Huge Fire Accident in Kadapa: కడప నగరంలోని వైబీ స్ట్రీట్ మండి బజార్లోని హోల్ సేల్ దుకాణంలో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో సుమారు రెండు కోట్ల మేరకు ఆస్తి నష్టం వాటిల్లింది. కడపకు చెందిన బద్రీనాథ్ గత 30 ఏళ్ల నుంచి మండి బజార్లో వెంకటేశ్వర ట్రేడర్ నిత్యవసర వస్తువుల హోల్ సేల్ దుకాణం పెట్టుకొని జీవిస్తున్నాడు. రాత్రి పది గంటల సమయంలో దుకాణం మూసేసుకొని ఇంటికి వెళ్లాడు. సుమారు మూడు గంటల ప్రాంతంలో దుకాణంలో నుంచి దట్టమైన పొగలు రావడంతో స్థానికులు గమనించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారాన్ని అందిచారు. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది వచ్చి షట్టర్లను పగలగొట్టి మంటలను అదుపు చేశారు. మంటలను అదుపు చేయడానికి మూడు అగ్నిమాపక వాహనాలు వచ్చాయి. నిత్యవసర వస్తువుల దుకాణం కావడంతో నూనె, ఇతర సామగ్రి, ప్లాస్టిక్ వస్తువులు, వివిధ రకాల విలువైన సామగ్రి ఉండడంతో మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో సుమారు రెండు కోట్ల మేరకు ఆస్తి నష్టం వాటిల్లిందని దుకాణం నిర్వహకుడు బద్రీనాథ్ తెలిపారు. మంటలు అదుపులోకి రావడంతో సమీపంలోని దుకాణాదారులు ఊపిరి పీల్చుకున్నారు.