ETV Bharat / state

సిద్ధం సభకు 2 వేల 500 బస్సులు! - ఇంటర్ విద్యార్థుల పరిస్థితి ఏంటి - ప్రజలు ఎలా పోయినా పర్లేదా?

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 7, 2024, 10:44 AM IST

Huge Number of RTC Buses to CM Jagan Siddham Meeting: విమర్శలు, ప్రజల ఇబ్బందులను లెక్క చేయని ధోరణి సీఎం జగన్‌లో కనిపిస్తోంది. ప్రజలు ఎలా పోతే నాకేంటి? వేల సంఖ్యలో బస్సులు మాత్రం నా ‘సిద్ధం’ సభకు ఇవ్వాల్సిందే అంటూ జగన్‌ ఆదేశించారు. కోట్లరూపాయల్లో ఉన్న బకాయిలు ఇవ్వకుండా, మేదరమెట్లలో నిర్వహిస్తున్న సిద్ధం సభకు మళ్లీ 2 వేల 500 బస్సులు ఇవ్వాలన్నారు. ఆయన ఆదేశమే ఆలస్యంగా అడిగినన్ని బస్సులు పంపేందుకు అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

RTC_Buses_to_CM_Jagan_Siddham_Meeting
RTC_Buses_to_CM_Jagan_Siddham_Meeting

సిద్ధం సభకు 2 వేల 500 బస్సులు! - ఇంటర్ విద్యార్థుల పరిస్థితి ఏంటి - ప్రజలు ఎలా పోయినా పర్లేదా?

Huge Number of RTC Buses to CM Jagan Siddham Meeting: ఉన్న బస్సులన్నీ సభకు తీసుకెళితే ప్రయాణికులు, విద్యార్థులు, గ్రామీణ ప్రజలు నరకం చూస్తారని తెలిసి కూడా, నా సభలే నాకు ముఖ్యమనే జగన్‌ తీరును ఏమనాలని ప్రజల ప్రశ్నిస్తున్నారు. ప్రజలను ఇబ్బందిపెట్టి, వారి ప్రయాణాలకు విఘాతం కలిగించి తీసుకెళ్లే బస్సులతో మీ పార్టీ కోసం సొంత డబ్బా కొట్టడం అవసరమా జగన్‌ అని నిలదీస్తున్నారు. అధికార పార్టీకి రాజకీయ లక్ష్యమే ముఖ్యం అనుకుందాం. మరి ఆర్టీసీ ఎండీ, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ద్వారకాతిరుమలరావు అయినా ఇది సరికాదని ఎందుకు అడ్డుచెప్పడం లేదు?

సీఎం అడిగినన్ని బస్సులు తరలించేసి, అధికార పార్టీకి సాగిలపడాల్సిన పరిస్థితి ఎండీకి ఎందుకొచ్చింది? పేదలు, సామాన్యులు ఎవరైనా పెళ్లికో, ఏదైనా వేడుకకో ఒక్క బస్సు కావాలని అడిగితే అది ఎన్ని కిలోమీటర్లు తిరుగుతుంది, ఎంతసేపు వేచి ఉండాలి తదితరాలన్నీ లెక్కించి, మొత్తం సొమ్మంతా కట్టించుకున్నాకే ఆర్టీసీ అధికారులు బస్సు పంపుతారు. అధికార వైసీపీ విషయంలో మాత్రం ఆర్టీసీ అధికారులకు ఈ నిబంధనలేవీ గుర్తురావడం లేదు. సీఎం జగన్‌ మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న సిద్ధం సభలకు వేలాది బస్సులు పంపేస్తున్నారు.

