ETV Bharat / politics

కాంగ్రెస్‌లోకి చేరికల ప్రవాహం - ఆ 7 స్థానాల్లో గెలుపు గుర్రాల కోసం 'ఆకర్ష్' వ్యూహం!

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 9, 2024, 7:20 AM IST

Telangana Congress Joinings : రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టి ఊపు మీదున్న కాంగ్రెస్‌లోకి చేరికల ప్రవాహం మొదలవుతోంది. చేరికలను ఆహ్వానించాలని హస్తం పార్టీ నాయకత్వం నిర్ణయించడంతో ఇతర పార్టీలకు చెందిన నేతలు ఒక్కొక్కరుగా గాంధీభవన్‌ బాట పడుతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో వీలైనన్ని సీట్లను దక్కించుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్న కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వం, బలమైన నేతలను బరిలోకి దించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 15 వరకు వరుసగా చేరికలుంటాయని కాంగ్రెస్‌ నేతలు అంచనా వేస్తున్నారు.

Congress on Parliament Elections 2024
Telangana Congress Joinings

కాంగ్రెస్​కు 10 స్థానాల్లో బలమైన అభ్యర్థులు మిగిలిన 7 స్థానాలకై వేట

Telangana Congress Joinings : పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కాంగ్రెస్‌ నాయకత్వం కసరత్తులు చేస్తోంది. వ్యవస్థల పునః నిర్మాణం పేరుతో పాలనాపరంగా చర్యలు చేపడుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం, అటు పార్టీపరంగా ఎత్తులకు పైఎత్తులేస్తూ, ప్రత్యర్థులను చిత్తుచేసేలా వ్యూహాలు పన్నుతోంది. గత శాసనసభ ఎన్నికల్లో పార్టీ ప్రభావం చూపని నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించిన కాంగ్రెస్‌ నాయకత్వం, ఆయా చోట్ల ఇతర పార్టీలకు చెందిన బలమైన నేతలను తమవైపు తిప్పుకునేందుకు అంతర్గతంగా మంతనాలు జరుపుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల బీఆర్ఎస్​కు చెందిన ఓ ఎంపీని తమవైపు తిప్పుకోవటంతో చేరికలకు(Congress Joinings) తెరతీస్తూ వరుసగా కండువాలు కప్పుతున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్​లో కాకరేపుతున్న వెంకటేశ్​ నేత చేరిక - మొదలైన గ్రూపు రాజకీయాలు

Congress Strong MP Candidates in Telangana : రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలకు 10 చోట్ల మాత్రమే పార్టీకి చెందిన బలమైన నేతలు ఉన్నట్లు కాంగ్రెస్ నాయకత్వం గుర్తించింది. మిగిలిన 7 స్థానాల్లోనూ సత్తా చాటాలంటే అందుకు తగిన గెలుపు గుర్రాలను ఎంపిక చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఇతర పార్టీలకు చెందిన వారిని ఆకర్షిస్తోంది. ప్రధానంగా హైదరాబాద్‌, మల్కాజిగిరి, చేవెళ్ల, సికింద్రాబాద్‌, వరంగల్‌, నల్గొండ, నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్థులు అవసరమని అంచనా వేస్తోంది.

ఖమ్మం లోక్‌సభ అభ్యర్థ్విత్వం కోసం కాంగ్రెస్‌లో పోటాపోటీ - సోనియాగాంధీ బరిలో నిలిచేనా!

Congress Parliament Election Plan : అత్యంత బలహీనంగా ఉన్న హైదరాబాద్‌ నగరంలో పార్టీ బలోపేతానికి పీసీసీ నడుం బిగించింది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్​(BRS)లో అసంతృప్తిగా ఉన్న జీహెచ్​ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్‌ బాబా ఫసీయుద్దీన్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. రేవంత్‌రెడ్డి సన్నిహితుడైన ఓ నేత ఇతర పార్టీలకు చెందిన వారితో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల్లో బీఆర్ఎస్​, బీజేపీకి చెందిన దాదాపు 20 మంది కార్పొరేటర్లు హస్తం గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు బీఆర్ఎస్​కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ప్రజల్లో బలం ఉన్న నాయకులతోనూ కాంగ్రెస్‌ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌ కారు దిగి, కాంగ్రెస్‌లో చేరారు. పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న నేతల జాబితా ఇప్పటికే అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లినట్లు చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేల చేరికల విషయంలో మాత్రం కాంగ్రెస్‌ నాయకత్వం ఆచితూచి అడుగులేస్తోంది.

అసెంబ్లీకి రాని ప్రతిపక్షనాయకుడు మనకు అవసరమా? - కేసీఆర్​పై కాంగ్రెస్ నేతల ఫైర్

Jagga Reddy Intresting Comments on Joinings : కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్​కు చెందిన ఉమ్మడి మెదక్‌ జిల్లా ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. దీంతో పార్టీ మార్పులపై పెద్దఎత్తున ఊహాగానాలు వచ్చాయి. ఇప్పటికిప్పుడే ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవద్దని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. అధిష్ఠానం నుంచి వచ్చే ఆదేశాల మేరకు ముందుకెళ్లాలని ఆలోచిస్తోంది. దాదాపు 20 మంది వరకు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జగ్గారెడ్డి(Jagga Reddy) వెల్లడించటంతో చేరికల అంశానికి మరింత బలం చేకూరినట్టైంది.

"బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు ఎప్పటికైనా కాంగ్రెస్​లోకి వస్తారు. ఈ భయం ఉన్నందునే కేటీఆర్, హరీశ్​రావు ప్రయత్నాలు చేస్తున్నారు. కేటీఆర్ కుట్రలను తిప్పికొడతాం. వీలైనంత త్వరగా బీఆర్ఎస్​ 20 మంది ఎమ్మెల్యేలను తీసుకుంటాం. దాని తరవాత మరిన్ని ఆటలు నడుస్తాయి."- జగ్గారెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్ నేత

Congress on Parliament Elections 2024 : ఇదిలా ఉండగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి ఆయన సతీమణి, వికారాబాద్ జడ్పీ ఛైర్‌పర్సన్‌ సునీతా మహేందర్‌ రెడ్డి గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)తో భేటీ అయ్యారు. మంత్రి దామోదర్‌ రాజనర్సింహ, రోహిణ్‌రెడ్డితో కలిసి సీఎంను కలిసిన గులాబీ పార్టీ నేతలు చేవెళ్ల లోక్‌సభ టికెట్‌ ఇస్తే కాంగ్రెస్‌లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ అంశంపై అధిష్ఠానంతో చర్చించి ఏఐసీసీ ఆదేశాల మేరకు ముందుకెళ్లాలని పీసీసీ అధ్యక్షుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికల సన్నాహాల వేళ కాంగ్రెస్‌లోకి మొదలైన చేరికల ప్రవాహం పెద్దఎత్తున ఉండే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

చేరికలను ఆహ్వానిస్తూ, బలమైన అభ్యర్థులను ఎంపిక చేస్తూ - 'పార్లమెంట్​'లోనూ హస్తం 'అసెంబ్లీ' స్ట్రాటజీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.