ETV Bharat / state

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతల మధ్య పోలింగ్ - బూత్​ల వద్ద వైఎస్సార్సీపీ నేతల భీభత్సం - Joint Chittoor district Elections

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 13, 2024, 7:20 PM IST

Joint Chittoor district Elections 2024: ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పోలింగ్ కొనసాగింది. ఓటర్లను భయపెట్టటమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారపార్టీ నేతలు భీభత్సం సృష్టిస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Joint_Chittoor_District_Elections_2024
Joint_Chittoor_District_Elections_2024 (ETV Bharat)

Joint Chittoor district Elections 2024: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. చిత్తూరులో టీడీపీ అభ్యర్థి జగన్మోహన్‌ అనుచరుడు పవన్‌పై వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయానందరెడ్డి అనుచరులు రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన తీవ్ర గాయాలపాలైన జగన్మోహన్‌ అనుచరుడు పవన్‌ను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద ఉన్న 78, 80 పోలింగ్ కేంద్రాలలో తెలుగుదేశం ఏజెంట్‌పై వైఎస్సార్సీపీ ఏజెంట్‌ దాడి చేశాడు. దాడి చేసిన ఏజెంట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కాసేపటికి వదిలి పెట్టారు. దీంతో అతడు మళ్లీ పోలింగ్‌ కేంద్రంలోకి రావటంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన వాడిపై చర్యలు తీసుకోకుండా పోలింగ్‌ బూత్‌లోకి ఎలా పంపుతారంటూ పోలీసులను నిలదీశారు. టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ అక్కడికి చేరుకొని ఆందోళన చేపట్టారు. పోలీసులు ఏకపక్షంగా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహారిస్తున్నారని ఆరోపించారు. దాడికి పాల్పడిన వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలలోని పలు కేంద్రాల్లో వైఎస్సార్సీపీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. ననియాల 80వ బూత్ సమీపంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి భరత్ తన అనుచరులతో టీడీపీ శ్రేణులపై దాడికి పాల్పడ్డారు. పోలింగ్ కేంద్రాల్లోకి భరత్ తన అనుచరులతో కలిసి ప్రవేశించడాన్ని తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకున్నారు. సింగసముద్రంలో పోలింగ్ బూత్​లోకి వెళ్లిన భరత్ తలుపులు మూసివేయటంతో టీడీపీ శ్రేణులు నిరసనకు దిగారు. భరత్ తన అనుచరులతో భీభత్సం సృష్టిస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

శాంతిభద్రతలు కాపాడలేకపోయారు - హింసాత్మక ఘటనలపై చంద్రబాబు ఆగ్రహం - Chandrababu on Clashes in Palnadu

తిరుపతి జిల్లా చంద్రగిరిలో వైఎస్సార్సీపీ శ్రేణులు తెలుగుదేశం కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. పోలింగ్ బూత్​ను టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని పరిశీలించడానికి వెళ్లడంతో అక్కడే ఉన్న వైఎస్సార్సీపీ శ్రేణులు టీడీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేంద్ర బలగాలలోని ఓ సిబ్బంది గాల్లోకి ఫైరింగ్ చేయడంతో వివాదం సద్దుమణిగింది.

తిరుపతి జిల్లా అన్నమేడులో వైఎస్సార్సీపీ ఆగడాలను అడ్డుకున్న తెలుగుదేశం నాయకులపై ఎస్సై రఘునాథ్‌ దురసుగా ప్రవర్తించారు. ప్రశ్నించిన వారిపై పోలీసులు లాఠీలతో చితకబాదారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ వృద్ధురాలి తలకు గాయమైంది. పోలీసుల దురుసు ప్రవర్తనతో ఓటర్లు మండిపడ్డారు. గాయపడిన వృద్ధురాలని ఆసుపత్రికి తరలించారు.

సూళ్లూరుపేట నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేత దౌర్జన్యానికి దిగారు. పెళ్లకూరు మండలం రాజుపాలెం పోలింగ్‍ బూత్‌లోకి ప్రవేశించిన డీసీసీబీ ఛైర్మన్‌ సత్యనారాయణ రెడ్డి ఓటర్లను బెదిరించారు. పోలింగ్ కేంద్రంలో వైఎస్సార్సీపీ నేత బెదిరింపులకు దిగినా పోలీసులు మిన్నకుండిపోయారు. సత్యనారాయణ తీరుపై తెలుగుదేశం నేతలు నిరసనకు దిగారు.

సత్యవేడు నియోజకవర్గం కొవ్వకుల్లిలో పోలీసుల అత్యుత్సాహం చూపించారు. వరదయ్యపాలెం మండలం కొవ్వకుల్లిలో తెలుగుదేశం పార్టీ శిబిరంపై పోలీసులు దాడి చేశారు. పోలింగ్‍ కేంద్రానికి వంద మీటర్ల వెలుపల ఉన్న శిబిరంపై ఎస్సై ప్రతాప్, దాడికి పాల్పడ్డారని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. శిబిరంలో కుర్చీలను ధ్వంసం చేయడంతో పాటు పలువురు కార్యకర్తలపై లాఠీచార్జి చేశారు. దీంతో కార్యకర్తలు పోలీస్ వాహనాన్ని అడ్డుకుని నిరసనకు దిగారు.

హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్​ - 'ఆ ఎమ్మెల్యే'ను అదుపులోకి తీసుకోవాలని ఆదేశం - MLA house arrest

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.