ఆంధ్రప్రదేశ్

andhra pradesh

"ఆ డివిజన్‌లోని పోలీసులు లంచం లేనిదే పనిచేయడం లేదు".. డీజీపీకి వైఎస్సార్​సీపీ నేత లేఖ

By

Published : Mar 2, 2023, 12:57 PM IST

YCP LEADER LETTER TO DGP : రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. విపక్షాలు, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం సాగిస్తున్నారు. తాజాగా పోలీసులపై అవినీతి ఆరోపణలు చేస్తూ అధికార పార్టీకి చెందిన నేత డీజీపీకి లేఖ రాయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

YCP LEADER LETTER TO DGP
YCP LEADER LETTER TO DGP

YCP LEADER LETTER TO DGP : రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది. వాడీవేడిగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. నువ్వు ఎంత అంటే నువ్వెంతని.. ప్రజలకు నువ్వు ఏం చేశావ్​ అంటే నువ్వు ఏం చేశావ్​ అని వివాదాలకు దిగుతున్నారు. అయితే అన్ని వివాదాలు జరుగుతున్న పోలీసులు మాత్రం అధికార పార్టీ చెప్పు చేతల్లో నడుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం ప్రజాప్రతినిధుల మెప్పు కోసం ఎన్ని అన్యాయాలు జరిగిన బాధితులపైనే కేసులు పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.

తాజాగా పోలీసులపై మరో ఆరోపణలు వినిపిస్తున్నాయి. లంచం లేనిదే పనులు జరగడం లేదని.. డబ్బు తీసుకోని పనులు చేయడం లేదని ఓ వ్యక్తి రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. అయితే ఆ లేఖ రాసింది ప్రతిపక్షనాయకుడో, లేదా అతని అనుచరులో అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆ లేఖ రాసింది అధికార పార్టీకి చెందిన నాయకుడు. అవును మీరు విన్నది నిజమే.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లికి చెందిన వైఎస్సార్​సీపీ నేత.. మంగళగిరి నార్త్​ సబ్​ డివిజన్​ అధికారులను విమర్శిస్తూ లేఖ రాశారు.

సబ్​ డివిజన్​లో మూడు సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్న పోలీసు అధికారులను వెంటనే బదిలీ చేయాలని డీజీపీకి ఉండవల్లి వైఎస్సార్​సీపీ నేత, మాజీ ఎంపీటీసీ సభ్యులు సంజీవరెడ్డి లేఖ రాశారు. మంగళగిరిలో అవినీతి విలయ తాండవం చేస్తోందని లేఖలో తెలిపారు. నార్త్ సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు స్టేషన్లు అవినీతి మయంగా మారాయని లేఖలో పేర్కొన్నారు.

అధికారులు కులతత్వం కారణంగా లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయని ఆరోపించారు. లంచం లేనిదే పని పూర్తి కావడం లేదని.. డబ్బులు తీసుకోకుండా అధికారులు ఎటువంటి పనులు చేయడం లేదని తెలిపారు. లంచం ఇవ్వలేని వారు పోలీస్​స్టేషన్​కు వెళ్లే పరిస్థితి లేదని తెలిపారు. రాష్ట్రంలో లా అండ్​ ఆర్డర్​ పూర్తిగా విఫలమైందని.. ప్రభుత్వ పరువు ఎప్పుడో మంటగలిసిపోయిందని మండిపడ్డారు. ఆఖరికి అనాథ శవం వచ్చినా బంధువుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శించారు.

సామాన్య ప్రజలు పోలీస్​స్టేషన్​కు వెళ్లాలి అంటే భయపడే పరిస్థితిలో ఉన్నారని లేఖలో తెలిపారు. లంచం ఇవ్వనిదే పోలీస్​స్టేషన్​లో పని కావడం లేదన్నారు. పై స్థాయి అధికారులందరికీ ఇక్కడ జరిగే అవినీతి గురించి పూర్తిగా అవగాహన ఉందని.. ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయనే ఆరోపణలు చేశారు. అవినీతి పరులైన అధికారులపై విచారణ జరిపి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికైనా నార్త్ సబ్ డివిజన్ పరిధిలో నిజాయితీ పరులైన అధికారులను నియమించి ముఖ్యమంత్రి జగన్ పరువు కాపాడాలని కోరారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details