ETV Bharat / state

ఆయనే కావాలి - ధర్మారెడ్డి డిప్యుటేషన్​ పొడిగించాలని కేంద్రానికి జగన్​ లేఖ - CM Jagan on TTD EO Deputation

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 24, 2024, 10:46 AM IST

CM_Jagan_on_TTD_EO_Deputation_Extension
CM_Jagan_on_TTD_EO_Deputation_Extension

CM Jagan on TTD EO Deputation Extension: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఈవోగా, టీటీడీ పరిధిలోని పలు సంస్థల డైరెక్టర్‌గా ఏకకాలంలో వివిధ పోస్టులు నిర్వహిస్తున్న ఏవీ ధర్మారెడ్డితో సీఎం జగన్‌ బంధానికి, ఆయనపై ముఖ్యమంత్రి చూపించే ప్రేమకు ఇదో మచ్చుతునక. టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి ఉంటేనే అన్నీ సాఫీగా నడుస్తాయని, డిప్యుటేషన్‌ పెంచాలంటూ కేంద్రానికి లేఖ రాశారు. పదవీ విరమణ వరకు టీటీడీలోనే కొనసాగించాలని కోరారు.

CM Jagan on TTD EO Deputation Extension: టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై సీఎం జగన్ ప్రేమ మరోసారి బయటపడింది. ఐడీఈఎస్‌ (Indian Defense Estates Service) నుంచి వచ్చిన ధర్మారెడ్డికి కేంద్రం ఇప్పటికే పొడిగించిన రెండేళ్ల డిప్యుటేషన్‌ గడువూ ఈ ఏడాది మే 14తో ముగుస్తోంది. ఈ సంవత్సరం జూన్‌ 30కి ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. లెక్క ప్రకారం ఆయన మే 14వ తేదీన కేంద్ర సర్వీసులకు తిరిగి వెళ్లాలి. కానీ, ఆత్మబంధువులాంటి ధర్మారెడ్డిని జగన్‌ అంత తేలిగ్గా వదులుకోవడానికి సిద్ధంగా లేరు. జూన్‌ 30వ తేదీన ఆయన పదవీ విరమణ చేసేంత వరకు డిప్యుటేషన్‌ను పొడిగించాలంటూ దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఈ నెల 12న సీఎం జగన్‌ లేఖ రాశారు.

ఇవేం సాకులు అస్సలు: ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడానికి నాలుగురోజుల ముందు జగన్‌ ఈ లేఖ రాయడం విశేషం. ధర్మారెడ్డిని జూన్‌ నెలాఖరు వరకు టీటీడీ ఈవోగా కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని లేఖలో సీఎం చెప్పిన కారణాలు చూస్తే బడి ఎగ్గొట్టేందుకు ఏ ఆరో తరగతి పిల్లవాడో హెడ్మాస్టర్‌కు రాసిన లేఖలో చెప్పే సాకులు గుర్తొస్తాయి.

జగన్‌కు ధర్మారెడ్డి నమ్మినబంటని, దిల్లీ స్థాయిలో తనకున్న పరిచయాలతో కావలసిన పనులు చేసిపెడతారని, కేంద్ర ఎన్నికల సంఘం వంటి సంస్థల్లోనూ పలుకుబడి ఉపయోగిస్తారని, ‘అతి సున్నితమైన’ వ్యవహారాలనూ సీఎం కోసం సునాయాసంగా చక్కబెడతారని పేరుంది. టీటీడీ చరిత్రలో అనేక దశాబ్దాల తర్వాత నాన్‌ ఐఏఎస్‌ అధికారిని ఈవోగా నియమించడమే కాకుండా, ఎంతకాలం వీలైతే అంతకాలం ఆయన్ను ఆ పోస్టులో కొనసాగించేలా చూసేందుకు సీఎం ప్రయత్నించడం విశేషం.

అధికార పార్టీకి అనుకూలంగా టీటీడీ నిర్ణయాలు- రెండు నెలల్లో మూడుసార్లు సమావేశాలు

ధర్మారెడ్డి ఉండకపోతే కష్టమట: వేసవి రద్దీ, ఇతర సమయాల్లో ఈవో ధర్మారెడ్డి సమర్థంగా వ్యవహరిస్తున్నారని, ఆయన ఇంటర్‌ కేడర్‌ డిప్యుటేషన్‌ను ప్రధాని పెద్ద మనసుతో రెండేళ్లు పొడిగించారని అన్నారు. ఆ గడువు మే 14తో ముగుస్తోందని, మే, జూన్‌ నెలల్లో తిరుమలలో రద్దీ దృష్ట్యా ఈవో వంటి కీలకమైన పోస్టుల్లో ఉన్నవారిని మార్చడం సరికాదని సీఎం పేర్కొన్నారు. అనుభవంలేనివారిని ఈ పోస్టులో ఉంచితే నిర్వహణపరమైన లోపాలు తలెత్తి సంక్షోభానికి దారితీస్తుందన్న సీఎం జగన్, శాంతిభద్రతల సమస్యగా మారుతుందని అని ఆ లేఖలో ఏకరవు పెట్టారు.

