ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వివేకా హత్య కేసు: సీఎం క్యాంపు ఆఫీస్​పై సీబీ'ఐ'.. ‘పవర్‌ఫుల్‌ వ్యక్తి’ సహాయకుడికి నోటీసులు

By

Published : Jan 31, 2023, 6:59 AM IST

CBI EYE ON CMO OFFICE
CBI EYE ON CMO OFFICE

CBI EYE ON CMO OFFICE : వివేకా హత్య కేసులో సీబీఐ చూపు సీఎం కార్యాలయంలోని ఓ వ్యక్తిపై పడింది. ఓ పవర్‌ ఫుల్‌ వ్యక్తి సహాయకుడికి నోటీసులిచ్చింది. అవినాశ్​రెడ్డి ఫోన్‌ నుంచి ఎక్కువ కాల్స్‌ అందుకున్న ఆ సహాయకుడిని విచారణకు రావాలని ఆదేశించింది.

CBI EYE ON KEY PERSON ASSISTANT IN CMO OFFICE : మాజీ మంత్రి వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఉండే ఓ పవర్‌ఫుల్‌ వ్యక్తికి సహాయకుడిగా వ్యవహరిస్తున్న నవీన్‌కు సీబీఐ నోటీసులిచ్చింది. అత్యంత ముఖ్యనేతకు సన్నిహితుడైన మరొకరికీ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

ఈనెల 28న కడప ఎంపీ వైెఎస్​ అవినాశ్​రెడ్డిని నాలుగున్నర గంటలపాటు విచారించిన CBI ప్రధానంగా ఆయన కాల్‌డేటాపై ఆరా తీసింది. నవీన్ అనే వ్యక్తి పేరిట ఉన్న మొబైల్ నంబర్‌కు అవినాష్ ఎక్కువగా కాల్ చేసి మాట్లాడినట్లు దర్యాప్తులో గుర్తించింది. నవీన్ గురించి ఆరా తీసింది. తాడేపల్లి ప్యాలెస్‌లో ఓ పవర్ ఫుల్ వ్యక్తిని.. సన్నిహితులు ఎవరైనా సంప్రదించాలన్నా, ఫోన్లో మాట్లాడాలన్నా నవీన్ పేరిట ఉన్న నంబర్‌కే కాల్ చేయాల్సి ఉంటుందని.. ఆయన ఆ సమాచారాన్ని పవర్‌ఫుల్‌ వ్యక్తికి తెలియజేసి మాట్లాడే ఏర్పాటు చేస్తారని సీబీఐ గుర్తించినట్లు సమాచారం.ఈ నేపథ్యంలోనే అవినాష్ రెడ్డి ఎక్కువగా ఆ నంబర్‌కు కాల్స్ చేసినట్లు అంచనాకు వచ్చింది. వీటిపై సమగ్రంగా ప్రశ్నించేందుకు నవీన్‌కు సీబీఐ నోటీసులిచ్చినట్లు సమాచారం.

మరోవైపు వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు సోమవారం పులివెందులలోని సీఎం జగన్ కార్యాలయానికి వెళ్లారు. కార్యాలయ అధికారులను కలిసి... కె.హరిప్రసాద్ తో పాటు ఇతరుల పేర్లు అడుగుతూ..వారు ఎక్కడుంటారని ఆరా తీశారు. అనంతరం పాత బస్టాండ్‌ మీదుగా పూల అంగళ్లు, వివేకానందరెడ్డి ఇంటి వరకు వెళ్లి పరిశీలించారు. అవినాష్‌రెడ్డిని అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని సీబీఐ చెప్పిన నేపధ్యంలో అధికారులు పులివెందులకు వచ్చి పలు అంశాలపై ఆరా తీయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ కేసులో నిందితులు ఎర్ర గంగిరెడ్డి, అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరి, రిమాండు ఖైదీలుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, ఉమాశంకర్రెడ్డిని ఫిబ్రవరి 10న విచారణకు హైదరాబాద్‌ రావాలని సీబీఐ నోటీసులు ఇచ్చింది. వీరి విచారణకు ముందు మరింత మందికి నోటీసులిచ్చి దర్యాప్తుకు పిలిచే అవకాశాలున్నట్లు సమాచారం. సీబీఐ కదలికలు తెలుసుకున్న పలువురు నాయకులు పులివెందుల నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details