ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైకాపా వైరస్.. తెలుగుదేశమే వ్యాక్సిన్ : చంద్రబాబు

By

Published : Jan 5, 2022, 7:49 PM IST

Chandrababu naidu Fire on YSRCP: మూడేళ్లల్లో జగన్ ప్రభుత్వం మూడు ఇళ్లు కూడా కట్టలేదని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఆస్పత్రుల్లో మందులు కూడా కరువయ్యాయని ఎద్దేవా చేశారు. రూ. వేయి దాటితే ఉచితంగా వైద్యం అన్న జగన్.. అది అమలు చేయలేదని అన్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలు చేయలేని అసమర్థ ప్రభుత్వం ఇదేనన్న బాబు.. తెలుగువాళ్లు తలదించుకునేలా వైకాపా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.

చంద్రబాబు
chandrababu naidu

TDP State Level Meeting: నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయని.. ప్రజలు సంతోషంగా సంక్రాంతి పండగ జరుపుకోలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. వైకాపా పాలనలో బెదిరింపులు, దాడులు విపరీతంగా పెరిగిపోయాయని.. తెలుగువాళ్లు తలదించుకునేలా వైసీపీ ప్రభుత్వ వ్యవహరిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో 175 శాసనసభ, 25 లోక్‌సభ నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ పాలనపై విమర్శలు చేశారు.

అప్పుడు రద్దు అన్నారు.. ఇప్పుడు కావాలంటున్నారు..
మెజార్టీ లేదని మండలి రద్దు చేస్తామని.. మెజార్టీ రాగానే రద్దును పక్కన పెట్టేశారని బాబు ధ్వజమెత్తారు. మండలి విషయంలో ఈ తీరు సిగ్గు అనిపించడం లేదా? అని ప్రశ్నించారు. చట్టాన్ని అతిక్రమించి వ్యవహరించిన అధికారులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. గతంలో జగన్​కు సహకరించిన అధికారులు జైళ్లకు వెళ్లారని గుర్తు చేశారు. నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారని.. మద్యం వినియోగం పెంచుతూనే మద్యనిషేధం అని చెబుతున్నారని, ఎప్పుడో కట్టుకున్న ఇళ్లకు ఇప్పుడు ఓటీఎస్‌ అంటున్నారని ధ్వజమెత్తారు.

మూడేళ్లల్లో.. మూడు ఇళ్లు కూడా కట్టలేదు
మూడేళ్లల్లో జగన్ ప్రభుత్వం మూడు ఇళ్లు కూడా కట్టలేదని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఆస్పత్రుల్లో మందులు కూడా కరువయ్యాయని మండిపడ్డారు. రూ. వేయి దాటితే.. ఉచితంగా వైద్యం అందిస్తామని చెప్పారన్న బాబు.. దాని ఊసే లేదన్నారు. ఇక, రాష్ట్రంలో రోడ్లు నరకాన్ని తలపిస్తున్నాయని, రోడ్లు పాడై ప్రజలు, ప్రయాణికులు చాలా అవస్థలు పడుతున్నారని, అయినా.. ప్రభుత్వంలో చలనం లేదని ఆగ్రహించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గర్భిణులు డోలీల్లో రావాల్సిన పరిస్థితి నెలకొందని విమర్శించారు.

శ్వేత పత్రం విడుదల చేయాలి..
విద్యుత్ ఛార్జీలు పెంచారని.. రేపో మాపో మళ్లీ పెంచబోతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పన్నులు పెంచి సొంత ఖజానాను నింపుకుంటున్నారని ఆరోపించారు. 36.5 శాతం అప్పులతో క్రమంగా ఊబిలో కూరుకుపోతున్నామన్న బాబు.. ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం ఏమైందని నిలదీశారు. ధైర్యముంటే సాధించాలి.. లేకుంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు. దిల్లీ వెళ్లి ఏం సాధించారో సీఎం జగన్‌ జవాబు చెప్పాలని నిలదీశారు.

సీపీఎస్​పై అప్పుడో మాట.. ఇప్పుడో మాట
సీపీఎస్ విషయం నాకు వదిలిపెట్టండి.. నేను చూసుకుంటానన్న జగన్.. ఇప్పుడు బడ్జెట్ కూడా సరిపోదంటున్నారని ఎద్దేవా చేశారు. కోడికత్తి కేసు ఏమైందన్న చంద్రబాబు.. చిన్నాన్న చనిపోతే అందర్నీ తప్పు దోవ పట్టించారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం రైతులు, రైతు కూలీలను మోసం చేసిందని.. ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించకుండా ఇబ్బందులు పెడుతోందని మండిపడ్డారు.

ఆనాటి గ్రాఫిక్సే.. నేటి ఎనిమిది లైన్ల రహదారి
రాష్ట్రానికి పట్టుకున్న వైకాపా వైరస్​కు తెలుగుదేశం పార్టీనే సరైన వ్యాక్సిన్ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. బీసీల అభ్యున్నతే తమ లక్ష్యమన్నారు. మైనార్టీలు, మదర్సాలపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. వైకాపాకు ఓట్లేయడమే మైనార్టీలు చేసిన తప్పా అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. తెదేపా లేకుండా చేయడం వైకాపా వల్ల కాదన్నారు. ఆనాడు హైదరాబాదులో ఔటర్ రింగ్ రోడ్డు కూడా గ్రాఫిక్సే అన్నారని.. ఆనాటి గ్రాఫిక్సే ఇప్పటి 8లైన్ల రహదారని స్పష్టం చేశారు. సంపద సృష్టించే ఆలోచన జగన్ రెడ్డికి లేదు కాబట్టే.. రూ.2లక్షల కోట్లు ఆస్తి అయిన అమరావతిని నాశనం చేశారని ధ్వజమెత్తారు. 5కోట్ల మంది ప్రజల కోసం తాము చేసేది ధర్మపోరాటమని చంద్రబాబు తేల్చి చెప్పారు.

ఇదీ చదవండి...

జగన్ చేసిన తప్పులను.. చరిత్ర మరచిపోదు: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details