ETV Bharat / state

హైదరాబాద్​లో ఈదురుగాలులతో కూడిన వర్షం - చెట్టు విరిగిపడి ఇద్దరు మృతి - 2 Persons Died In Tree Fall

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 26, 2024, 7:30 PM IST

Heavy Rain Effect in Hyderabad : హైదరాబాద్​ పరిసర ప్రాంతాల్లో ఇవాళ ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. పలుచోట్ల భారీ ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గాలి దుమారంతో కూడిన వర్షాల కారణంగా రోడ్డుపక్కన చెట్లు విరిగిపడి రెండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

Heavy Rain in Hyderabad
Heavy Rain in Hyderabad (ETV Bharat)

Heavy Rain Effect in Hyderabad : హైదరాబాద్‌ నగరంలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. ఎల్బీనగర్, వనస్థలిపురం, కాచిగూడ, నల్లకుంట, ఉప్పల్, మన్సూరాబాద్‌, మల్కాజిగిరిలలో, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హయత్‌నగర్ ప్రాంతంలో ఈదురుగాలుల ధాటికి రేకులు, గుడిసెలు ఎగిరిపోయాయి.

Two Persons Killed in Tree Fall Incidents : మరోవైపు మేడ్చల్‌ జిల్లా కీసర మండలంలోనూ గాలులు ఉద్ధృతంగా వీచాయి. తిమ్మాయిపల్లి నుంచి శామీర్ పేట్ వెళ్లే దారిలో, గాలి దుమారంతో కూడిన వర్షాల కారణంగా రోడ్డుపక్కన చెట్లు విరిగిపడి రెండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తిపై కొమ్మ పడటంతో, అతను అక్కడికక్కడే మృతి చెందాడు.

అదే వాహనంపై ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో, స్థానికులు చికిత్సా నిమిత్తం ఈసీఐఎల్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతులు యాదాద్రి జిల్లా బొమ్మలరామారం గ్రామానికి చెందిన నాగిరెడ్డి రామ్‌రెడ్డి(48), ధనుంజయ(45) లుగా పోలీసులు గుర్తించారు.

రాత్రికి తీరం దాటనున్న రెమాల్ తుపాను - గంటకు 135 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు - CYCLONE REMAL EFFECT

GHMC Officials Alert on Heavy Rains : మృతులు శామీర్ పేటలోని ఓ న్యాయవాదిని కలిసేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఈ ఘటనలో గణేశ్​ దేవాలయం ప్రాంగణంలోని చెట్టు పడడంతో కారు, ఆటో స్వల్పంగా ధ్వంసం అయ్యాయి.

అదేవిధంగా ఎన్జీవోస్ కాలనీ ప్రధాన రహదారిపై, రైతు బజార్ సమీపంలో పార్క్, గుడాసాయి నగర్, సత్యనగర్​లలో భారీ చెట్లు పడిపోవడం, పలు చోట్ల ఈదురుగాలులకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. జీహెచ్​ఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాలి దుమారం, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి సమయంలో బయట ఎవరూ తిరగవద్దని అధికారులు కోరుతున్నారు.

Telangana Weather Report Today : మరోవైపు పడమర, వాయువ్య దిశల్లో తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్లు ఐఎండీ వెల్లడించింది. శనివారం ఆగ్నేయ రాజస్థాన్‌లో ప్రారంభమై మధ్యప్రదేశ్‌, విదర్భ మీదుగా తెలంగాణ వరకు సముద్రమట్టానికి 0.9కి.మీ ఎత్తులో కొనసాగిన ద్రోణి క్రమేపీ ఇవాళ బలహీనపడింది. దీని ఫలితంగానే రాష్ట్రంలో ఈదురు గాలులు వీస్తున్నాయి. కాగా, నైరుతి రుతుపవనాలు నైరుతి, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని వాతావరణశాఖ తెలిపింది.

తెలంగాణలో ఈదురుగాలులకు కూలిన రేకుల షెడ్డు - 10 ఏళ్ల చిన్నారి సహా నలుగురి దుర్మరణం - Four People Died In Nagarkurnool

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.