ETV Bharat / state

రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా - కొండలే కాదు పొలాలూ కనుమరుగవుతున్నాయి

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 29, 2024, 9:39 AM IST

illegal_mining
illegal_mining

High Court Orders on Illegal Mining in Guntur District: గుంటూరు జిల్లాలో మైనింగ్ మాఫియా ధనదాహానికి కొండలు, గుట్టలే కాదు పచ్చని పంట పొలాలు కనుమరుగైపోతున్నాయి. మట్టిని సొమ్ము చేసుకునేందుకు అడ్డగోలుగా తవ్వకాలు చేస్తున్నారు. చేబ్రోలు మండల పరిధిలో వందల ఎకరాల్లో జరిగిన తవ్వకాలతో అడుగడుగునా పాతాళం లోతున గోతులు కనిపిస్తున్నాయి. ఈ విషయంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మట్టి తవ్వకాలపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అవసరమైన న్యాయాధికారితో విచారణ జరిపిస్తామని హైకోర్టు చెప్పటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా - కొండలే కాదు పొలాలూ కనుమరుగవుతున్నాయి

High Court Orders on Illegal Mining in Guntur District: గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం పరిధిలోని చేబ్రోలు మండలంలో అధికార పార్టీ అండతో మైనింగ్​ మాఫియా రెచ్చిపోతోంది. వీరనాయకునిపాలెం, శ్రీరంగపురం, వడ్లమూడి, శేకూరు, సుద్దపల్లి, శలపాడు గ్రామాల పరిధిలో ఎక్కువగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. ఇదంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే సాగుతోంది. అడ్డగోలుగా చేసిన తవ్వకాలతో భారీ గోతులు ఏర్పడ్డాయి. పాత క్వారీల్లో తవ్వటానికి ఇబ్బందులు వస్తుండటంతో పొలాలు, పండ్లతోటలు కొని వాటిలో తవ్వకాలు చేస్తున్నారు. ఎవరైనా పొలం ఇవ్వకపోతే బెదిరింపులకు దిగుతున్నారు. ఇలా భూములు కోల్పోయిన వారిలో ఎక్కువమంది దళితులు ఉన్నారు.

అక్రమ ఇసుక తవ్వకాలకు రజకుడు బలి - అధికార పార్టీ హత్యే అంటున్న స్థానికులు

అసైన్డ్ భూముల్లో పంటలు పండించుకుని జీవించే దళితుల్ని ఇబ్బందిపెట్టి వారి భూముల్లో తవ్వకాలు చేస్తున్నారు. ఇదేమని అడిగితే కేసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఎస్సీ కమిషన్ వచ్చి విచారణ జరిపి దళితుల భూముల్ని వారికి అప్పగించాలని ఆదేశించినా పట్టించుకోలేదు. పోలీసులు వేధించటం మానలేదు. దళిత రైతుల్ని ఇబ్బంది పెట్టడం ఆపకపోవడంతో రైతుల తరపున ప్రభుదాస్ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. రెండు ఏకరాల్లో అనుమతి తీసుకుని 60 ఎకరాల్లో తవ్వకాలు చేశారని, రైతులను బెదిరిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఏదైనా గ్రహానికి వెళ్లి రిపోర్టు తేవాలా ? - అక్రమ మైనింగ్​పై ప్రశ్నించిన హైకోర్టు

డీకే పట్టా భూముల్లో మైనింగ్ ఎలా చేస్తారని గనులశాఖ అధికారుల్ని ప్రశ్నిస్తే నీళ్లు నమిలారు. 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని గనులశాఖను హైకోర్టు ఆదేశించింది. అయితే సమయం చాలదని ప్రభుత్వ న్యాయవాది చెప్పటంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏదైనా ఉపగ్రహానికి వెళ్లి రిపోర్ట్ తేవాలా అని ప్రశ్నించింది. నిర్దేశిత గడువులోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. గనులశాఖ నివేదికలో తేడా ఉంటే న్యాయాధికారితో విచారణ జరిపిస్తామని తెలిపింది. ఇక్కడ జరిగే తవ్వకాల్లో చాలా వాటికి ఎలాంటి అనుమతులు లేవు. నిబంధనలేవి పాటించరు. పంటపొలాలు పాడైపోతున్నా, రోడ్లు ఛిద్రమవుతున్నా భూగర్భ జలాలు అడుగంటుతున్నా అడ్డుకునే ధైర్యం అధికారులకు లేదు. కొన్నిచోట్ల వంద అడుగుల కంటే లోతుగా తవ్వారు.

అటవీ భూముల్లో మట్టి మాయం- అధికారులకు కనిపించని అక్రమం

ప్రైవేట్‌ భూములు సైతం కొని తవ్వకాలు చేస్తున్నారు. మట్టి తవ్వకాలు ఆపాలని గ్రామస్థులు ధర్నా చేస్తే అధికారపార్టీ నేతలు పోలీసులతో దౌర్జన్యాలకు దిగుతున్నారు. మట్టి తరలించే క్రమంలో రోడ్లు గోతులు పడుతున్నాయి. ఈ మార్గంలో ద్విచక్రవాహనదారులు కిందపడి గాయపడుతున్నారు. సపోటా, మామిడి తోటలతో పాటు ఇతర పంటలపై దుమ్ము, ధూళి పడి ఫలసాయం తగ్గుతోంది. మట్టి తవ్వకాలతో ఏర్పడిన భారీ గోతుల్లో పడి పిల్లలు చనిపోతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగంలో చలనం లేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.