He carried his wife dead body on his shoulder: డబ్బులు లేక భార్య మృతదేహాన్ని భుజాన వేసుకొని.. ఒడిశాలోని స్వగ్రామానికి భర్త బయలుదేరిన హృదయ విదారక ఘటన విజయనగరం జిల్లాలో వెలుగుచూసింది. ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా పొట్టంగి బ్లాక్ సొరడ గ్రామానికి చెందిన ఈడే గురు అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతుంటే ఆమె భర్త సాములు.. విశాఖ జిల్లాలోని అనిల్ నీరుకొండ మెడికల్ కళాశాల ఆసుపత్రికి తీసుకొచ్చారు. వారం రోజుల చికిత్స అనంతరం ప్రయోజనం లేదు ఇంటికి తీసుకెళ్లమనడంతో భార్యను తీసుకొని ఆటోలో విజయనగరం బయలుదేరారు. మార్గ మధ్యలోనే ఆమె మృతి చెందడంతో.. ఆటో డ్రైవరు చెల్లూరు రింగు రోడ్డులో దించేసి వెళ్లిపోయాడు. దిక్కుతోచని స్థితిలో సాములు.. భార్య మృతదేహాన్ని భుజం మీద వేసుకొని కాలి నడకన స్వస్థలం బయలు దేరారు.
భార్య మృతదేహాన్ని భుజాన మోసుకుంటూ.. నాలుగు కిలోమీటర్లు నడిచిన అభాగ్యుడు
He carried his wife dead body on his shoulder: చేతిలో చిల్లిగవ్వ లేదు.. స్వగ్రామానికి వెళ్లే దారి తెలియదు. సాటి వారిని సాయం అడగటానికి భాష రాదు. కానీ కన్నుమూసిన భార్యను వందల కిలోమీటర్ల దూరంలోని ఇంటికి చేర్చాలి. ఈ దయనీయ పరిస్థితుల్లో చేసేదేమీ లేక.. భార్య మృతదేహాన్ని భుజాన వేసుకుని నడక ప్రారంభించాడు.. ఒడిశాకు చెందిన సాములు. అతడి కష్టాన్ని చూసి చలించిన విజయనగరం జిల్లా పోలీసులు స్వస్థలానికి పంపించే ఏర్పాట్లు చేసి మానవత్వం చాటుకున్నారు.
![భార్య మృతదేహాన్ని భుజాన మోసుకుంటూ.. నాలుగు కిలోమీటర్లు నడిచిన అభాగ్యుడు He carried his wife dead body on his shoulder](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17705294-237-17705294-1675906165196.jpg)
భాష, దారి తెలియక భార్య మృతదేహన్ని భుజాన వేసుకుని నడిచి వెళ్లుతున్న సాములు గురించి స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. విజయనగరం రూరల్ సీఐ తిరుపతి రావు, గంట్యాడ ఎస్ఐ కిరణ్ కుమార్ అతడిని ఆపి వివరాలు తెలుసుకున్నారు. దారి తెలియక అప్పటికే నాలుగు కిలోమీటర్ల మేర వెనక్కి నడిచినట్లు గుర్తించిన వారు.. అతని బంధువులతో ఫోన్లో మాట్లాడారు. సాములకు భోజనం పెట్టించి, ఒడిశాలోని సుంకి వరకు అంబులెన్స్లో వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. మానవత్వం ప్రశ్నార్థకమవుతున్న ప్రస్తుత రోజుల్లో.. భార్యను కోల్పోయి బాధలో ఉన్న నిరుపేద వ్యక్తికి సాయం చేసిన విజయనగరం పోలీసులను స్థానికులు అభినందించారు.
ఇవీ చదవండి: