BJP's complaint to Governor against state government on Economical status: రాష్ట్ర ప్రభుత్వం అపరిమితంగా చేస్తున్న అప్పులు, పంచాయతీ నిధులు దారి మళ్లిస్తున్న వైనంపై బీజేపీ ప్రతినిధుల బృందం గవర్నర్ అబ్దుల్నజీర్ను కలిసి ఫిర్యాదు చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి( Purandeswari )నేతృత్వంలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పీవీఎన్ మాధవ్, ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి తదితరులు విజయవాడలో రాజ్భవన్కు వచ్చి గవర్నర్ను కలిశారు. అనంతరం పురందేశ్వరి, సత్యకుమార్ మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ తప్పిందని... లెక్కకు మించి అప్పులు చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై శ్వేత పత్రం విడుదల చేయాలని, రాష్ట్ర ఖజానా గుల్ల అవుతుందని పేర్కొంటూ.. అందువల్లే బీజేపీ రాష్ట్ర శాఖ దశల వారీగా ఆందోళన చేస్తోందని వివరించారు. గ్రామాలను అభివృద్ధి చేస్తామంటూ వైసీపీ హామీ ఇచ్చిందని... కానీ వాగ్దానాలు అమలు చేయకుండా మోసం చేసిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇచ్చిన నిధులను దారి మళ్లించారని, గ్రామాల్లో పనులు నిలిపివేశారని, చిన్న చిన్న కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు చెల్లించలేని దుస్థితి నెలకొందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో కొందరు కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారని,సర్పంచులకు న్యాయం చేయాలని, గ్రామీణ వ్యవస్థను కాపాడాలని గవర్నర్ను కోరామని వెల్లడించారు.