Suryanarayana Bail Petition: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ కోర్టు కొట్టివేసింది. ఈ మేరకు ఏసీబీ న్యాయస్థానం జడ్జి హిమబిందు సోమవారం తుది ఉత్తర్వులు ఇచ్చారు. వాణిజ్య పన్నులశాఖ ఆదాయానికి గండి కొట్టేలా వ్యవహరించారనే ఆరోపణలతో నలుగురు ఉద్యోగులతో పాటు ఐదో నిందితుడిగా కేఆర్ సూర్యనారాయణపై విజయవాడలోని పటమట పీఎస్లో కేసు నమోదైంది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిలు మంజూరు చేయాలని సూర్యనారాయణ.. గత నెలలో విజయవాడ 12వ అదనపు జిల్లా కోర్టును ఆశ్రయించారు. అనుకూలంగా తీర్పు రాకపోవడంతో హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపి జులై 7లోపు నిర్ణయం వెల్లడించాలని ఏసీబీ కోర్టును హైకోర్టు ఆదేశించింది. నిర్ణయం వెలువడే వరకు సూర్యనారాయణపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేఆర్ దాఖలు చేసుకున్న పిటిషన్పై ఏసీబీ కోర్టులో గత వారం వాదనలు జరిగాయి. సూర్యనారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ సోమవారం కోర్టు తుది ఉత్తర్వులు జారీ చేసింది.