు ఇవ్వకుండా అధికార పార్టీ నేతలు ఇన్నాళ్లు అడ్డుపడ్డారు. గ్రామానికి గుర్తింపు లేక స్థానికులు మూడేళ్లుగా ఓటుహక్కుకు దూరమయ్యారు. గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ వారికి ఓటుహక్కు ఇవ్వలేదు. ఈటీవీ - ఈటీవీ భారత్​లో కథనం ప్రసారమైన తర్వాత రెవెన్యూ అధికారులు గ్రామాల్లో పర్యటించారు.

ముంపునకు గురయ్యాక కాలనీలను అదే రెవెన్యూ భూభాగంలో నిర్మించుకున్నట్లుగా గుర్తించారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించగా, కొత్తగా గ్రామాలను గుర్తించాల్సిన అవసరం లేదని పాత పేర్లతోనే కొనసాగుతాయని సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో వారం రోజులుగా కొత్తగా నిర్మించుకున్న ఇళ్లకు నెంబర్లు వేస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో కలెక్టర్‌ ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

రెండు ఊళ్లను వీడిన అజ్ఞాతం, ఎట్టకేలకు దక్కిన గుర్తింపు - మూడేళ్ల నిరీక్షణకు తెర

మూడేళ్లుగా పట్టించుకోని అధికారులు ఇప్పుడు తమ వద్దకు వచ్చారని స్ధానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మర్రిమేకల పల్లి, సీసీరేవుల్లో 3 పోలింగ్ బూత్​లు ఉండేవి. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈసారి రెండు గ్రామాల ప్రజలు 4 కిలోమీటర్ల దూరంలోని ఎం.అగ్రహారంలో ఓటు వేయాల్సి వస్తోంది. ఈ సమస్యనూ పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

"గత కొన్ని సంవత్సరాలుగా మమ్మల్ని పట్టించుకున్న వారే లేరు. మాకు ఓటు హక్కు లేదు. నిధులు లేవు. మాకు ఈ రోజు న్యాయం జరిగింది అంటే దానికి కారణం ఈటీవీ- ఈటీవీ భారత్. గత నాలుగేళ్లుగా మాకోసం వరుస కథనాలు రాశారు. మాకు అందరికీ ఇప్పుడు ఓటు హక్కు కల్పిస్తున్నారు". - గ్రామస్థుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.