ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కడపలో భారీ వర్షం...ఇళ్లు జలమయం

By

Published : Sep 16, 2020, 3:51 PM IST

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కడప శివారులోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా...పెన్నా, కుందూనదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.

heavy-rains in kadapa
కడపలో భారీ వర్షం

కడపలో కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కడప శివారులోని అల్లూరి సీతారామరాజు నగర్ మొత్తం నీట మునిగింది. సుమారు కొన్ని వందల నివాసాల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. విష కీటకాలు, పాములు, చెత్తా చెదారం నివాసాల్లోకి రావడంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. కొంతమంది నివాసాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. నిన్ననే ఉపముఖ్యమంత్రి అంజద్ బాషా అల్లూరి సీతారామరాజు నగర్​ను పరిశీలించారు. అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు.

కుందూనదిలో పెరిగిన ప్రవాహం

కడప జిల్లాలోని కుందూ నదిలో మళ్ళీ వరద ప్రవాహం పెరిగింది. మంగళవారం సాయంత్రం 37 వేల 863 క్యూసెక్కుల నీరు ఉండగా... నేటి ఉదయానికి 39 వేల 172 క్యూసెక్కులకు చేరింది. మూడు రోజుల కిందట 32 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండేది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, నంద్యాల ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా నదిలో వరద ప్రవాహం పెరుగుతున్నట్లుగా కేసీ కెనాల్ అధికారులు తెలిపారు.

పెన్నా ఉగ్రరూపం..

జిల్లాలోని సిద్ధవటం మండలంలోని పెన్నా నది ఉద్ధృ తంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వర్షం నీరు రావడంతో పెన్నా నది ఉగ్రరూపం దాల్చింది. గండికోట రిజర్వాయర్ నుంచి నీరు వదలడంతో ఆ నీరంతా నదిలోకి చేరడంతో ఉద్ధృతి పెరిగింది. పరివాహక ప్రాంతాల చుట్టూ ఉన్న వారిని అధికారులు అప్రమత్తం చేశారు.


ఇదీ చదవండి:ఉద్ధృతంగా వరద ప్రవాహం.. ప్రాజెక్టులకు జలకళ

ABOUT THE AUTHOR

...view details