ETV Bharat / state

నమ్మకంగా ఉంటూ నట్టేట ముంచాడు - ఏకంగా రూ.3.26 కోట్లు పక్కదారి పట్టించాడు - Yashoda Employee Fraud in Hyderabad

author img

By ETV Bharat Telangana Team

Published : May 15, 2024, 12:28 PM IST

Employee Looted Yashoda Hospital Groups : అన్నం పెట్టిన సంస్థకే కన్నం వేశాడో ఓ ప్రభుద్దుడు. తన అధికారాన్ని ఉపయోగించుకొని ఉద్యోగుల వేతనాలను స్వాహా చేశాడు. ఇలా ఏకంగా దశల వారీగా రూ.3.26 కోట్లు దారి మళ్లించాడు. చివరికి యాజమాన్యం గుర్తించడంతో మోసం బయటపడింది. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది.

Yashoda Employee Fraud in Hyderabad
Yashoda Employee Fraud in Hyderabad (ETV Bharat)

Yashoda Employee Fraud in Hyderabad : పనిచేస్తున్న సంస్థకే కన్నం వేశాడు ఓ కేటుగాడు. ఏకంగా రూ.3.26 కోట్లు పక్కదారి పట్టించాడు. ఉద్యోగులకు చెల్లించే జీతాలజాబితాలో తన కుటుంబసభ్యుల పేర్లు చేర్చి, 2021 మే నుంచి 2023 సెప్టెంబర్ మధ్య ఈ మొత్తం స్వాహా చేశాడు. తీరా నిధుల మళ్లింపును గుర్తించిన యాజమాన్యం సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో గ్రూపులో చోటుచేసుకుంది.

ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన నౌపడ రామ్‌నర్సింగ్‌ యశోదా ఆసుపత్రి గ్రూపులో మేనేజర్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ హోదాలో 2020లో ఉద్యోగంలో చేరాడు. యశోదా గ్రూపు ఆధ్వర్యంలోని యశోదా సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ ఉద్యోగులు, యశోదా హెల్త్‌కేర్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, డాక్టర్లకు వేతనాలు, అద్దె, భద్రతా సిబ్బందికి చెల్లింపులు, తదితర వ్యవహారాలను అతను చూస్తుంటాడు. అయితే గత నవంబర్‌లో రామ్‌నర్సింగ్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయాడు.

ఈ సంవత్సరం ఏప్రిల్‌లో సంస్థ ఆర్థిక వ్యవహారాలను సమీక్షిస్తునపుడు వేతనాల అడ్వాన్స్ జాబితా కింద అనుమానాస్పద చెల్లింపులు జరిగినట్లు యాజమాన్యం నిర్ధారించింది. బ్యాంకుల లావాదేవీలను పరిశీలించగా సంస్థతో సంబంధం లేని ఖాతాల్లో నిధులు జమైనట్లు తెలిసింది. నౌపడ రామ్‌నర్సింగ్‌, నౌపడ కామేశ్వరి, పాలెపు శ్రీరామ్‌మూర్తి, వెదురుపర్తి ప్రవీణ పేరిట ఉన్న అకౌంట్లలో ఇవి జమయ్యాయి. రామ్‌నర్సింగ్‌ తనకున్న అధికారంతో రూ.3.26 కోట్లను మళ్లించి వీరి ఖాతాలో జమ చేయించినట్లు యాజమాన్యం గుర్తించింది.

Hyderabad Theft case: అత్త ఇంటికి అల్లుడు కన్నం.. చివరకు పోలీసులకు చిక్కాడు!

పేర్లు మార్చి నిధులు స్వాహా : అయితే యశోదా సంస్థ మానవ వనరుల విభాగం ఉద్యోగుల వేతనాల చెల్లింపునకు ప్రతి నెలా ఓ జాబితాను సిద్ధం చేస్తుంది. ఉద్యోగుల పేరు, వేతనం, బ్యాంకు అకౌంట్‌ నంబర్లతో ఆ జాబితాను భౌతికంగా, సాఫ్ట్‌కాపీ రూపంలో రామ్‌నర్సింగ్‌కు వస్తుంది. అతడు తన కింది ఉద్యోగుల ద్వారా చెక్కులు సిద్ధం చేసి బ్యాంకులకు పంపిస్తే వారి ఖాతాల్లో వేతనాలు జమవుతాయి. ఇక్కడే రామ్‌నర్సింగ్‌ మోసానికి పాల్పడ్డాడు.

వేతనాల జాబితా సాఫ్ట్‌కాపీని తన ఈ-మెయిల్‌ నుంచి బ్యాంకుకు పంపేటప్పుడు కొందరు ఉద్యోగుల స్థానంలో తన పేరు,భార్య, మరో ఇద్దరి పేర్లు, బ్యాంకు అకౌంట్ల నంబర్లు చేర్చాడు. అలాగే బ్యాంకు ఈ జాబితాలోని ఖాతాలకు వేతనాలు జమచేసింది. దీన్ని దాచేందుకు రామ్‌నర్సింగ్‌ అదనంగా కొన్ని చెక్కులు సిద్ధం చేసేవాడు. తొలి జాబితాలో తొలగించిన ఉద్యోగుల పేర్లను చేర్చి మళ్లీ బ్యాంకులకు పంపేవాడు. అప్పుడు శాలరీరాని వారికీ జమయ్యేది. నిందితుడు మోసం బయటపడకుండా సంస్థ డేటాను తొలగించాడు. ఇలా 19 నెలలల్లో రూ.3.26 కోట్లు కొట్టేశారని పోలీసులు తెలిపారు. హాస్పిటల్స్‌ గ్రూపు ఫైనాన్స్‌ కంట్రోలర్‌ ఫిర్యాదుతో రామ్‌ నర్సింగ్‌, అతని భార్య కామేశ్వరి, వెదురుపర్తి ప్రవీణ, పాలెపు శ్రీరామ్‌, మరికొందరి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చామని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు.

పనిచేసే బ్యాంకుకే కన్నం 20 కోట్ల విలువైన బంగారం చోరీ

అన్నం పెట్టిన సంస్థకే కన్నం.. నకిలీ బంగారం పెట్టి రూ.కోటితో ఉడాయించిన ఉద్యోగి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.