ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ పశ్చిమగోదావరి జిల్లా శాఖ 1973 సంవత్సరంలో ఆవిర్భవించింది. నాటి నుంచి దినదినాభివృద్ధి చెందుతూ వస్తోంది. రైతుల సహకారంతో సేవలో మమేకమైంది. సంస్థకు జిల్లాలో తణుకు మార్టేరులలో విత్తన శుద్ధి కర్మాగారాలు ఉండగా.. ఈ రెండింటితో పాటు ఏలూరు కార్యాలయం ద్వారా మార్కెటింగ్ జరుపుతున్నారు. రబీ సీజన్లో 2150 ఎకరాలు, ఖరీఫ్ సీజన్లో 600 ఎకరాలలోనూ రైతుల ద్వారా రెండు సీజన్లలో విత్తనోత్పత్తి చేస్తున్నారు. సుమారు 45 వేల క్వింటాళ్ల విత్తనాన్ని ఉత్పత్తి చేసి రైతులకు అందజేస్తున్నారు. విత్తనాలు పండించే రైతులకు పంటకాలంలో తగిన సూచనలు సాంకేతిక సలహాలు అందజేస్తూ రైతులకు బాసటగా నిలుస్తున్నారు.
సంస్థ ద్వారా తమకు అదనపు ఆదాయాలు లభిస్తున్నాయని రైతులు అంటున్నారు. పంట కాలంలో సహకారంతో పాటు విత్తనాలు సరఫరా చేసిన వెంటనే సకాలంలో చెల్లింపులు చేయడంవల్ల తాము సంవత్సరాల తరబడి విత్తనాలు పండించి సరఫరా చేస్తున్నామని రైతులు చెబుతున్నారు. సంస్థ తాము రైతుల ద్వారా పండించిన విత్తనాన్ని స్థానిక రైతులకు సరఫరా చేయడంతోపాటు ఇతర జిల్లాలకు ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయడం విశేషం.