కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తి కట్టడికి చర్యలు చేపడుతుంటే.. వైకాపా నేతలు మాత్రం అక్రమ సంపాదనపై దృష్టి సారించారని తెదేపా ఇంఛార్జి అరవిందబాబు విమర్శించారు. కూలీలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు సంపాదనలు వదులుకుని ఇంట్లో కూర్చుంటే.. అధికార పార్టీ నాయకులు అక్రమ మార్గాల్లో ఇసుక అమ్ముకుంటున్నారని ఆయన నరసరావుపేటలో ఆరోపించారు. అలాగే మద్యాన్ని అక్రమంగా విక్రయిస్తూ సంపాదించుకుంటున్నారని ధ్వజమెత్తారు. నిరుపేదలకు ఇస్తున్న వెయ్యి రూపాయల నగదులోనూ చేతివాటం చూపిస్తున్నారని మండిపడ్డారు. ఈ కష్టకాలంలో వైకాపా నేతలు ఇలా అక్రమార్జన చేయడం దారుణమన్నారు.