TDP Leaders Devineni Uma and Depak Reddy Letter To AP CEO : తాడిపత్రిలో జరిగిన అల్లర్లలో తెలుగుదేశం కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిలు లేఖ రాశారు. రాజంపేట డీఎస్పీ చైతన్య ఎవరి ఆదేశాలతో వచ్చి దాడులకు పాల్పడ్డారో అంతుబట్టడం లేదని నేతలు సీఈసీ దృష్టికి తెచ్చారు. జేసీ అస్మిత్ రెడ్డి ఇంటిపైకి డీఎస్పీ చైతన్య దాడికి పాల్పడి వ్యక్తిగత సిబ్బంది, డ్రైవర్లు, పొరుగువారిని గాయపరిచారని నేతలు గుర్తు చేశారు. తాడిపత్రి అల్లర్లలో తాను లేకపోయినా 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారని దీపక్ రెడ్డి తెలిపారు.
తాడిపత్రిలో అగ్నికి ఆజ్యం పోసిన డీఎస్పీ చైతన్య!- జేసీ ఇంటికెళ్లి దాడి - TADIPATRI VIOLENCE
దాడులకు పాల్పడ్డవారిపై కాకుండా బాధితులపై కేసులా? : జూన్ 4న అస్మిత్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులను కౌంటింగ్కు దూరంగా ఉంచాలన్న కుట్ర జరుగుతోందని నేతలు ఆరోపించారు. తాడిపత్రి పోలీసుల ఏకపక్ష చర్యను నిలువరిస్తూ హక్కులు రక్షించాలని సీఈసీని కోరారు.పెద్దారెడ్డి తన అనుచరులతో టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి ఇంటిని చుట్టుముట్టి మారణాయుధాలు, బాణసంచాలు కాల్చి బీభత్సం సృష్టించారని లేఖలో పేర్కొన్నారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి చెప్పింది చేసే వ్యక్తిగా పేరున్న డీఎస్పీ చైతన్య చేసిన ఈ దురాగతం చట్ట విరుద్ధమని తెలిపారు. ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో ఉన్న డీఎస్పీ చేసిన ఈ దుర్మార్గ పనులు వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమని నేతలు విమర్శించారు. దాడులకు పాల్పడ్డవారిపై కాకుండా బాధితులపైన కేసులు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.
అక్రమంగా నిర్బంధించడం న్యాయాన్ని అపహాస్యం చేయడమే : హక్కులను కాలరాయడంతో పాటు అస్మిత్రెడ్డి, కుటుంబ సభ్యులను పోలీసులు అక్రమంగా నిర్బంధించడం న్యాయాన్ని అపహాస్యం చేయడమే అవుతుందన్నారు. పోలీసుల ఏకపక్ష చర్యను కొనసాగిస్తూ జేసీ అస్మిత్ రెడ్డితో పాటు, మద్ధతుదారుల ప్రాథమిక హక్కులను హరించేలా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అస్మిత్ రెడ్డితో పాటు మద్ధతుదారుల హక్కులను కాపాడాలని నేతలు కోరారు.
డీఎస్పీ చైతన్య రాకతో అగ్నికి ఆజ్యం పోసినట్లయింది : పోలింగ్ తర్వాత తెలుగుదేశం, వైఎస్సార్సీపీ ఘర్షణలతో రణరంగాన్ని తలపించిన తాడిపత్రిలో రాజాంపేట డీఎస్పీ చైతన్య రాక అగ్నికి ఆజ్యం పోసినట్లు అయింది. గొడవల్ని ఆపి శాంతి భద్రతలను రక్షించాల్సిన పోలీసు అధికారి, దాడులకు ప్రేరేపించడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు చైతన్యను రాజంపేట నుంచి తాడిపత్రికి ఎవరు పిలిపించారు? అనేది అప్పట్లో చర్చనీయాంశమైంది.
డీఎస్పీ చైతన్య తీరు ముందు నుంచి వివాదాస్పదమే : ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై ఉన్న భక్తితో కళ్లు మూసుకుపోయిన చైతన్య తీరు ముందు నుంచీ వివాదాస్పదమే. పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్ధన్రెడ్డి 2022 జూన్ 11న ఎస్సీ సామాజికవర్గానికి చెందిన టీడీపీ కౌన్సిలర్ కొత్తపల్లి మల్లికార్జునపై దాడి చేస్తే కేసు పెట్టొద్దంటూ స్టేషన్కు పిలిచి బాధితుడినే కొట్టిన చరిత్ర చైతన్యది. ఆ తర్వాత మల్లికార్జున ప్రైవేటు కేసు వేశారు. అలా ఒకట్రెండు కాదు, చైతన్యపై ఏకంగా 23 ప్రైవేటు కేసులు వేశారు. ఇవన్నీ ప్రస్తుతం విచారణలో ఉన్నాయి.
తాడిపత్రి ఘటనపై డీఎస్పీని మందలించిన ఎస్పీ - అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశం