ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Grieving godavari farmer: రైతులకు కడగండ్లు మిగిల్చిన గోదావరి వరదలు

By

Published : Jul 17, 2022, 8:09 AM IST

Updated : Jul 17, 2022, 1:08 PM IST

(Grieving farmers) గోదావరి వరద రైతులకు కడగండ్లు మిగిల్చింది. చేతికొచ్చిన పంట మొత్తం నీటిపాలైంది. లక్షలాది రూపాయల పెట్టుబడితో రైతు కష్టమంతా వరద నీటిలో కొట్టుకుపోయింది. అరకొరగా దక్కిన పంటను అందినకాడికి అమ్ముకుందామన్నాకొనే దిక్కే లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

Grieving farmers
Grieving farmers

(Grieving farmers) గోదావరి వరదలు రైతులను నిండా ముంచేశాయి. ఉద్యాన పంటలకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. లంక గ్రామాల్లోని వేలాది ఎకరాల్లో సాగు చేసిన అరటి, బొప్పాయి, కంద, మొక్కజొన్న, కూరగాయల పంటల్ని వరద సర్వనాశనం చేసింది. వారం, పది రోజులు ఆగితే పంట చేతికొచ్చే దశలో వరద ముంచెత్తి ఆశల్ని చిదిమేసిందని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. నీటి ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతుండటంతో కాస్తో కూస్తో పంటనైనా దక్కించుకుందామని పడవలపై ప్రమాదానికి ఎదురెళుతున్నారు. పక్వానికి రాని అరటి, పూర్తిగా గింజ కట్టని మొక్కజొన్న, చిన్న చిన్న బొప్పాయి కాయలు కోసుకుని ఒడ్డుకు చేరుస్తున్నారు. కానీ ఫలితం దక్కడం లేదు.

కరోనాతో వరుసగా రెండేళ్లు నష్టాలను చవిచూసిన రైతులు ఈ ఏడాది కాస్తా, కూస్తో మిగులుతుందనుకుంటే వరద నట్టేట ముంచేసింది. భూ యజమానులకు ముందుగానే డబ్బులు చెల్లించామని ఇప్పుడు తమ కష్టమంతా నీటిలో కలిసిపోయిందని కౌలు రైతులు(tenent farmers) వాపోతున్నారు. లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి అరటి, బొప్పాయి వంటి పంటలు సాగు చేస్తే పూర్తిగా వరద నీటిలో కొట్టుకుపోయిందని గగ్గోలు పెడుతున్నారు. సాహసోపేతంగా వరద నీటిలో ప్రయాణించి తోటల నుంచి పంటను ఒడ్డుకు చేర్చినా మార్కెట్‌లో సరైన ధర దక్కడం లేదని అంటున్నారు.

రైతులకు కడగండ్లు మిగిల్చిన గోదావరి వరదలు

ఇప్పటికే 5 రోజులుగా పంటలు నీటిలో నానుతున్నాయి. మరో మూడు రోజుల వరకు నీరు బయటికిపోయే పరిస్థితులు కనిపించడం లేదు. దీనివల్ల మొత్తం పంటలు కుళ్లిపోతాయని రైతులు చెబుతున్నారు. వరద(Flood water) తగ్గినా అరటి చెట్లు కూలిపోతాయి. నీళ్లలో ఉన్న వంగ, కంద, పచ్చిమిరప, ఇతర కూరగాయ పంటలన్నీ తుడిచిపెట్టుకుపోయినట్లే. రెండు, మూడెకరాలు సాగు చేసిన ప్రతి రైతుకు లక్ష నుంచి 2 లక్షల వరకు నష్టం తప్పదు. పంట పూర్తిగా పక్వానికి రాకపోయినా, వరద భయంతో అరటి, బొప్పాయి, మొక్కజొన్న పంటలు కోస్తుండటంతో ఇదే అదునుగా వ్యాపారులు ధరలు తగ్గించేస్తున్నారు. వరద రాకముందు వరకు పొలానికే వచ్చి అరటి గెల 350 రూపాయల చొప్పున కొనుగోలు చేసినవారు నేడు మార్కెట్‌కు తీసుకెళ్లినా 60 రూపాయలకు మించి ఇవ్వడం లేదు. నోటికాడికి వచ్చిన పంట నీటమునిగడంతో చావాలో, బతకాలో తెలియడం లేదని రైతులు వాపోతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jul 17, 2022, 1:08 PM IST

ABOUT THE AUTHOR

...view details