ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఉద్యోగులను ముప్పుతిప్పలు పెడుతున్న ముఖ ఆధారిత హాజరు..

By

Published : Jan 20, 2023, 9:18 AM IST

Updated : Jan 20, 2023, 12:45 PM IST

FACE BASED ATTENDANCE SYSTEM
FACE BASED ATTENDANCE SYSTEM

FACE BASED ATTENDANCE SYSTEM: ముఖ ఆధారిత హాజరు విధానం.. ప్రభుత్వ ఉద్యోగులకు అగ్నిపరీక్షలా మారింది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులను.. సాంకేతిక, ఇంటర్నెట్‌ సమస్యలు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. నెట్‌ కోసం చెట్లు, పుట్టల వెంట తిరగాల్సిన దుస్థితి నెలకొంది. హాజరు సహా వివిధ రకాల యాప్‌లలో సమాచారం నమోదుకే రోజంతా సరిపోతోందని.. ఉపాధ్యాయులు వాపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో యాప్‌లతో కుస్తీ పట్టడానికే టీచర్ల సమయం సరిపోతుండటంతో.. పిల్లల చదువులు దారి తప్పుతున్నాయి.

FACE BASED ATTENDANCE SYSTEM:ముఖ ఆధారిత హాజరు విధానం.. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని చాలా ప్రాంతాల ఉద్యోగులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. మారుమూల గ్రామాలు, కొండ ప్రాంతాలు, గిరిజన గూడేల్లో పనిచేసే ఉద్యోగులు, ఉపాధ్యాయులు.. తమ విధులు నిర్వహించడం కంటే హాజరు నమోదుకే ఎక్కువ భయపడుతున్నారు.

విజయనగరం జిల్లా కొత్తవలస ఎంపీడీవో కార్యాలయ ఉద్యోగులు బుధవారం రోజున హాజరు కోసం పడిన తిప్పలు వర్ణనాతీతం. యాప్‌లో లొకేషన్ చూపించకపోవడంతో.. కొన్ని గంటలపాటు కుస్తీ పట్టారు. చివరికి బయోమెట్రిక్‌ హాజరు నమోదు చేశారు. వీళ్లే కాదు.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 33వేల మంది ఉద్యోగులదీ అటు-ఇటుగా ఇదే సమస్య.

ఆలస్యమైతే ఆబ్‌సెంట్‌ పడుతుందనే ఆందోళనతో.. కార్యాలయాలు మొదలవగానే అందరూ ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల సర్వర్ మొరాయిస్తున్న సందర్భాలు కోకొల్లలు. కొన్నిచోట్ల D.D.O.లు లేదా ఆయా శాఖల మండలస్థాయి అధికారులు లాగిన్ అయితేనే.. మిగతా వారికి హాజరు పడుతోందని ఉద్యోగులు చెబుతున్నారు.

తౌడమ్మ, మంగ.. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం సమ్మంగిపాడు, కురుకుట్టి పంచాయతీల్లో ఎంఎల్​హెచ్​పీ​ (MLHP)లుగా పనిచేస్తున్నారు. వీళ్లిద్దరూ ఇలా చెట్ల కింద పడిగాపులు పడటానికి హాజరు సమస్యే కారణం. ఆరోగ్య ఉపకేంద్రం వద్ద మొబైల్‌ సిగ్నల్ రాకపోవడంతో.. కిలోమీటర్ దూరంలోని ఈ చెట్టు దగ్గరికొచ్చి హాజరు నమోదు చేయాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు.

సాలూరు, కురుపాం, సీతంపేట, గుమ్మలక్ష్మీపురం మండలాల పరిధిలోని మారుమూల, కొండలపైనున్న గ్రామాల్లో.. ఇంటర్మెట్‌ సమస్య అత్యం తీవ్రంగా ఉంది. ఇలాంటి ప్రాంతాల్లో పనిచేసే టీచర్లు, ఆరోగ్య సిబ్బంది.. పని ప్రదేశానికి కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్లి మరీ హాజరు నమోదుచేయక తప్పడం లేదు.

రెవెన్యూ, వైద్యారోగ్యశాఖ, డ్వామా సహా క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులు, సిబ్బంది.. హాజరు కోసం పడుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కావు. సమగ్ర భూసర్వే కోసం గ్రామాల్లో తిరుగుతున్న సిబ్బంది.. ఆ పని ఆపేసి మరీ హాజరు కోసం ఉదయం, సాయంత్రం కార్యాలయానికి వచ్చి వెళ్లక తప్పడం లేదు.

మార్కెటింగ్ శాఖలో కొందరికి C.F.M.S ఐడీ సరిపోలడం లేదని చూపిస్తోంది. దీనివల్ల సుమారు 30శాతం మంది హాజరు పడటం లేదు. అలాగే ఉద్యోగ విరమణకు దగ్గర్లో ఉన్న వారిలో కొందరికి స్మార్ట్ ఫోన్ వినియోగంపై అవగాహన తక్కువగా ఉంటోంది. వీళ్లంతా ఈ యాప్‌ల తంటా ఏమిటంటూ తల పట్టుకుంటున్నారు. లెక్కకు మిక్కిలిగా ఉన్న ముఖ ఆధారిత యాప్‌ సమస్యలను ప్రభుత్వం గుర్తించి.. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.

ఉద్యోగులను ముప్పుతిప్పలు పెడుతున్న ముఖ ఆధారిత హాజరు..

ఇవీ చదవండి:

Last Updated :Jan 20, 2023, 12:45 PM IST

ABOUT THE AUTHOR

...view details