ETV Bharat / bharat

కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్‌కు బెయిల్‌

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 8, 2024, 1:03 PM IST

Updated : Feb 8, 2024, 5:56 PM IST

kodi_katti_case_srinu_bail
kodi_katti_case_srinu_bail

Kodi Katthi Srinu Bail : కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్​కు హైకోర్టు బెయిల్​ మంజూరు చేసింది. దాదాపు ఐదేళ్ల తర్వాత బెయిల్​ రాగా కేసు గురించి మీడియాతో మాట్లాడవద్దని హైకోర్టు షరతులు విధించింది.

Kodi Katthi Srinu Bail : అధికార పీఠం దక్కించుకునే కుట్రపూరిత ప్రణాళికలో సామాన్యుడే సమిధ అనే విషయం చరిత్ర చెప్తోంది. అదే విషయాన్ని వర్తమానంలోనూ పలు సందర్భాలు రుజువుచేస్తున్నాయి. తమ నాయకుడు సీఎం కావాలన్న వెర్రి అభిమానం, తానొకటి తలిస్తే, దైవం మరోటి తలచినట్లు ! కథ అడ్డం తిరిగింది. ఐదేళ్లు ఊచల వెనక్కి నెట్టింది. ఇంటికి దూరమై, నా అనే వాళ్లకు కొండంత దుఃఖాన్ని మిగిల్చింది. కోడికత్తి కేసుగా పేరొందిన ఈ రాజకీయ చదరంగంలో బలమైన ప్రత్యర్థులకు చెక్​పెట్టే క్రమంలో పావుగా మారిన దళిత బిడ్డ జనుపల్లి శ్రీనివాసరావు కథ తుది అంకానికి చేరింది.

Prathidwani: కోడికత్తి కేసు.. ఎన్​ఐఏ నివేదికను వైసీపీ ఎందుకు అంగీకరించడం లేదు..?

ఎట్టకేలకు పోరాటం ఫలించింది. ఐదేళ్ల నిరీక్షణకు తెరపడింది. వృద్ధులైన తల్లిదండ్రులు, తన సోదరుడి ఎదురుచూపులు ఫలించాయి. ఓ వైపు న్యాయవాదుల పోరాటం, ప్రజా సంఘాల సహకారం వెరసి న్యాయదేవత దిగివచ్చింది. శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరైంది.

హైకోర్టులో కోడికత్తి కేసు - శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాసరావుకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. విడుదలయ్యాక కేసు గురించి మీడియాతో మాట్లాడవద్దని ఈ సందర్భంగా శ్రీనివాసరావును హైకోర్టు ఆదేశించింది. 2018 అక్టోబర్‌ 25న విశాఖ ఎయిర్‌పోర్టులో అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌పై శ్రీనివాసరావు కోడి కత్తితో దాడి చేయగా నాటి నుంచి జైలులోనే మగ్గుతున్నాడు. ఇన్నాళ్లూ కేసులో సాక్ష్యం చెప్పేందుకు జగన్‌ కోర్టుకు హాజరుకాకపోవడంతో రిమాండ్ ఖైదీగానే కొనసాగుతున్న శ్రీనివాస్​కు ఇవాళ బెయిల్​ మంజూరైంది. రూ.25 వేలు పూచీకత్తుతో 2 ష్యూరిటీలు సమర్పించాలని, మీడియాతో మాట్లాడొద్దని, ప్రతి ఆదివారం ముమ్మిడివరం పీఎస్‌లో హాజరు కావాలని ఆదేశించింది.

ఐదేళ్లైనా తెగని కేసు - న్యాయం కోసం జైల్లోనే నిందితుడి దీక్ష, తల్లి, సోదరుడు సైతం

దిల్లీలో ధర్నా : కోడికత్తి కేసులో న్యాయం చేయాలని కోరుతూ శ్రీనివాసరావు తల్లి, ప్రజాసంఘాలు దిల్లీలోని ఏపీ భవన్​లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించాయి. శ్రీనుకు మద్దతుగా పలు ప్రజాసంఘాల నాయకులు, సమతా సైనిక్‌ దళ్‌, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నిరసనలో పాల్గొన్నాయి.

కేసు మొత్తం కొట్టేయాలి : నా కుమారుడికి బెయిల్‌ రావడం సంతోషంగా ఉందని శ్రీనివాసరావు తల్లి సావిత్రి ఆనందం వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా నా కుమారుడి పరిస్థితి చూసి బాధపడని రోజంటూ లేదని గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమైంది. 'నా కుమారుడు ఏ తప్పూ చేయలేదు, చేయని తప్పుకు శిక్ష అనుభవించాడు, జైలులో నా కుమారుడి ఆరోగ్యం పాడైపోయింది' అంటూ సావిత్రమ్మ వాపోయారు. జగన్‌ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని నిందితుడి సోదరుడు సుబ్బరాజు పేర్కొన్నారు. కేసు మొత్తం కొట్టేస్తేనే న్యాయం జరిగినట్లుగా భావిస్తామని చెప్తూ నా తమ్ముడు హత్యా ప్రయత్నం చేయలేదని స్పష్టం చేశారు.

