ETV Bharat / international

గాజాలో మారణహోమం- సాయం కోసం ఎదురుచూస్తున్నవారిపై ఇజ్రాయెల్ దాడి- 70మంది మృతి

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 29, 2024, 3:04 PM IST

Updated : Feb 29, 2024, 4:34 PM IST

Israel Attack On Palestine Today : తాజాగా గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో మానవతా సాయం కోసం ఎదురుచూస్తున్న దాదాపు 70 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. 280 మందికి పైగా గాయాలపాలయ్యారు. తాజా ఘటనతో మృతుల సంఖ్య 30వేలు దాటిందని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది.

Israel Attack On Palestine Today
Israel Attack On Palestine Today

Israel Attack On Palestine Today : ఇజ్రాయెల్ దాడులతో గాజా అట్టుడుకుతోంది. తాజాగా పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ దళాలు చేసిన దాడుల్లో మానవతా సహాయం కోసం ఎదురుచూస్తున్న దాదాపు 70 మందిమృతి చెందారు. 280 మందికిపైగా గాయపడ్డారు. ఈ మేరకు షిఫా ఆస్పత్రిలోని నర్సింగ్ విభాగం హెడ్​ డాక్టర్ జాదల్లా షఫాయి తెలిపారు. అయితే ఈ నివేదికలను తాము పరిశీలిస్తున్నట్లు ఇజ్రాయెల్ పేర్కొంది.

గాడిద బండ్లపై మృతదేహాలు
దాడి జరిగిన ప్రాంతంలో నేలమీద పడిఉన్న డజన్లకొద్దీ మృతదేహాలను వైద్యులు చూశారని కమల్ అద్వాన్ ఆస్పత్రిలోని అంబులెన్స్​ సేవల హెట్​ ఫేర్స్​ అఫానా తెలిపారు. క్షతగాత్రులు, మృతదేహాలను తీసుకెళ్లేందుకు సరిపడా అంబులెన్స్​లు లేక, కొందరిని గాడిద బండ్లపై ఆస్పత్రులకు తరలిస్తున్నట్లు తెలిపారు.

బ్యాటరీలతో నడుస్తున్న ఆపరేషన్​ థియేటర్
గాయపడిన వారు ఇంకా ఆస్పత్రికి వస్తున్నారని అల్​-అవుదా ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ మొహమ్మద్ సల్హా తెలిపారు. రిసెప్షన్​ వద్ద, ఎమర్జెన్సీ గదుల్లో చాలా మంది ఉన్నారని చెప్పారు. మృతుల సంఖ్య ఇంకా పెరికే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ ఆస్పత్రిలో విద్యుత్​ లేదన్న సల్హా, బ్యాటరీ పవర్​తో ఆపరేషన్​ థియేటర్​ను నడిపిస్తున్నామని తెలిపారు. అయితే ఆ బ్యాటరీ బ్యాకప్​ కూడా కొన్ని గంటలు మాత్రమే వస్తుందని చెప్పారు. దాదాపు ఐదు నెలలుగా జరుగుతున్న ఇజ్రాయెల్-హమాస్​ యుద్ధంతో గాజా ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడుతోంది.

గాజాలో 30వేలు దాటిన మరణాలు
ఇజ్రాయెల్-హమాస్​ యుద్ధం మొదలైన తర్వాతి నుంచి గాజాలో 30వేల మందికిపైగా చనిపోయినట్లు గాజా ఆరోగ్య శాఖ గురువారం తెలిపింది. తాజాగా ఘటనతో మృతుల సంఖ్య పెరిగినట్లు వెల్లడించింది. గతేడాది అక్టోబర్​ 7న ఇజ్రాయెల్​పై హమాస్​ అనూహ్య దాడులు జరిపింది. ఈ దాడుల్లో వందలాది ఇజ్రాయెల్ పౌరులు సహా ఇతర దేశాల పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇజ్రాయెల్, గాజాపై క్షిపణులతో విరుచుకుపడింది. గాజా సిటీ, సహా ఉత్తర గాజాను లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపించింది. అప్పటి నుంచి హమాస్ మిలిటెంట్లు, వారు నక్కిన సొరంగాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా దాడులు చేస్తోంది. దీంతో గాజాలో తీవ్ర మానవ సంక్షోభం నెలకొంది.

పడవ మునిగి 20మందికి పైగా మృతి
సెనెగల్​లోని ఉత్తర సముద్ర తీరంలో పడవ మునిగి 20మందికి పైగా శరణార్థులు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. స్పెయిన్​ వైపు ప్రయాణిస్తున్న శరణార్థుల పడవ సెయింట్​ లూయిస్​​ పట్టణం సమీపంలో మునిగిపోయింది. బుధవారం మృతదేహాలు తీరానికి కొట్టురావడం వల్ల ఫైర్​ సిబ్బంది అప్రమత్తమయ్యారని స్థానిక గవర్నర్ అలియోన్ బదరా సాంబే తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించామని చెప్పారు.

హమాస్ ఆయువుపట్టుపై దెబ్బ- 10కి.మీ సొరంగం ధ్వంసం- గాజా పరిస్థితిపై భారత్ ఆందోళన

గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్​- శరణార్థి శిబిరాలే టార్గెట్- 100మంది మృతి

Last Updated : Feb 29, 2024, 4:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.