CPI fight against increased electricity charges:పెంచిన విద్యుత్ ఛార్జీలు, స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా సీపీఐ ఆధ్వర్యంలో ఈనెల 15వ తేదీన విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలను ఆహ్వానించి ఉద్యమనికి శ్రీకారం చుడతామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ ప్రతి పక్షంలో ఉండగా అనేక హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తరువాత కరెంటు ఛార్జీలు పెంచేది లేదని అన్నారని గుర్తు చేశారు. పైగా 200 యూనిట్ల లోపు ఎవరైతే విద్యుత్ వినియోగిస్తారో వారందరికీ ఉచితంగా విద్యుత్ అందిస్తామని పాదయాత్రలో స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. ఈ హామీలతో ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టిన ఆయన.. ఏడుసార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారని మండిపడ్డారు. విద్యుత్ వినియోగదారులపై వేల కోట్ల రూపాయల భారం వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరం లేకపోయినా ఇప్పుడు 17 వేల కోట్ల రూపాయల్ని స్మార్ట్ మీటర్ల పేరుతో మళ్లీ ప్రజలపై భారం వేసి మరో బాదుడుకు సిద్ధమయ్యారని రామకృష్ణ దుయ్యబట్టారు.