విద్యుత్ నిలిపేసి - మరుగుదొడ్లకు తాళం వేసి - కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యుల దీక్ష భగ్నం

హర్షాతిరేకాలు : నిందితుడు శ్రీనివాస్‌కు బెయిల్‌ రావడంపై దళిత, పౌరసంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇప్పటికైనా సీఎం జగన్‌ కోర్టుకు వెళ్లి సాక్ష్యం చెప్పాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం శ్రీనివాస్‌ను ఐదేళ్లు జైలులో మగ్గిపోయేలా చేసిందని మాజీ ఎంపీ హర్షకుమార్‌ మండిపడ్డారు. కోడికత్తి శ్రీను బయటకొచ్చి అన్ని వాస్తవాలు చెబుతారని పేర్కొన్నారు.

  • 2018 అక్టోబర్‌ 25న జగన్​పై కోడికత్తి దాడి
  • 2019 మే 28న శ్రీనివాస్​కు తొలిసారి బెయిల్
  • 2019 ఆగస్టు 13న బెయిల్​ రద్దు
  • 2023 ఫిబ్రవరి 08న శ్రీనివాస్​కు బెయిల్
  • మొత్తం 5సంవత్సరాల 3నెలల 14రోజులు రిమాండ్

కోడికత్తి కేసు పూర్వపరాలివీ : 2018 అక్టోబర్‌ 25న విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై కోడి కత్తితో దాడి జరిగింది. నిందితుడు శ్రీనివాస్‌ను అరెస్టు చేసిన పోలీసులు విశాఖ జైలుకు తరలించారు. దాడి ఎయిర్‌పోర్టు పరిధిలో దాడి జరగడంతో కేసును ఎన్‌ఐఏకు బదిలీ చేశారు. ఈ కేసులో 2019 మే 28న శ్రీనివాస్​కు బెయిల్​ మంజూరైంది. బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎన్ఐఏ వేసిన పిటిషన్‌ని కోర్టు అంగీకరించడంతో ఆగస్ట్ 13న శ్రీనివాసరావు మళ్లీ జైలుకి వెళ్లాడు. నాటి నుంచి రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న శ్రీనివాసరావును 2023 సెప్టెంబర్ 6న విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ క్రమంలో మొదట విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో తర్వాత విశాఖ ఎన్‌ఐఏ కోర్టులో విచారణ కొనసాగింది.

మొదటి సాక్షిగా ఎయిర్‌పోర్టు అసిస్టెంట్ కమాండెంట్ దినేష్ కుమార్ వాంగ్మూలం, రెండో సాక్షిగా సీఎం జగన్ కోర్టుకు హాజరుకావాల్సి ఉండగా కోర్టుకు రాలేనని, అడ్వకేట్‌ కమిషనర్‌ను నియమించి సాక్ష్యం నమోదుకు అవకాశం కల్పించాలని జగన్‌ పిటిషన్‌ వేశారు. దీనికి తోడు కుట్రకోణంపై మరింత లోతైన విచారణ జరపాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఎన్‌ఐఏ కోర్టు 2023 జులై 25న డిస్మిస్ చేసింది. దీంతో బెయిల్ కోసం మరోసారి ఎన్‌ఐఏ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ వేయగా నాటి నుంచి శ్రీను తరఫు న్యాయవాది అబ్దుల్‌ సలీం వాదనలు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో విచారణ వేగవంతం చేయాలని హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేయగా గతనెల 24న తుది విచారణ జరిపి తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు ధర్మాసనం శ్రీనివాసరావుకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.

కోడికత్తి శ్రీనుకు న్యాయం చేయాలి - గవర్నర్​కు అఖిలపక్ష నేతల వినతి

ఐదేళ్లుగా మగ్గుతున్నారని: కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ జైల్లోనే ఐదేళ్లుగా మగ్గుతున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లినట్లు నిందితుడి తరఫు న్యాయవాది తెలిపారు. హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇంతకాలం జైల్లో ఉండటం సరికాదని కోర్టుకు వివరించామన్నారు. వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసిందన్నారు.

భావోద్వేగానికి గురైన తండ్రి : శ్రీనివాసరావుకు బెయిల్​ రావడంపై తండ్రి తాతారావు ఆనందం వ్యక్తం చేశాడు. డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంక గ్రామంలో నివసిస్తున్న తండ్రి తాతారావు టీవీలో వీక్షిస్తూ భావోద్వేగానికి గురయ్యాడు. తన అనారోగ్యం కారణంగా ఐదేళ్లుగా కుమారుని చూసే అదృష్టానికి నోచుకోలేదని, వివిధ సంఘాల సహకారం, న్యాయవాదుల సహకారంతో బెయిల్ దొరికి ఇంటికి వస్తాడని ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Last Updated :Feb 8, 2024, 5:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.