YSRCP MLA MS Babu had a bitter experience: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో గతకొన్ని నెలలుగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు తిప్పలు తప్పటం లేదు. ఓట్లు వేసి గెలిపినందుకు నాలుగేళ్ల కాలంలో ఊరికి ఏం చేశారు..?, యువతకు ఏం చేశారు..?, ఎన్నికల ముందు హాచ్చిన హామీలు ఏమయ్యాయి..? అంటూ ఆయా నియోజకవర్గాల ప్రజలు నాయకులను నిలదీస్తున్నారు. తాజాగా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు చేదు అనుభవం ఎదురైంది. ఓవైపు ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తుంటే.. మరోవైపు గ్రామంలోని ఆలయంలో ఏర్పాటు చేసిన మైక్ ద్వారా "సైకో పోవాలి-సైకిల్ రావాలి "అంటూ పాటను వినిపించారు.
వైసీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం.. చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు ఈరోజు చేదు అనుభవం ఎదురైంది. గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే.. బంగారుపాళ్యం మండలంలోని మొగిలివారి పల్లెలో పర్యటించారు. ఈ పర్యటనకు గ్రామస్థులు వ్యతిరేక చర్యలు చేపట్టారు. గ్రామంలోని ఆలయంలో ఏర్పాటు చేసిన మైక్ ద్వారా "సైకో పోవాలి-సైకిల్ రావాలి "అంటూ పాటను వినిపించారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు, పోలీసులు అప్రమత్తమై.. ఆలయంలోకి వెళ్లి పాటను ఆపేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో గ్రామస్థులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పాటను ఆపేది లేదంటూ గ్రామస్ధులు ఖరాఖండిగా చెప్పారు. గ్రామస్ధుల తీరుపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేస్తూ.. అక్కడి నుంచి వెనుదిరిగిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.
వీడియోలో ఏముందంటే.. 'పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు.. పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్తూ.. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఇంతలోనే గ్రామంలో ఉన్న ఆలయం మైక్ నుంచి సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ పాటను వినిపించింది. వెంటనే పోలీసులు, ఎమ్మెల్యే అనుచరులు హూటాహుటిన ఆలయంలోకివెళ్లి మైక్ను ఆపేందుకు ప్రయత్నించారు. పాటను ఆపేది లేదంటూ గ్రామస్ధులు ఖరాఖండిగా చెప్తూ.. పోలీసులతో వాగ్వాాదానికి దిగారు'.