ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తగ్గిన పొగాకు సాగు.. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు

By

Published : Jan 24, 2021, 8:30 PM IST

బోర్డు అధికారులు పొగాకుతోపాటు ప్రత్యామ్నాయ పంటల సాగు సూచించడంతో.. ఈ ఏడాది పొగాకు సాగు విస్తీర్ణం తగ్గింది. నెల్లూరు జిల్లా కలిగిరి, డీసీపల్లి వేలం కేంద్రాల పరిధిలో తుపాను వల్ల దెబ్బతిన్న రైతులు కొందరు రెండోసారి నాట్లు వేశారు. ఈ సారైనా మంది ఆదాయం వస్తుందని బ్రైట్ రకం పొగాకు సాగుచేస్తున్న రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

fall in tobacco plantation by farmers
తగ్గిన పొగాకు సాగు

ప్రత్యామ్నాయ పంటల వైపు రైతన్నల మొగ్గు:

ప్రకాశం జిల్లా పొదిలి, కందుకూరు-1,2, నెల్లూరు జిల్లా కలిగిరి, డీసీపల్లి వేలం కేంద్రాల్లో ఈ ఏడాది 24,678 హెక్టార్లలో పంట వేసేందుకు రైతులు అనుమతి తీసుకున్నా ఇప్పటివరకు 23,954 హెక్టార్లలో మాత్రమే వేేశారు. దీనికి తోడు నివర్‌ తుపాను ప్రభావంతో వేసిన పంటలో 4,778 హెక్టార్లు పాక్షికంగా, 1,986 హెక్టార్లు భారీగా దెబ్బతింది. దీంతో కొంతమంది రైతులు రెండోసారి నాట్లు వేయగా ఖర్చు భారీగా పెరిగింది. సాధారణంగా పొగనాట్లను సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో పూర్తి చేస్తారు. ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు పడడంతో మంచి దిగుబడి వస్తుందని వారు పెట్టుకున్న ఆశలపై నివర్‌ తుపాను నీళ్లు చల్లింది. ముందుగా నాట్లు వేసిన వారికి కొంత మేలు చేకూరింది. బోర్డు అధికారులు పొగాకుతోపాటు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని చైతన్యపరుస్తుండడంతో ఈ ఏడాది కొంత విస్తీర్ణం మేర ఆహార పంటల వైపు మొగ్గు చూపారు.

బ్రైట్‌ రకం దిగుబడితో ఆనందం:
జిల్లాలో పొగాకు సాగు ప్రస్తుతం మధ్యస్త దశలో ఉంది. ముందుగా నాట్లు వేసిన రైతులు రెండు కొట్లు ఆకు కొట్టారు. పొదిలి వేలం కేంద్రం పరిధిలోని పొదిలి, కొనకనమిట్ల, మర్రిపూడి ప్రాంతాల్లో బ్రైట్‌ రకం దిగుబడి అధికంగా రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క బ్యారన్‌కు సుమారు రూ.4 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. తోటలు చివరి వరకు ఇదే రంగు ఆకు దిగుబడి వస్తే లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. రెండేళ్లుగా నష్టాలు చవిచూస్తున్న వారికి ఈ ఏడాది నాణ్యమైన దిగుబడులు ఊరట కలిగిస్తున్నాయి.

సాగు ఆశాజనకం:

దక్షిణాది తేలిక నేలల పరిధిలో ఇప్పటివరకు పొగాకు సాగు ఆశాజనకంగా ఉంది. నివర్‌ ప్రభావంతో కొంతమేర రైతులకు నష్టం జరిగింది. నారు అందుబాటులో ఉన్న వారు మళ్లీ నాట్లు వేసుకున్నారు. మొదటి రెండు కొట్లలో ఆకు మంచి రంగు వచ్చినందున క్యూరింగ్‌లో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నాం. గత ఏడాదితో పోలిస్తే సాగు విస్తీర్ణం తగ్గింది. - డి.వేణుగోపాల్, ఎస్‌ఎల్‌ఎస్‌ ఆర్‌ఎం, ఒంగోలు

ఇదీ చదవండి:చరిత్ర సృష్టించిన వేరుశెనగ.. క్వింటా రూ. 8,020

ABOUT THE AUTHOR

...view details