Younger Brother Attacks Elder Brother With Axe: అధికార పార్టీ అండ ఉందనే ధైర్యంతో నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల వరకు రెచ్చిపోయి దాడులు చేస్తున్నారు. తాజాగా పల్నాడు జిల్లాలో వైసీపీ కార్యకర్త పట్టపగలే గొడ్డలితో వీరంగం సృష్టించాడు. గొడ్డలితో వెంట పడుతూ దాడి చేశాడు. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని నాదెండ్ల మండలం చందవరంలో వైసీపీ వర్గీయుడు విజయభాస్కర్ రెడ్డి తన అన్న, మేనమామపై గొడ్డలితో దాడి చేశాడు. అధికార పార్టీకి చెందిన విజయభాస్కర రెడ్డి, తన అన్న మండల మాజీ కన్వీనర్ గొంటు శ్రీనివాసరెడ్డిపై వ్యక్తిగత కారణాలతో గొడ్డలితో దాడికి దిగాడు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న మేనమామ కృష్ణా రెడ్డిని విజయభాస్కర్ రెడ్డి ట్రాక్టర్తో ఢీ కొట్టాడు. అనంతరం గొడ్డలితో దాడి చేసేందుకు వెంట పడగా.. కృష్ణా రెడ్డి ప్రాణభయంతో పరుగులు తీశాడు. కృష్ణారెడ్డిపై దాడి చేసేందుకు అతడి వెనకే విజయభాస్కర్ రెడ్డి గొడ్డలితో వెంటపడ్డాడు. ఈ ఘటనలో గాయపడిన శ్రీనివాసరెడ్డి, కృష్ణారెడ్డిని స్థానికులు నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైసీపీ వర్గీయులైన అన్నదమ్ములు, కుటుంబసభ్యుల మధ్య ఘర్షణ నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.