ETV Bharat / politics

అభ్యర్థుల మార్పుపై 24 గంటల్లోనే మాట మార్చిన జగన్‌- 5నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తల మార్పు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 29, 2024, 7:26 AM IST

Huge Changes in YSRCP MLA Candidates List: ఒకటో అరో తప్ప మార్పులుండవంటూ జగన్‌ చెప్పి 24 గంటలు కాక ముందే 5 స్థానాల్లో అభ్యర్థులను మారుస్తూ వైసీపీ 8వ జాబితా విడుదలైంది. అందులోనూ మూడుచోట్ల ఇంతకు ముందు మార్చిన వాటినే ఇప్పుడు మళ్లీ మార్చారు.

Huge_Changes_in_YSRCP_MLA_Candidates_List
Huge_Changes_in_YSRCP_MLA_Candidates_List

Huge Changes in YSRCP MLA Candidates List: ఎమ్మెల్యే అభ్యర్థుల టికెట్లన్నీ దాదాపు ఖరారైనట్లే ఇక ఒకటో అరో ఉంటాయంతే అని మంగళవారం పార్టీ నేతల సమావేశంలో చెప్పిన జగన్‌(CM Jagan) బుధవారం సాయంత్రానికే మాట మార్చేశారు. ఐదు నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తలను మార్చారు. అందులోనూ మూడుచోట్ల ఇంతకు ముందు మార్చిన వాటినే ఇప్పుడు మళ్లీ మార్చారు.

మొత్తంగా రెండు లోక్‌సభ, మూడు అసెంబ్లీ స్థానాల్లో మార్పులతో 8వ జాబితా(YSRCP MLA Candidates Eighth List)ను బుధవారం విడుదల చేశారు. పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా మంత్రి అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళిని బుధవారం ప్రకటించారు. సత్తెనపల్లి నుంచి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు మురళికి కూడా అవకాశం కల్పించడంతో ఆ కుటుంబానికి రెండు సీట్లు కేటాయించినట్లయింది.

అయితే వైసీపీని వీడి వెళ్లిపోయిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(Mangalagiri MLA Alla Ramakrishna Reddy) వద్దకు దూతలను పంపి సంప్రదింపులు జరిపి ఏదో ఒకచోట సీటిస్తామనే భరోసా ఇచ్చి మరీ ఇటీవలే తిరిగి పార్టీలో చేర్చుకున్నారు. ఆర్కేని సత్తెనపల్లికి పంపవచ్చన్న ప్రచారం ఆయన తిరిగి పార్టీలోకి వచ్చినప్పటి నుంచి జరుగుతోంది.

వైఎస్సార్సీపీ గుండాలు రెచ్చిపోతే ఎముకలు విరగ్గొడతాం: పవన్ కల్యాణ్

పైగా సత్తెనపల్లిలో ఆర్కే(RK) సామాజికవర్గానికి చెందిన వైసీపీ నేతలు మంత్రి రాంబాబుని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తమ్ముడికి పొన్నూరు సీటివ్వడంతో అంబటి రాంబాబును సత్తెనపల్లిలో కొనసాగిస్తారా లేదా మారుస్తారా అనే చర్చ మొదలైంది. కందుకూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి, సీనియర్‌ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డిని పక్కనపెట్టి ఆయన స్థానంలో కటారి అరవిందా యాదవ్‌ను పార్టీ సమన్వయకర్తగా ఈ నెల 12న నియమించారు.

ఆమె తండ్రి డాక్టర్‌ పెంచలయ్య ఈ నెల మొదటివారంలో సీఎం సమక్షంలో వైసీపీలో చేరారు. అప్పుడు ఆయనతోపాటు వచ్చిన కుమార్తె అరవిందను 16న పార్టీ సమన్వయకర్తగా నియమించేశారు. ఆమె నియోజకవర్గంలో అడుగుపెట్టకుండానే బుధవారం కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ను కందుకూరు సమన్వయకర్తగా ప్రకటించారు.

గుంటూరు లోక్‌సభ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు ఉమ్మారెడ్డి వెంకటరమణను ఈనెల 2న నియమించారు. ఆయన ఒకసారి మాత్రమే ఆ నియోజకవర్గానికి వచ్చి తర్వాత దూరంగా ఉన్నారు. దీంతో చేసేది లేక రమణను తప్పించి ఆయన స్థానంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు, పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్యను బుధవారం నియమించారు.

వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసింది: బాలకృష్ణ

గంగాధర నెల్లూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి(Deputy CM Narayanaswamy) ఈసారి తన కుమార్తె కృపాలక్ష్మికి టికెట్‌ ఇవ్వాలని పలుమార్లు ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. అప్పట్లో ముఖ్యమంత్రి స్పందించలేదు. జనవరి 18న నారాయణస్వామిని చిత్తూరు లోక్‌సభకు మార్చారు. ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడం, ఆయన వర్గీయులు పార్టీకి రాజీనామాలు చేసేందుకు సిద్ధపడటంతో అధిష్ఠానం నిర్ణయాన్ని మార్చుకుంది.

నారాయణస్వామిని మళ్లీ గంగాధర నెల్లూరుకే పంపుతున్నట్లు ఈనెల 2న ప్రకటించింది. బుధవారం మళ్లీ నారాయణస్వామిని తప్పించి ఆయన కుమార్తె కృపాలక్ష్మిని సమన్వయకర్తగా నియమించింది. ఒంగోలు లోక్‌సభ వైసీపీ సమన్వయకర్తగా ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కరరెడ్డిని వైసీపీ పెద్దలు గత నెలలోనే ఖరారు చేసినప్పటికీ సిటింగ్‌ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తనంతట తానుగా పార్టీని వీడి వెళ్లే వరకు వేచి చూశారు. బుధవారం ఉదయం మాగుంట పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగానే సాయంత్రానికి చెవిరెడ్డి పేరును అధికారికంగా వెల్లడించారు.

దుర్మార్గ పాలన అంతం చేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి: రఘురామకృష్ణ రాజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.