ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పీకల్లోతు అప్పులు.. ఓడీతో తిప్పలు..ఇదీ ఏపీ ఆర్థిక పరిస్థితి

By

Published : Dec 21, 2022, 9:59 AM IST

Updated : Dec 21, 2022, 12:50 PM IST

AP Financial Situation: రాష్ట్రం ఇంకా ఓవర్‌ డ్రాఫ్ట్‌లోనే ఉంది. రోజువారీ రాబడికి, అవసరాలకు మధ్య పొంతన లేకపోవడంతో.. ప్రస్తుతానికి అప్పులతోనే నెట్టుకొస్తోంది. రిజర్వు బ్యాంకు కల్పించిన అప్పుల వెసులుబాటును వినియోగించుకుంటూ అత్యవసర బిల్లులు చెల్లిస్తోంది. ఈ త్రైమాసికంలో ఇప్పటికే 25 రోజులపాటు ఓడీలోనే ఉంది.

Over Draft
ఓవర్‌ డ్రాఫ్ట్‌

AP Financial Situation: ఈ నెలలో రాష్ట్రం ఆర్థికంగా తీవ్ర ఒడుదొడుకుల్లో కూరుకుపోయింది. మళ్లీ ఓవర్‌డ్రాఫ్ట్‌ ఇబ్బందుల్లోకి వెళ్లిపోయింది. తొలి పది రోజుల్లో ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు చెల్లించలేని దుస్థితి ఒకవైపు ఏర్పడగా.. ఓవర్‌డ్రాఫ్ట్‌ గడువు మీరిపోతుండటంతో ప్రభుత్వ ఖాతాలు స్తంభింపజేసే సవాలు మరోవైపు వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో కార్పొరేషన్ల సాయంతో కొంత రుణం తెచ్చి, ఓవర్‌డ్రాఫ్ట్‌కు అవసరమైన సొమ్ము చెల్లించి.. ఆ పరిస్థితి నుంచి బయటపడింది.

రిజర్వుబ్యాంకు తాజా సమాచారం ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం ఒకట్రెండు రోజులే ఓవర్‌డ్రాఫ్ట్‌ నుంచి బయటపడినట్లు సమాచారం. మళ్లీ వెంటనే ఓవర్‌ డ్రాఫ్ట్‌లోకి వెళ్లిపోయింది. ఒక త్రైమాసికంలో గరిష్ఠంగా 36 రోజులకు మించి ఓడీలో ఉండేందుకు అవకాశం లేదు. ప్రస్తుత త్రైమాసికంలో ఇప్పటికే 25 రోజులు ఓడీలోనే ఉంది. ఒకవైపు బహిరంగ మార్కెట్‌ రుణాలకు అవకాశం లేదు. రోజువారీ రాబడి ప్రభుత్వ అవసరాలకు చాలట్లేదు. డిసెంబరు 29 వరకూ ఇదే పరిస్థితి కొనసాగితే కష్టమేనని రిజర్వుబ్యాంకు అంటోంది.

పీకల్లోతు అప్పులు.. ఓడీతో తిప్పలు..ఇదీ ఏపీ ఆర్థిక పరిస్థితి

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శికి రిజర్వుబ్యాంకు సోమవారం అందించిన వర్తమానం ప్రకారం.. ఈ నెల 13 నుంచి రాష్ట్రం ఓడీలోనే ఉంది. డిసెంబర్ 17 నాటికి 2వేల 162.84 కోట్ల ఓడీలో ఉన్నట్లు పేర్కొంది. ఈ నెల తొలి 20రోజుల్లో దాదాపు 14 రోజులకు మించి రాష్ట్రం ఓవర్‌డ్రాఫ్ట్‌లో ఉండటం గమనార్హం. దాదాపు ఈ నెలంతా ఇవే కష్టాలు తప్పేలా లేవని నిపుణులు చెబుతున్నారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం అనుమతి ఇచ్చిన నికర రుణపరిమితి ఇప్పటికే దాటేసింది. కార్పొరేషన్ల నుంచి తీసుకుంటున్న రుణాలనూ కలిపి లెక్కించాలని ఆర్థికసంఘం పేర్కొంటోంది. అవీ కలిపితే నికర రుణ పరిమితిని మించిపోయి రుణాలు వినియోగించుకున్నట్లు అవుతుంది.

కార్పొరేషన్ల రుణాలను రహస్యంగా ఉంచడంతో, తొలి 9 నెలలకు కేంద్రం ఇచ్చిన రుణపరిమితి ఎప్పుడో దాటిపోయింది. దీనివల్ల ఈ నెలలో రిజర్వుబ్యాంకు ప్రతి మంగళవారం నిర్వహించే సెక్యూరిటీల వేలంలో ఏపీ పాల్గొనే అవకాశం లేకుండా పోతోంది. జనవరి నుంచి మొదలయ్యే చివరి త్రైమాసికంలో కొత్త రుణాలకు అనుమతిపై సందిగ్ధత నెలకొంది.

ఇవీ చదవండి:

Last Updated : Dec 21, 2022, 12:50 PM IST

ABOUT THE AUTHOR

...view details