ఇదివరకెప్పుడూ వేసవి సెలవులే రానట్టూ, అప్పుడు రద్దీ లేనట్టూ, గతంలో ఉన్న అధికారులు ఎవరూ అటువంటి పరిస్థితుల్ని చూడనట్టూ సీఎం జగన్‌ పేర్కొనడం విడ్డూరం. కీలకమైన ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను, డీజీపీలనే ఉన్నపళంగా మార్చేస్తోంది. టీటీడీ ఈవోను మారిస్తే వ్యవస్థే స్తంభించిపోతుందన్నట్టు సీఎం లేఖ రాయడం వెనుక వేరే ప్రయోజనం కాక మరేముంటుంది?

తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వివాదాలు - ఆజ్యం పోస్తున్న బోర్డు

మరిన్ని ఆణిముత్యాలు: సీఎం రాసిన లేఖలో మరిన్ని ఆణిముత్యాలున్నాయి. అన్ని రాష్ట్రాలకు చెందిన చాలా మంది అధికారులను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికల పరిశీలకులుగా నియమించిందని, ఎన్నికలు ముగిసేంత వరకు టీటీడీ ఈవోగా నియమించేందుకు సరైన అధికారి దొరకడం కష్టమవుతుందని సీఎం పేర్కొన్నారు. జూన్‌ నెలాఖరుకు మాత్రమే టీటీడీ ఈవోగా మరో అధికారిని నియమించే అంశాన్ని పరిశీలించగలమని స్పష్టం చేశారు.

చివరిగా కాస్త సెంటిమెంట్: కేంద్ర డిఫెన్స్‌ సర్వీస్‌కు చెందిన ధర్మారెడ్డి సేవలను ఎలా వాడుకోవాలో అనేది కూడా ముఖ్యమంత్రి జగనే రక్షణ మంత్రికి సలహానిచ్చారు. ధర్మారెడ్డి జూన్‌ 30న పదవీ విరమణ చేస్తున్నారని, మే 14న ఆయన రిపోర్టు చేసినా, పదవీ విరమణకు గడువు తక్కువే ఉన్నందున ఆయన సేవలను మాతృసంస్థ సమర్థంగా ఉపయోగించుకోలేకపోవచ్చని పేర్కొన్నారు. లేఖలో ప్రస్తావించిన అంశాలన్నీ దృష్టిలో ఉంచుకుని ధర్మారెడ్డి డిప్యుటేషన్‌ను ఆరు వారాలు పొడిగించండని, తన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందిస్తే లక్షల మంది భక్తులకు సాఫీగా దర్శనమవుతుందని అన్నారు. మీకు, మీ కుటుంబానికి ఆ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని లేఖలో సీఎం కాస్త సెంటిమెంట్‌నూ రంగరించారు.

దైవసన్నిధిలో వ్యక్తిగత కక్షలతో వ్యవహరిస్తున్నారు- టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై బీజేపీ నేత ఆగ్రహం

ధర్మారెడ్డి ఒక్కరే దిక్కని ఎలా చెబుతారు: టీటీడీకి ధర్మారెడ్డి ఒక్కరే దిక్కన్నట్టు సీఎం చెప్పడమేంటని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్‌ నవీన్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతోమంది అపారమైన అనుభవం, నిజాయతీగల ఐఏఎస్‌ అధికారులు ఈవోలుగా సేవలందించారని, ఈ విషయాన్ని సీఎం జగన్ గుర్తించాలని కోరారు. ధర్మారెడ్డినే పూర్తి అదనపు బాధ్యతతో ఈవోగా ఎందుకు కొనసాగిస్తున్నారని, శ్రీవారికి సంబంధించిన బ్యాంకు డిపాజిట్లు, ఆర్థిక లావాదేవీలు సక్రమంగా జరుగుతున్నాయా అనే అనుమానాలు భక్తుల్లో కలుగుతున్నాయని అన్నారు. ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని తక్షణం ధర్మారెడ్డిని బదిలీ చేయాలని కోరారు.

అవినాష్‌రెడ్డిని తప్పించడానికి టీటీడీ ఈవో దిల్లీలో లాబీయింగ్‌: బుచ్చి రాంప్రసాద్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.