ETV Bharat / bharat

ఇండియాకు మరో షాక్​! కూటమి నుంచి RLD ఔట్​! బీజేపీతో చర్చలు

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 7, 2024, 8:01 AM IST

Updated : Feb 7, 2024, 2:29 PM IST

RLD Left India Alliance : వరుస షాక్​లతో సతమతమవుతున్న ప్రతిపక్ష ఇండియా కూటమి మరో ఎదురుదెబ్బ తగలనుందా? బిహార్​ సీఎం, కూటమిలో కీలక నేత నీతీశ్​ గుడ్​ బై చెప్పినట్లే, యూపీలో ఆర్​ఎల్​డీ అధినేత జయంత్​ చౌదరీ కూటమిని వీడనున్నారా? బీజేపీని ఓడించేందుకు 28 పార్టీలతో ఉమ్మడి వేదికను పంచుకున్న నేతలు కూటమి నుంచి ఒక్కొక్కరుగా బయటకు వెళ్తున్నారు. యూపీలో ఇండియా కూటమి ఎదురుదెబ్బ తప్పదా?

rld left india alliance
rld left india alliance

RLD Left India Alliance : బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పాటైన ప్రతిపక్ష ఇండియా కూటమి షాక్​ల మీద షాక్​లు తగులుతున్నాయి. ఇప్పటికే కూటమిలో కీలక నేత అయిన జేడీయూ అధినేత, బిహార్​ ముఖ్యమంత్రి నీతీశ్​ కుమార్ హ్యాండ్​ ఇచ్చారు. తాజాగా ఉత్తర్​ప్రదేశ్​లో మరో కీలక పార్టీ ఆర్​ఎల్​డీ సైతం కూటమిని వీడనున్నట్లు తెలుస్తోంది. సమాజ్​వాదీ పార్టీ, కాంగ్రెస్​తో ఉన్న పొత్తు నుంచి బయటకు వచ్చేందుకు ఆ పార్టీ అధినేత జయంత్​ చౌదరీ యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయంపై బీజేపీ అగ్రనాయకత్వంతో చర్చలు కూడా జరిగాయట. ఆర్​ఎల్​డీ నేతలు ఏడు లోక్​సభ స్థానాలను డిమాండ్​ చేయగా, బీజేపీ 5సీట్ల వరకు ఇచ్చేందుకు సానుకూలత చూపెట్టిన్నట్లు తెలుస్తోంది. దీనిపై పార్టీ అధ్యక్షుడు జయంత్ చౌదరీ త్వరలోనే ప్రకటన చేయనున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, కైరానా, మథుర, బాగ్​పత్​, అమరోహ్​ స్థానాలు ఆర్​ఎల్​డీకి ఇచ్చేందుకు బీజేపీ ఓకే చెప్పిందట. దీంతో త్వరలోనే ఇండియా కూటమిని వీడి ఆర్​ఎల్​డీ బీజేపీతో జత కట్టనుందని తెలుస్తోంది.

"ఆర్​ఎల్​డీ, బీజేపీ పొత్తు దాదాపుగా ఫిక్స్ అయ్యింది. మాకు 4 నుంచి 5 స్థానాలు ఇచ్చేందుకు బీజేపీ సానుకూలంగా ఉంది. కానీ మేము ఏడు సీట్లు ఇవ్వాలని కోరుతున్నాం. మా పార్టీ అధినేత జయంత్ చౌదరీ ప్రస్తుతం బీజేపీ అగ్రనాయకులతో చర్చిస్తున్నారు. ఈ చర్చలు త్వరలోనే పూర్తి అవుతాయి. ఈ లోక్​సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పని చేస్తాం"

