Minister Botsa Satyanarayana Fires on Chandrababu: ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగుపర్చేందుకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా తోడ్పాటును అందిస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో.. ఆమదాలవలస నియోజకవర్గ సమీక్షా సమావేశంలో.. సభాపతి తమ్మినేని సీతారాం, కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్తో కలిసి మంత్రి బొత్స సమీక్షించారు. ప్రభుత్వ ప్రాధాన్యతా భవనాలను ఈ నెలాఖరులోగా పూర్తి కావాలని సూచించారు. నిధులు పుష్కలంగా ఉన్నాయన్న మంత్రి.. పనులు వేగవంతంగా చేసి నిర్దేశించిన సమయానికి భవనాలు అప్పగించాలని గుత్తేదారులను ఆదేశించారు.
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి.. టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యే అవకాశాలు లేవని ఎద్దేవా చేశారు. బటన్ నొక్కినా డబ్బులు పడటం లేదన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు అడిగిన ప్రశ్నకు మేము సమాధానం చెప్పాలా అని ప్రశ్నించారు. వాళ్ల ప్రభుత్వం ఉన్నపుడు ఏమి చేశారో.. ముందు వాళ్లు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మేము ఏమి చేసినా.. ప్రజల ఆర్థిక పరిస్థితులు మెరుగు పరిచేందుకు కృషి చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. అలాగే నిధుల డైవర్షన్ గురించి కూడా పలు వ్యాఖ్యలు చేశారు. నిధులను ఎవరి ఖతాల్లోకి డైవర్షన్ చేయడం లేదని.. ప్రజలకు డైవర్షన్ చేస్తున్నామన్నారు.