Nara Lokesh Padayatra: కర్నూలు నగరంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రను వైసీపీ ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. కర్నూలు నగరంలో లోకేశ్ యువగళం పాదయాత్ర నేటి ఉదయం 7:30 కు ఎస్టిబిసి కళాశాల మైదానం నుంచి ప్రారంభం అయ్యింది. ఈ యాత్రలో కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని కొందరు న్యాయవాదులు అడ్డుకోగా పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించారు. నిన్న జరిగిన మైనార్టీల సమావేశ సభలో నారా లోకేశ్ కర్నూలు ఎమ్మెల్యే హాఫీస్ ఖాన్ పై చేసిన విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో తనపై చేసిన విమర్శలపై స్పందించిన ఎమ్మెల్యే తనతో లోకేశ్ చర్చకు రావాలని ద్విచక్రవాహనంపై పాతబస్తీలో నారా లోకేశ్ యాత్రకు ఎదురుగా వెళ్లారు. పెద్ద ఎత్తున హాఫీజ్ ఖాన్ అనుచరులు సైతం రావడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు ఎమ్మెల్యేను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా హాఫీస్ ఖాన్ మీసాలు దువ్వి నారా లోకేశ్తో పాటుగా టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.