ప్రయాణికులు నరకం చూస్తున్నా సరే, జగన్‌ మోహన్ రెడ్డి పాల్గొనే సభలే మాకు ముఖ్యమంటూ ఆర్టీసీ యాజమాన్యం దాసోహమవుతోంది. ఈ బస్సులకు మొత్తం సొమ్ము ముందే తీసుకుంటున్నారా? అంటే ఏ సభకు పంపిన బస్సులకూ పూర్తిగా సొమ్ము రాబట్టలేదు. మూడు సభలకు పంపిన బస్సులకు వైసీపీ నుంచి ఇంకా 5 కోట్ల బకాయిలున్నాయి. ఇవి వసూలు చేయకుండానే, మేదరమెట్లలో జరిగే సిద్ధం సభకు 2 వేల 500 బస్సులు పంపేందుకు సిద్ధమైపోయారు. వివిధ సామాజికవర్గాల పేదలు ప్రయాణించే ఆర్టీసీ బస్సులను వేల సంఖ్యలో తన సిద్ధం సభకు తీసుకెళ్లిపోతున్నారు.

అన్నొచ్చాడంటే ప్రయాణికులకు కష్టాలే

బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద ఆదివారం వైసీపీ సిద్ధం సభ నిర్వహిస్తోంది. దీనికి ఎలాగైనా పెద్ద సంఖ్యలో ప్రజలను బలవంతంగా తరలించి, వైసీపీపై ఉన్న అభిమానంతో వచ్చేశారంటూ చూపేందుకు సిద్ధమవుతోంది. జనసమీకరణకు 2,500 బస్సులు కావాలంటూ వైసీపీ పెద్దలు ఆర్టీసీ అధికారులను కోరారు. ఇన్ని బస్సులు ఉమ్మడి గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, తిరుపతి జిల్లాల నుంచి సర్దుబాటు చేయాలంటే పలు డిపోల పరిధిలో ఉండే 70 నుంచి 80 శాతం బస్సులు అన్నీ సిద్ధం సభకే పంపేయాల్సి ఉంటుంది. అయినా సరే బస్సులు ఇచ్చి తీరాల్సిందేనని వైసీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. వివిధ జిల్లాల నేతలు ఇప్పటికే అధికారులకు ఫోన్లు చేసి ఏయే జిల్లాల్లో, ఏయే నియోజకవర్గాలకు ఎన్ని బస్సులు పంపాలో దిశానిర్దేశం కూడా చేస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఇంటర్‌ పరీక్షలు జరుగుతున్నాయి. విద్యార్థులు ఇళ్ల నుంచి పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు ఎక్కువగా ఆర్టీసీ బస్సులనే ఆశ్రయిస్తారు. శనివారం ఫస్టియర్ పరీక్ష, సోమవారం సెకండియర్ పరీక్ష ఉన్నాయి. ఈ మధ్యలో ఆదివారం 2 వేల 500 బస్సులు సిద్ధం సభకు తరలించబోతున్నారు. వివిధ జిల్లాల బస్సులను సిద్ధం సభకు ముందు రోజు సాయంత్రానికే పల్నాడు జిల్లాకు రప్పిస్తారు. ఆదివారం రాత్రి సభ ముగిసిన తరువాత ప్రజలను వారి గ్రామాల్లో దించి, మళ్లీ ఆ బస్సులు సొంత డిపోకు చేరేసరికి సోమవారం మధ్యాహ్నం అయిపోతుంది. అంటే శనివారం, సోమవారం సైతం ఇంటర్‌ ఎగ్జామ్స్ సమయంలో బస్సులు అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. ఇదే విషయాన్ని కొందరు ఆర్టీసీ అధికారులు వైసీపీ పెద్దలకు చెప్పినా సరే, అదేమీ పట్టించుకోకుండా 2 వేల 500 బస్సులు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నట్లు తెలిసింది.

సీఎం జగన్ పొలిటికల్ షో - రోడ్లపై నరకయాతన! బస్సులు లేక ప్రయాణికులకు - దారి మళ్లింపుతో డ్రైవర్లకు చుక్కలు!

