ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రాణాలు తీస్తున్న బైక్‌ సాహసాలు

By

Published : Nov 23, 2022, 12:25 PM IST

bike stunts
బైక్‌ సాహసాలు ()

Youth performing dangerous bike stunts: రాకెట్ లా స్పీడ్.. హీరోల్లా బైక్‌పై స్టంట్లు. అదో సాహసంలా భావిస్తున్నారు యువత. తీరా ప్రమాదాల బారిన పడి.. ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తల్లిదండ్రులకు శోకాన్ని మిగుల్చుతున్నారు. ఈ తరహా సంస్కృతి ఇటీవల పెరగటం కలవరం కలిగిస్తోంది.

Youth performing dangerous bike stunts: సినిమాల్లో చేసే విన్యాసాలను యువత సొంతంగా చేస్తూ.. లేనిపోని తలనొప్పులు తెచ్చి పెట్టుకుంటున్నారు. సరదాగా సాహసాలు చేస్తూ.. ప్రాణాలు తీసుకుంటున్నారు. స్తోమత లేకపోయినా తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి మరీ స్పోర్ట్స్‌ బైక్‌లు కొని.. వాటిపై నిలబడి, పడుకుని రకరకాలుగా స్టంట్‌లు చేస్తున్నారు. వీటికి బీఆర్‌టీఎస్‌ రోడ్డు, కనకదుర్గ వంతెన, హైటెన్షన్‌ రోడ్డు, బెంజ్‌ సర్కిల్‌ వంతెనలు, ప్రకాశం బ్యారేజి, తదితర ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. వీటితో పాటు విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారి కూడా వేదిక అవుతోంది. ఈ మార్గంలోని కంకిపాడు, ఉయ్యూరు, తదితర ప్రాంతాల్లోని వంతెనలు, సర్వీసు రోడ్లపై.. యువకులు బైక్‌లపై విన్యాసాలు చేస్తూ వీడియోలు తీస్తున్నారు.

ఇలా ప్రమాదకర స్టంట్‌లు వద్దని తల్లిదండ్రులు వారించినా వినకుండా ప్రయత్నించి.. ప్రాణాలు కోల్పోయాడు ఉయ్యూరు పట్టణానికి చెందిన గౌరీ సాయికృష్ణ. 18 సంవత్సరాలకే కన్నుమూశాడు. పమిడిముక్కల మండలం మంటాడ సర్వీసు రోడ్డులో వేగంగా వెళ్తున్న బైక్‌పై నిలబడి విన్యాసాలు చేసే దృశ్యాన్ని చిత్రీకరిస్తుండగా.. బ్యాలెన్స్‌ తప్పి ప్రమాదానికి గురై తుదిశ్వాస విడిచాడు. విజయవాడ నగరం ఫకీర్‌గూడెం ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల ఖాజా.. స్టంట్‌ మాస్టర్‌గా పేరు తెచ్చుకోవాలన్న లక్ష్యంతో బైక్‌పై ప్రమాదకర విన్యాసాలు చేస్తుండేవాడు. గత ఏడాది కనకదుర్గ వంతెనపై స్పోర్ట్స్‌ బైక్‌పై ఫీట్లు చేస్తూ ప్రమాదానికి గురయ్యాడు. తన తప్పును తెలుసుకుని.. బైక్‌ స్టంట్‌ వీడియోతో పాటు గాయడిన ఫొటోలను కలిపి వాట్సాప్‌ స్టేటస్‌లో ఉంచి జాగ్రత్తగా ఉండాలని పోస్ట్‌ పెట్టాడు.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్, వంటి సామాజిక మాధ్యమాల ద్వారా నిరంతరం యువత అనుసంధానం అయి ఉంటున్నారని.. సినిమాల్లోని స్టిల్స్, స్టంట్స్‌ను చిత్రీకరించి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తున్నారని ఎన్‌జీవో ప్రతినిధులు చెబుతున్నారు. అందరిలో తన సత్తా చాటుకునేందుకు ఈ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచుతున్నారని.. ఫలితంగా ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారని సేఫ్టీ నిపుణులు తెలిపారు.

ఇలాంటి వారిపై నిఘా పెట్టడంతో పాటు అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు. ఇటువంటి విన్యాసాలు నిత్యం నగరంలో ఏదొక ప్రాంతంలో జరగుతున్నాయని.. వెలుగులోకి వచ్చేది కొన్ని మాత్రమేనని చెబుతున్నారు. పోలీసులు సైతం నిరంతర నిఘాను పెంచి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details