--ఆర్​ఎల్​డీ జాతీయ కార్యదర్శి

2022లో జరిగిన ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ లోక్ ​దళ్​, సమాజ్​ వాదీ పార్టీ కలిసి పోటీ చేశాయి. రాష్ట్రీయ లోక్​దళ్​ 33 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. ఇందులో 8 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో మరో ఎమ్మెల్యే గెలవడం వల్ల ఆ సంఖ్య 9కి చేరింది. ఆర్​ఎల్​డీ అధినేత జయంత్ చౌదరీ రాజ్యసభకు వెళ్లేందుకు ఎస్​పీ సహకరించింది. ఈ క్రమంలోనే లోక్​సభ ఎన్నికలకు కూడా ఇరు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్​ యాదవ్​ ఇటీవలే ప్రకటించారు. దీనిని ఆర్​ఎల్​డీ నేతలు సైతం అంగీకరించినా, ఆ తర్వాత స్వరం మార్చింది. తాము 12స్థానాలను కోరామని, ఎస్​పీ ఏడు సీట్లు ఇచ్చేందుకు సానుకూలంగా ఉందని ఆ పార్టీ నేతలు అప్పట్లో చెప్పారు. కానీ బీజేపీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చే సూచనలు కనిపిస్తుండడం వల్ల ఆర్​ఎల్​డీ ఎన్​డీఏ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

'జయంత్​ ఇండియా కూటమిలోనే ఉంటారు'
మరోవైపు బీజేపీతో ఆర్​ఎల్​డీ జత కట్టనుందన్న వార్తలపై సమాజ్​వాదీ పార్టీ నేత శివపాల్ యాదవ్​ స్పందించారు. ఆర్​ఎల్​డీ అధినేత జయంత్ చౌదరీ, ఇండియా కూటమిలోనే ఉంటారని స్పష్టం చేశారు. బీజేపీ ఉద్దేశపూర్వకంగానే గందరగోళాన్ని సృష్టిస్తోందని ఆరోపించారు. జయంత్ కూటమిలోనే ఉండి బీజేపిని ఓడిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

అఖిలేశ్​కు జోడో యాత్ర ఆహ్వానం
మరోవైపు భారత్ జోడో న్యాయ్ యాత్రకు తనకు ఆహ్వనం అందలేదని సమాజ్‌వాదీ పార్టీ(SP) చీఫ్ అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ స్పందించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో యాత్ర ప్రవేశించగానే పాల్గొనాలని అఖిలేశ్​కు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆహ్వానం పంపారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర UPలో ఈ నెల 16న ప్రవేశించనుంది. ఖర్గే ఆహ్వానం మేరకు తాను అమేఠీ లేదా రాయ్‌బరేలీలో యాత్రలో పాల్గొంటానని అఖిలేష్ యాదవ్ చెప్పారు. భారత్​ న్యాయ్ యాత్ర సమాజ్‌వాదీ పార్టీ 'PDA' వ్యూహాన్ని బలోపేతం చేస్తుందని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు. భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో పాల్గొంటారా? అని శనివారం అఖిలేష్ యాదవ్‌ను మీడియా అడగ్గా, సమస్య ఏమిటంటే చాలా పెద్ద కార్యక్రమాలు జరుగుతాయి కానీ తమకు ఆహ్వానం అందదు అని ఆయన అన్నారు. దీనిపై తొలుత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ స్పందించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో యాత్ర వివరణాత్మక రూట్ మ్యాప్‌ ఖరారుకు రెండు రోజుల సమయం పడుతుందని చెప్పారు. తాజాగా అఖిలేశ్​కు ఖర్గే ఆహ్వానం పంపారు.

ముంబయిలో ర్యాలీకి ఇండియా కూటమి సన్నాహాలు
ఈ నెలాఖరున ముంబయిలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించేందుకు ప్రతిపక్ష ఇండియా కూటమి సన్నాహాలు చేస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష బలాన్ని, తమ ఐక్యతను చూపేందుకే భారత కూటమి ఉమ్మడి ర్యాలీకి ప్రణాళికలు వేస్తోంది. ఇండియా కూటమి పెద్దఎత్తున చేపట్టబోయే ఈ ర్యాలీలో కీలక నేతలు ఎవరెవరు పాల్గొంటారనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు. ఇటీవల బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ ఇండియా కూటమిని వీడి అధికార ఎన్‌డీయేతో జట్టులో చేరారు. బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఉత్తర్​ప్రదేశ్​లో కీలక ఆర్​ఎల్​డీ అధినేత సైతం గుడ్​ బై చెప్పనున్న నేపథ్యంలో ఇండియా కూటమి నేతలు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు.

Last Updated : Feb 7, 2024, 2:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.