విశాఖ జిల్లా గంగవరం పోర్టులోని ప్రభుత్వ వాటాను ప్రైవేటుపరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. తెలుగుదేశం నేతలు నిరసనకు దిగారు. తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు.. పాతగాజువాక కూడలిలో ఆందోళన చేపట్టారు. పోర్టులోని ప్రభుత్వ వాటాను ఇప్పటికిప్పుడు అమ్మేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. పోర్టును అదానీకి కట్టబెట్టడం ద్వారా.. స్టీల్ ప్లాంటును కూడా ప్రైవేటుపరం చేయడానికి ఎత్తులు వేస్తున్నారని ఆరోపించారు.
ప్రభుత్వ వాటా ప్రైవేటుపరం...
గంగవరం పోర్టు అదానీ కంపెనీ ఆధీనంలోకి వెళ్లనుంది. ఏపీ ప్రభుత్వానికి ఉన్న 10.4శాతం వాటాను అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజడ్ లిమిటెడ్ సొంతమవుతోంది. ఈ వాటాను రూ. 644.78 కోట్లకు తమకు విక్రయించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 23న అనుమతి ఇచ్చినట్లు అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజడ్ వెల్లడించింది. ఈ లావాదేవీ ఒక నెలలో పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.