ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'27 పథకాల్ని రద్దు చేసిన వైకాపాకు బుద్ధి చెబుదాం..'

By

Published : Dec 19, 2022, 7:24 AM IST

Updated : Dec 19, 2022, 11:53 AM IST

SC, ST Schemes Canceled YCP Government: ఎస్సీ, ఎస్టీల మద్దతుతో గద్దెనెక్కిన సీఎం జగన్‌.. అధికారం చేపట్టగానే 27 పథకాల్ని రద్దు చేసి.. వారిని వెన్నుపోటు పొడిచారని.. ఆ వర్గానికి చెందిన ఐకాస నేతలు ధ్వజమెత్తారు. పథకాలు అమలు చేస్తే మాట వినరనే రాజకీయ కుతంత్రంలో భాగంగానే వాటిని రద్దు చేశారని మండిపడ్డారు. 16 నెలలు జైల్లో ఉన్న జగన్‌ను ఎస్సీ, ఎస్టీలు కంకణం కట్టుకుని ముఖ్యమంత్రిని చేస్తే.. ఇప్పుడు వారినే ఊచకోత కోస్తున్నారని దుయ్యబట్టారు. చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ, ప్రధానీ చేయని విధంగా ఎస్సీ, ఎస్టీల మీదే ఎట్రాసిటీ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో జగన్‌ను సీఎం పదవి నుంచి దించకపోతే రాష్ట్రంలో సామాజిక న్యాయం మంటగలిసిపోతుందన్నారు.

SC ST Schemes
ఎస్సీ ఎస్టీ పథకాలు

SC, ST Schemes Canceled YCP Government: విశ్రాంత ఐఏఎస్ అధికారి గోపాలరావు అధ్యక్షతన విజయవాడలో దళిత గిరిజన ఐకాస రాష్ట్ర సదస్సు జరిగింది. రాష్ట్ర నలుమూలల నుంచి దళిత గిరిజన సంఘాలు ప్రతినిధులు, మేధావులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. హక్కుల కోసం ప్రశ్నిస్తున్న వ్యక్తులపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని వారు ఆందోళ వ్యక్తం చేశారు. దళిత బహుజన ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు కొరివి వినయ కూమార్ దళిత, గిరిజన నేతల ఆధ్వర్యంలో బెజవాడ డిక్లరేషన్ ప్రకటించారు. ఇందులో 12 అంశాలను ప్రధానంగా ప్రకటించారు.

'27 పథకాల్ని రద్దు చేసిన వైకాపాకు బుద్ధి చెబుదాం..'

27 సంక్షేమ పథకాల పునరుద్ధరణ, ఎస్సీ, ఎస్టీ సమగ్రాభివృద్ధి కోసం చట్టం, కాలపరిమితి లేకుండా సబ్ ప్లాన్ చట్టం అమలు, అంబేడ్కర్ పేరు మీద ఉన్న పథకాల పునరుద్ధరణ, ఎస్సీ, ఎస్టీలకు స్కాలర్ షిప్‌లు మంజూరు, కోనేరు రంగారావు సిఫార్సుల అమలు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు, జోగినీ, సఫాయి కర్మచారీలు, బాండెడ్ లేజర్ల విముక్తికి చట్టాలు వంటి అంశాలతో బెజవాడ డిక్లరేషన్ విడుదల చేశారు. డిక్లరేషన్ ను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.

ఎస్సీలను కేవలం రాజకీయంగా ఉపయోగించుకునేందుకే వైసీపీ ప్రయత్నిస్తోందని.. సమావేశంలో పాల్గొన్న ఆ వర్గాలకు చెందిన రాజకీయపార్టీల నేతలు ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఏదో చేస్తారని నమ్మి జగన్‌కు ఓటు వేశామన్న వివిధ జిల్లాల నుంచి వచ్చిన నేతలు.. తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో వైసీపీకు తమ సత్తా ఏంటో చూపిస్తామని చెప్పారు. రాజకీయ విభేదాలకు తావివ్వకుండా ఐక్య ఉద్యమం ద్వారా ప్రభుత్వ అన్యాయాన్ని అడ్డుకుందామని సమావేశంలో నేతలు పిలుపిచ్చారు. అప్పుడే నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోగలమని స్పష్టంచేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 19, 2022, 11:53 AM IST

ABOUT THE AUTHOR

...view details