ETV Bharat / state

ఆన్​లైన్ బెట్టింగ్​లకు బానిసైన మిషన్ భగీరథ ఏఈ - వర్క్ ఆర్డర్ల పేరుతో రూ.8 కోట్లు స్వాహా

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 13, 2024, 8:20 AM IST

Mission Bhagiratha AE Arrested : ఆన్‌లైన్‌ బెట్టింగులకు అలవాటుపడిన ఓ అసిస్టెంట్ ఇంజనీర్ అడ్డదారులు తొక్కాడు. మిషన్ భగీరథ వర్క్ ఆర్డర్లు ఇప్పిస్తామని పని పూర్తి చేస్తే అందుకు అదనంగా డబ్బులు చెల్లిస్తానని చెప్పి పలువురిని మోసం చేశాడు. అలా వసూలు చేసిన రూ. 8 కోట్లను బెట్టింగ్‌లో పెట్టాడు. తీరా విషయం బయటపడేసరికి పారిపోయేందుకు యత్నిస్తూ దిల్లీలో పోలీసులకు చిక్కాడు.

Mission Bhagiratha AE Arrest In Hyderabad
Mission Bhagiratha AE Arrest

మిషన్ భగీరథ వర్క్ ఆర్డర్ల పేరుతో భారీ మోసం - ఏఈ రాహుల్​ను అరెస్ట్ చేసిన పోలీసులు

Mission Bhagiratha AE Arrested : గడ్డం రాహుల్ బాబు కీసర డివిజన్‌లోని పంచాయితీరాజ్‌లో మిషన్ భగీరథ అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. 2022 డిసెంబర్ నుంచి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు బానిసైన రాహుల్‌ అందుకు ఓ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నాడు. దానిలో క్రికెట్, క్యాసినో సహా పలు ఆన్‌లైన్‌ గేమ్స్‌లో బెట్టింగ్ పెట్టాడు. లాభాలు వస్తున్నాయని భావించిన నిందితుడు కోట్లల్లో బెట్టింగ్ పెట్టేందుకు తన ఉద్యోగ హోదాని వాడుకున్నాడు. వర్క్‌ ఆర్డర్లు ఇప్పిస్తామని నమ్మించి పలువురిని మోసం చేశాడు. తొలుత 50 నుంచి 70 శాతం వరకూ వర్క్ ఆర్డర్ కోసం పెట్టుబడి పెడితే అనంతరం చెల్లించిన వాటికి కమిషన్ తీసుకుని పని చేయకున్నా బిల్లులు మంజారు చేస్తానని మాయమాటలు చెప్పి లక్షల్లో దోచుకున్నాడు.

వర్క్ ఆర్డర్ల కోసం 15 మంది బాధితులు ఇచ్చిన నగదును నాగారం గ్రామ పంచాయతీ ఖాతాలో జమ చేయించాడు. అది పంచాయతీ ఖాతా అని తెలియడంతో బాధితులు కూడా నమ్మి డబ్బులు చెల్లించారు. ఈ వ్యవహారంలో ఆశ్చర్యకర విషయం ఏమిటంటే నాగారం పంచాయతీ మున్సిపాలిటీగా మారిన తర్వాత గ్రామ సర్పంచ్‌కు రూరల్ వాటర్ వర్క్స్ అంట్ శానిటేషన్ ఈఈకి సంయుక్తంగా ఉన్న ఖాతా నిలిచిపోయింది. కానీ రాహుల్ బాబు గ్రామ పంచాయతీ పేరుతో ఉప్పల్​లోని ఎస్‌బీఐ బ్రాంచ్​లో ఖాతాను తెరిపించాడు. ఖాతాను తన ఫోన్‌ నంబర్​ను జత చేసి నగదు లావాదేవీలు జరిపాడు.

వెలుగులోకి మరో కుంభకోణం - రైతు బీమా, రైతుబంధులోనూ గోల్​మాల్ - రూ.2 కోట్లు స్వాహా

Mission Bhagiratha AE Online Betting : రాహుల్ ఇచ్చిన గడువు ముగియడంతో వర్క్ ఆర్డర్ల కోసం డబ్బులు చెల్లించిన వారు అతనిపై ఒత్తిడి పెంచారు. దీంతో నాగారం సర్పంచ్ ఖాతాలోని నగదును తీసేందుకు రాహుల్ సిద్ధమయ్యాడు. ఇందుకు చెక్కుపై డీఈఈ సంతకం తప్పని సరి కావడంతో డీఈఈ శ్రీవాణిని సంప్రదించాడు. ఇటీవల పలువురు ప్రైవేటు వ్యక్తులు వారి అవసరాల కోసం సర్పంచ్ ఖాతాలో నగదు వేశారని వాటిని తిరిగి తీసుకునేందుకు సంతకం చేస్తే లక్ష రూపాయలు ఇస్తారాన్నరని తెలిపాడు. దీంతో డబ్బుకు ఆశపడిన శ్రీవాణి చెక్కులపై సంతకం చేసింది. ఈ వ్యవహరం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఇద్దరిని సస్పెండ్ చేశారు.

డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో గతేడాది జులైలో బాధితులు కీసర పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి కనిపించకుండా పోయిన రాహుల్ అమెరికా వెళ్ళాడు. తిరిగి వచ్చిన రాహుల‌్ మళ్లీ నేపాల్ వెళ్లేందుకు ప్రయత్నించాడు. అప్పటికే లుక్ అవుట్ నోటీసులు జారీ చేసి ఉండటంతో దిల్లీ విమానాశ్రయంలో రాహుల్‌ను అరెస్ట్ చేసిన అధికారులు కీసర పోలీసులకు సమాచారమిచ్చారు. నిందితున్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చిన పోలీసులు కోర్టులో హాజరు పరిచి చర్లపల్లి జైలుకు తరలించారు. కాగా ఈ కేసులో మాజీ ఈఈ శ్రీవాణి, రాహుల్ స్నేహితురాలు సాయి ధరణిని కూడా నిందితులుగా చేర్చారు.

ఒక్క టానిక్‌ వైన్స్​లోనే రూ.1000 కోట్ల 'పన్ను ఎగవేత' లావాదేవీలు!

ఓఆర్‌ఆర్‌ టోల్ టెండర్లలో అవకతవకలపై విచారణకు సీఎం ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.