ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Endowment Lands: దేవుడి భూములనూ వదల్లేదు.. సొంత ఆస్తిలా రాసిచ్చేస్తున్నారు!

By

Published : Apr 23, 2023, 7:26 AM IST

Endowment Department Lands: ఆలయాల దూప, దీప నైవేధ్యాల కోసం దానం ఇచ్చిన భూములను కొందరు గుప్పిట పెట్టుకుని దేవదాయశాఖ ఆదాయానికి గండికొడుతున్నారు. బహిరంగ వేలం ద్వారా.. భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా ఎన్నో ఏళ్లుగా వేలం నిర్వహించకుండా అడ్డుకుంటున్నారు. ఆ భూములు తమ సొంత ఆస్తి అన్నట్లుగా వారసులకూ రాసిచ్చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రంపయర్రంపాలెంలోని మల్లంపల్లి సుందరమ్మ సత్రం భూములలో.. వివాదం నెలకొన్న వివాదంపై ఈటీవీ భారత్ కథనం.

Endowment Lands
దేవాదాయ శాఖ భూములు

Endowment Lands: దేవుడి భూములనూ వదల్లేదు.. సొంత ఆస్తిలా రాసిచ్చేస్తున్నారు!

Endowment Department Lands: తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం రంపయర్రంపాలెంలో ఆలయ భూములు పరిశీలించిన దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌ విజయరాజు వారం పదిరోజుల్లో వేలం నిర్వహించి కౌలుదారులకు.. అందజేస్తామని ఆయన అన్నారు. ఈ మాటలు చెప్పి ఇప్పటికి 7 నెలలు గడుస్తున్నా భూముల వేలంపాట మాత్రం నిర్వహించలేదు.

వేలం నిర్వహిస్తే సాగు చేసుకుంటాము : దేవదాయశాఖకు చెందిన సుమారు 67 ఎకరాల భూమిని కొందరు పెద్దలు తమ గుప్పిట పెట్టుకుని.. రాజకీయ పలుకుబడితో వేలం నిర్వహించకుండా అడ్డుకుంటున్నారని.. పేదలు ఆరోపిస్తున్నారు. ఈ భూములకు వేలం నిర్వహిస్తే తాము పాట పాడుకుని సాగు చేసుకుంటామని చెప్తున్నారు.

దశాబ్దాలుగా వేలం లేదు : రంపయర్రంపాలేనికి చెందిన శ్రీమల్లంపల్లి సుందరమ్మ.. 1953లో 89.14 ఎకరాల మెట్ట భూమిని పెరవలి మండలం కొత్తపల్లి అగ్రహారంలోని శ్రీఉమా మహేశ్వరస్వామి.. ఆలయానికి దానంగా ఇచ్చారు. స్వామివారి కళ్యాణం, కార్తీక మాసంలో పూజలు, బాటసారుల దాహార్తి, అన్న సంతర్పణకు ఈ భూమి వినియోగించాల్సిందిగా ఆమె కోరారు. ఈ భూమిలో 17.14 ఎకరాలు కొండ ప్రాంతం ఉండగా.. సూరంపాలెం రిజర్వాయర్ కాల్వలకు 4.35 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. మిగిలిన 67.65 ఎకరాలను 17 భాగాలుగా విభజించి.. కొందరు కొన్నేళ్లుగామామిడి, జీడిమామిడి తోటలు సాగు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం.. దేవదాయ భూములకు ప్రతి మూడేళ్లకు ఒకసారి వేలం నిర్వహించాల్సి ఉన్నా.. కొన్ని దశాబ్దాలుగా వేలం నిర్వహించడం లేదు. అనధికారికంగానే కొందరు రైతులు సాగుచేసుకుంటున్నారు. సత్రం భూములకు తక్షణమే బహిరంగ వేలం నిర్వహిస్తే.. దేవదాయశాఖకు ఆదాయం, ఊళ్లో కూలీలకు ఉపాధి దొరుకుతుందని స్థానికులు చెప్తున్నారు.

"58 సంవత్సరాలుగా.. ఇప్పటి వరకూ దీనికి వేలంపాట లేదు. ఇక్కడ ఉన్న భూమిపై అగ్రవర్ణాలవారే బతుకుతున్నారు కానీ, పేదవాళ్లు ఇక్కడ నుంచి ఏ ఒక్కరోజు ఫలసాయం కూడా తీసుకోలేదు. మా డిమాండ్ ఏంటంటే.. దీనికి వేలంపాట పెట్టాలి. కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలని.. ఇక్కడ ఉన్న ఊరి పెద్దలు, రాజకీయ నాయకులు, దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు". - శ్రీకాంత్, రంపయర్రంపాలెం

"మేము 20 సంవత్సరాలుగా పోరాడుతున్నాం. అయినా సరే మా పని జరగడం లేదు. కలెక్టర్ గారి దగ్గరకి వెళ్తే.. వస్తున్నాం, అధికారులను పంపిస్తున్నాం అంటున్నారు. కానీ, ఎవరూ రావడం లేదు. అందుకని వేలంపాట పెడితే.. మేము కూడా పాడుకుంటాము". - వడ్లపాటి చంద్ర, రంపయర్రంపాలెం

"మేము డబ్బులు లేకుండా అడగడం లేదు. వేలంపాట పెట్టండి.. మేము కూడా పాడుకుంటాం అని చెప్తున్నాం. కలెక్టర్ గారి దగ్గరకి వెళ్తే ఓకే.. ఓకే అంటున్నారు కానీ పని మాత్రం జరగడం లేదు. ఈ భూములను కొంతమంది కంచెలు వేసి పంచేసుకున్నారు. ఈ భూమి అంతా దేవాదాయశాఖది.. వారి సొంతం కాదు". - ముసలయ్య, రంపయర్రంపాలెం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details