భీమిలి, దెందులూరుల్లో జరిగిన సిద్ధం సభలకు పంపిన బస్సులకు ఆర్టీసీకి 40 లక్షల వరకు ఇవ్వాలి. రాప్తాడులో జరిగిన సిద్ధం సభకు తీసుకెళ్లిన 3 వేల బస్సుల బాపతు ఇంకా 4.5 కోట్ల రూపాయల వరకు ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంది. మొత్తం రూ.5 కోట్ల వరకు బకాయిలున్నా, వాటిని చెల్లించకుండా.. తాజాగా మేదరమెట్ల సభకు 2 వేల 500 బస్సులు తీసుకుంటున్నారు. వీటికి మరో 6 నుంచి 7 కోట్లు అవుతుంది. ఈ అడ్వాన్స్‌ ఇంకా చెల్లించలేదు. ఒకవేళ కట్టినా పూర్తిగా ఇస్తారనే నమ్మకమూ లేదు. బకాయిలు తర్వాత చూద్దామని ప్రభుత్వ పెద్దల నుంచి ఫోన్‌ వస్తే, కుదరదని చెప్పే ధైర్యం ఆర్టీసీ అధికారుల్లో కనిపించడం లేదు.

ఆర్టీసీ చరిత్రలో గతంలో ఎప్పుడూ కూడా వేలాదిగా బస్సులు రాజకీయ పార్టీల సభలకు తరలించిన దాఖలాల్లేవు. ప్రస్తుత ఎండీ, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ద్వారకా తిరుమలరావు వచ్చాకే ఆర్టీసీలో ఈ సంస్కృతి మొదలైంది. 2022 జులైలో వైసీపీ ప్లీనరీకి 1,857 బస్సులు కేటాయించి ఎండీ రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఎన్నికలకు ముందు రాప్తాడు సభకు 3 వేల బస్సులు పంపించి అధికార పార్టీకి జీహుజూర్‌ అనడంలో తన రికార్డును తానే తిరగరాశారు. ఇప్పుడు మేదరమెట్ల సభకు మరో 2 వేల 500 బస్సులు పంపేందుకు సన్నద్ధమయ్యారు. అన్ని పార్టీల విషయంలో ద్వారకాతిరుమలరావు ఇదే విధంగా వ్యవహరిస్తున్నారా అంటే అటువంటిదేమీ లేదు.

జగన్​ సేవకు అంకితమైన ఆర్టీసీ- సామాన్య జనానికి చుక్కలు చూపిస్తోన్న వైఎస్సార్సీపీ

కేవలం అధికార పార్టీకి బద్ధుడిలా వ్యవహరిస్తున్నారు. భీమిలి వద్ద టీడీపీ నిర్వహించిన యువగళం ముగింపు సభ కోసం ఆర్టీసీ బస్సులు ఇవ్వండి, డబ్బులు మొత్తం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని టీడీపీ నేతలు అభ్యర్థించినా ఒక్క బస్సు కూడా ఇవ్వలేదు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, రవాణా శాఖ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఆర్టీసీ ఎండీకి లేఖ రాసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇటీవల తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ-జనసేన ‘జెండా’ సభకు 150 బస్సులు అడిగితే, ఏవేవో కారణాలు చెప్పి ఒక్కటీ ఇవ్వలేదు.

అంతకు ముందు ఒంగోలు, రాజమహేంద్రవరంలలో టీడీపీ నిర్వహించిన మహానాడులకూ ఒక్క బస్సు ఇచ్చేందుకు కూడా ఎండీకి మనసు రాలేదు. అధికార పార్టీ కోసం ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఇంతలా దిగజారిపోవాలా అనే తీవ్ర విమర్శలు వస్తున్నా ఆయన ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. పోలీస్‌ బాస్‌ పదవి కోసం ఎదురుచూస్తున్న ఆయన, ప్రభుత్వ పెద్దలు ఎలా చెబితే అలా నడుచుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సీఎం సభ కోసం వేలాది ఆర్టీసీ బస్సులు తరలింపు- ఎక్కడి ప్రయాణికులు అక్కడే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.