Nara Buvaneshwari with School Students: నిజం గెలవాలి యాత్రలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. పాఠశాల విద్యార్థులతో ముచ్చటించిన భువనేశ్వరి, వారితో కలిసి పూజలు నిర్వహించారు. విద్యార్థి దశ నుంచే మంచి అలవాట్లను నేర్చుకుని ఉన్నత దశకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ధర్మవరం నియోజకవర్గంలో పర్యటించిన ఆమె టీడీపీ అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యావాదాలు తెలిపారు.
అనంతపురం జిల్లా కదిరి మండలంలోని ఎర్రదొడ్డిలో భువనేశ్వరి పర్యటించారు. చంద్రబాబు అరెస్టుతో మనస్థాపనికి గురై మరణించిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. వారికి తెలుగుదేశం అండగా ఉంటుందనే భరోసా కల్పిస్తున్నారు. అయితే నిజం గెలవాలి పర్యటన అనంతపురం జిల్లాలో కొనసాగుతుండగా ఎర్రదొడ్డిలోని పాఠశాల విద్యార్థులతో ముచ్చటించారు.
"కష్టకాలంలో ఆదుకున్నారు - టీడీపీకి జీవితాంతం రుణపడి ఉంటాం"
విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలోని సరస్వతి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆమె విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విద్యార్థి దశ నుంచే సంస్కృతి, సంప్రదాయాలను అలవర్చుకోవాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. క్రమశిక్షణను పాటిస్తూ, దేశానికి సేవ చేసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
స్వాగతం పలికిన మాజీ మంత్రి పరిటాల సునీత: ధర్మవరంలో నియోజకవర్గంలో నిజం గెలవాలి యాత్రలో భాగంగా చేనేత మహిళలతో భువనేశ్వరి ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిటాల శ్రీరామ్, మాజీ మంత్రి పరిటాల సునీత పాల్గొన్నారు. రామగిరి మండలంలోని వెంకటపురంలో భువనేశ్వరి పర్యటించగా, మాజీ మంత్రి పరిటాల సునీత (Paritala Sunitha) స్వాగతం పలికారు. పరిటాల రవి ఘాట్ వద్ద చేరుకున్న భువనేశ్వరి నివాళులు అర్పించారు.
పరిటాల సునీత ఆధ్వర్యంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు
చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు అండగా నిలిచిన ప్రతిఒక్కరినీ గుండెల్లో పెట్టుకుంటామని భువనేశ్వరి (Bhuvaneshwari Tour) తెలిపారు. టీడీపీకి మొదటి నుంచి మహిళలు అండగా నిలిచారని అభిప్రాయం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా టీడీపీ శ్రేణులు భరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చేనేతకారుల యోగక్షేమాలు తెలుసుకున్న భువనేశ్వరి ధర్మవరంలోని రైల్వే గేటు వద్ద గల నేతన్న విగ్రహానికి భువనేశ్వరి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ధర్మవరం మారుతీ రాఘవేంద్ర వీధిలో నేతన్నల ఇంటికి వెళ్లిన భువనేశ్వరి, చేనేత మగ్గాలు, పట్టువస్త్రాల నేతను పరిశీలించారు. వారితో కొద్దిసేపు ముచ్చటించి చేనేతల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
చంద్రబాబు ఆలోచన ఎప్పుడూ ప్రజల గురించే : నారా భువనేశ్వరి
"ఉన్నత స్థానాలకు చేరుకుని దేశాన్ని అభివృద్ధి చేయాలి. మీలో చిన్న చిన్న ఆలోచనలు ఉండకూడదు. టెక్నాలజి, సెల్ ఫోన్లను దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకోవాలి. గురువులు దేవుళ్లతో సమానం." - నారా భువనేశ్వరి
అక్కున చేర్చుకుని, ఆప్యాయంగా ఎత్తుకుని - స్కూలు చిన్నారులతో నారా భువనేశ్వరి సందడి