ETV Bharat / bharat

'కాంగ్రెస్​ గెలిస్తే మహిళలకు ఏడాదికి రూ.లక్ష- ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్లు'

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 13, 2024, 2:19 PM IST

Updated : Mar 13, 2024, 3:06 PM IST

Congress Promises For Women : 2024 లోక్​సభ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో వస్తే దేశంలోని పేద మహిళలకు ఏడాదికి రూ. లక్ష ఇస్తామని ప్రకటించింది కాంగ్రెస్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపింది.

Congress Promises For Women
Congress Promises For Women

Congress Promises For Women : మరికొద్ది రోజుల్లో లోక్​సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మహిళలపై హామీల జల్లు కురిపించింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దేశంలోని పేద కుటుంబంలోని ప్రతి మహిళకు మహాలక్ష్మి పథకం కింద రూ.లక్ష ఇస్తామని ప్రకటించింది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలో 'నారీ న్యాయ్​' పేరిట మహిళలకు ఐదు గ్యారెంటీలను ప్రకటించింది హస్తం పార్టీ.

'హామీలను నెరవేరుస్తాం'
ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్స్​లో పోస్ట్ చేశారు. 'నారీ న్యాయ్' పేరిట దేశంలోని మహిళల కోసం కొత్త అజెండాను తీసుకురాబోతున్నామని ఖర్గే పోస్ట్​లో తెలిపారు. 'మా హామీలు- ప్రకటనలు మాత్రమే కావు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. 1926 నుంచి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాం. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడే ఈ పోరాటంలో మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఆశీస్సులు అందించండి. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయండి' అని ఖర్గే కోరారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ కూడా ఈ ఐదు గ్యారెంటీలకు సంబంధించిన వివరాలను తన సోషల్‌ మీడియా అకౌంట్​లో పోస్ట్‌ చేశారు.

మహిళల కోసం కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలివే

  • మహాలక్ష్మి: ఈ పథకం కింద ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళకు ఏటా రూ.లక్ష నగదు నేరుగా వారి ఖాతాలోకి బదిలీ
  • ఆదీ ఆబాదీ- పూరా హక్‌: కేంద్ర ప్రభుత్వంలో కొత్తగా చేపట్టే నియామకాల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్‌
  • శక్తి కా సమ్మాన్‌: ఆశా, అంగన్వాడీలు, మధ్యాహ్న భోజన పథకంలో విధులు నిర్వర్తించే మహిళలకు నెలవారీ జీతంలో కేంద్రం ఇచ్చే వాటా రెట్టింపు
  • అధికార్‌ మైత్రీ : న్యాయపరమైన హక్కుల విషయంలో మహిళలను విద్యావంతులను చేసి, వారికి సాధికారత కల్పించేందుకు వీలుగా ప్రతి పంచాయతీలో ఒక అధికార్‌ మైత్రీ నియామకం
  • సావిత్రీబాయి పూలే హాస్టళ్లు: ఉద్యోగం చేసే మహిళల కోసం హాస్టళ్లు రెట్టింపు- ప్రతి జిల్లాలో కనీసం ఓ హాస్టల్‌ ఏర్పాటు

'కేంద్రం ప్రజల దృష్టిని మళ్లిస్తోంది'
మరోవైపు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి కీలకమైన సమస్యల నుంచి కేంద్రం ప్రజల దృష్టిని మళ్లిస్తోందని రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. మహారాష్ట్ర ధూలే జిల్లాలో జరిగిన భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో కేంద్రంపై రాహుల్‌ విమర్శలు గుప్పించారు. కులగణన అనేది చారిత్రకమైన, విప్లవాత్మకమైన అడుగని తెలిపారు రాహుల్‌. తమ పార్టీ అధికారంలోకి రాగానే కులగణన చేపడతామని హామీ ఇచ్చారు. కులగణన అనంతరం దళితులు, పేదలు, జనరల్‌ కేటగిరీ, మైనార్టీ, గిరిజన ప్రజలు ఆర్థికంగా ఏ స్థాయిలో ఉన్నారో కనుగొనేందుకు ఆర్థిక సర్వేను చేపడతామని తెలిపారు.

ధనవంతులకు 16 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన మోదీ ప్రభుత్వం- రైతుల రుణాలు మాత్రం ఎందుకు మాఫీ చేయడం లేదని ప్రశ్నించారు. దేశంలో 70కోట్ల మంది వద్ద ఉన్న సంపదకు సమానమైన సంపద కేవలం 22మంది వద్దే ఉందని రాహుల్‌ ఆరోపించారు. వీటిపై ఎవరూ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ పథకాన్ని ప్రస్తావించారు. ఈ పథకం ద్వారా సైనికులకు అమరవీరుల హోదా దక్కదని, కనీసం పింఛను కూడ లభించదన్నారు.

43మందితో కాంగ్రెస్​ సెకండ్ లిస్ట్ రిలీజ్- ముగ్గురు మాజీ సీఎంల కొడుకులకు సీట్లు

'రాజ్యాంగ సవరణ కోసమే బీజేపీ 400 సీట్ల లక్ష్యం!'- ఎంపీ వ్యాఖ్యలపై ఖర్గే ఫైర్​

Last Updated : Mar 13, 2024, 3:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.