MP Raghuramakrishna fire on Govt: మార్గదర్శి సంస్థ పట్ల రాష్ట్ర ప్రభుత్వం అత్యంత దారుణంగా వ్యవహరిస్తోందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మండిపడ్డారు. ఇప్పటికే ఉన్న చిట్లను ఆపే కుట్ర చేయడం దారుణమన్నారు. మార్గదర్శిపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతుండగా.. ఏపీ హైకోర్టుకు మార్చాలని ప్రభుత్వం ఎందుకు కోరుతోందని ప్రశ్నించారు. విచారణను ఏపీకి మార్చాలంటూ సుప్రీంకోర్టుకు వెళ్లినా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తప్పదని రఘురామ అన్నారు. 'మార్గదర్శి కొత్త చిట్స్ని నిలిపివేయించి పాత చిట్స్ను కూడా ఆపేయాలని ప్రభుత్వం కోరడం ఎంత వరకు సమంజసం. ఒక్కరు కూడా కంప్లయింట్ ఇవ్వకుండా రన్నింగ్ చిట్స్ను ఎలా నిలిపేస్తారు. అక్రమాలు జరగకున్నా.. భవిష్యత్లో ఇబ్బందులు ఎదురైతే అని సందేహించి నిలిపేస్తే ఎలా..? ఎవరైనా చందాదారులు తమ ఆర్థిక అత్యవసర అవసరాల కోసం చిట్టీ వేసి ఉంటే.. దానిని అర్ధాంతరంగా నిలిపేస్తే ఎలా..? ఏ అధికారం ఉందని ఇలా చేస్తున్నారు.. చిట్ పాడుకొనే అవకాశం లేక చందాదారులంతా బలైపోవాలా..? ' అని రఘురామ ప్రశ్నించారు.