Pawavan Kalyan tweet on data theft: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా మరోమారు వాలంటీర్ల అంశంపై సీఎం జగన్ కు పలు ప్రశ్నలు సంధించారు. ‘అందరి ఆందోళన ఒక్కటే.. మై డియర్ వాట్సన్!.. మీరు సీఎం అయినా కాకపోయినా డేటా గోప్యతా చట్టాలు అలాగే ఉంటాయి' కాబట్టి ఈ మూడు ప్రాథమిక ప్రశ్నలకు సమాధానం చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు. వాలంటీర్ల బాస్ ఎవరు? అని ప్రశ్నించారు. ఏపీ ప్రజల వ్యక్తిగత డేటా మీరు ఎక్కడ నిల్వ చేస్తున్నారు అని నిలదీశారు. వ్యక్తుల వ్యక్తిగత డేటాను సేకరించడానికి, స్వచ్ఛంద సేవకులకు ఎవరు అధికారం ఇచ్చారు.. వారు ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు ఎలా సేకరిస్తున్నారు. వీటికి జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డేటా చౌర్యంపై జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యల వీడియోను పవన్ పోస్ట్ చేశారు. మూడు రోజుల కిందట మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ మాట్లాడుతూ.. వాలంటీర్లు ప్రజల నుంచి 23 అంశాలపై సేకరించిన సమాచారం ఎక్కడికి పంపుతున్నారు.. సమాచార సేకరణపై ప్రభుత్వ విధివిధానాలు ఏమిటి? అని ప్రశ్నించడం విదితమే. స్వచ్ఛందంగా పనిచేసే రెడ్క్రాస్ వాలంటీర్లకు కేంద్రంలో రాష్ట్రపతి అధ్యక్షుడిగా, రాష్ట్రస్థాయిలో గవర్నర్ అధ్యక్షత వహిస్తారని, మరి రాష్ట్రంలో వాలంటీర్లకు నాయకుడు, అధిపతి ఎవరు? అని ప్రశ్నించడం తెలిసిందే.