ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'విలీన నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి'

By

Published : Aug 18, 2021, 7:35 PM IST

నూతన విద్యా విధానం పేరుతో ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలలో విలీనం చేసే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని శాసనమండలి ప్రొటెం చైర్మన్ విఠపు బాలసుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు విద్యాబోధన చేసేందుకు తగిన వసతులు, ఉపాధ్యాయులు లేరని.. విలీనం కారణంగా ఉన్నత పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులపై అదనపు భారం పడుతుందని అన్నారు.

శాసనమండలి ప్రొటెం చైర్మన్ విఠపు బాలసుబ్రహ్మణ్యం
శాసనమండలి ప్రొటెం చైర్మన్ విఠపు బాలసుబ్రహ్మణ్యం

జాతీయ నూతన విద్యా విధానం పేరుతో కిలోమీటర్ల పరిధిలో ఉండే ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలలో విలీనం చేసే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని శాసనమండలి ప్రొటెం చైర్మన్ విఠపు బాలసుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. స్థానిక యూటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులతో కలసి ఉదయగిరి పట్టణంలో ఇటీవల కరోనాతో మృతిచెందిన ఉపాధ్యాయుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. అనంతరం అప్పసముద్రం గ్రామంలో మనబడి నాడు నేడు పథకంలో అభివృద్ధి చేసిన ప్రాథమిక పాఠశాలను సందర్శించారు.

కరోనా కారణంగా ఏడాది పాటు చదువులకు దూరమైన విద్యార్థులు చదువులో వెనుక పడ్డామనే ఆందోళన చెందకుండా ఉపాధ్యాయులు శ్రద్ధ చూపి విద్యార్థులకు భరోసా కల్పించాలని అన్నారు. ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి జాతీయ నూతన విద్యా విధానంపై అభిప్రాయాన్ని సేకరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆయన చెప్పారు. పాఠశాల విద్యా విధానంలో చాలా మార్పులు రాబోతున్నాయన్నారు. ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలలో విలీనం చేయడం సరికాదని విమర్శించారు. ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలు ఉన్నత పాఠశాల విద్యార్థులతో ఇమడ లేరని అభిప్రాయపడ్డారు.

ఉపాధ్యాయులపై అదనపు భారం..

ఉన్నత పాఠశాలలో విలీనమయ్యే ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు విద్యాబోధన చేసేందుకు తగిన వసతులు, ఉపాధ్యాయులు లేరని పేర్కొన్నారు. విలీనం కారణంగా ఉన్నత పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులపై అదనపు భారం పడుతుందని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం జడ్పీ ఉన్నత పాఠశాలలో జీవ శాస్త్ర ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు సొంత నిధులు రూ.6 లక్షలతో విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన నూతన భోజనశాలను ప్రారంభించారు.

ఇదీ చదవండి:

వివేకా హత్య కేసు: 73వ రోజు సీబీఐ విచారణ.. అధికారులను కలిసిన సునీత

వారి కోసం తాలిబన్ల వేట- ఇంటింటికీ వెళ్లి సోదాలు!

ABOUT THE AUTHOR

...view details