Heavy Rains In Telangana: కుంభవృష్టి వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. సోమవారం సాయంత్రం నుంచి మొదలైన భారీ వర్షాలు మంగళవారం కూడా కొనసాగడంతో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతూ పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ప్రభావం తీవ్రంగా ఉంది. లోతట్టు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించి.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బుధ, గురువారాల్లోనూ భారీ వర్షాలు పడే సూచనలున్నాయని.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.
నగరంలో వరుణుడి విధ్వంసం..
హైదరాబాద్ నగరవ్యాప్తంగా సోమవారం అర్ధర్రాతి విధ్వంసం సృష్టించిన వరుణుడు మంగళవారమూ విశ్రాంతి తీసుకోలేదు. చాలాచోట్ల.. కుండపోతగా వాన కురిసింది. చెరువులు పోటెత్తడంతో నగరంలోని నాలాలు పొంగి పొర్లాయి. వందలాది లోతట్టు ప్రాంతాలు మురుగునీటిలో కూరుకుపోయాయి. రాకపోకలు స్తంభించాయి. అధికారులు పట్టించుకోవట్లేదంటూ కూకట్పల్లి, బుల్కాపూర్ నాలా పరివాహక ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. చార్మినార్, బహదూర్పుర, మలక్పేట ప్రాంతాల్లో కొన్నిచోట్ల దుర్గంధం ప్రబలింది. బురద మేటలు వేసింది. కూరగాయల మార్కెట్లు, కాలనీ రహదారులు చెత్తాచెదారంతో నిండిపోయాయి. ముఖ్యంగా.. నగరానికి 80 శాతం మాంసాన్ని సరఫరా చేసే జియాగూడ కబేళా పరిసరాలు ఆందోళనకరంగా మారాయి. ఎంజీబీఎస్, హైకోర్టు, ముసారంబాగ్ తదితర ప్రాంతాల్లో ప్రమాదకర స్థితిలో మూసీ వరద ఉంది. మూసారంబాగ్ వంతెనపై రాకపోకలను నిషేధించారు.
పోటెత్తిన మూసీ, కాగ్నా..
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కురిసిన కుండపోత వర్షాలతో ఈసీ, మూసీ, కాగ్నా నదులకు పెద్దఎత్తున వరద వచ్చి ఇళ్లు, పంటలు నీటమునిగాయి. వికారాబాద్ జిల్లా కేంద్రంలో పలుచోట్ల 150 ఇళ్లు నీటమునిగాయి. వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలోకి సైతం వరద నీరు వచ్చింది. మరోసారి రికార్డు స్థాయిలో జంట జలాశయాలైన హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్లకు వరద పోటెత్తుతోంది. మంగళవారం రాత్రి రాత్రి 10 గంటల వరకు 13 వేల క్యూసెక్కులను మూసీలోకి విడిచిపెడుతున్నారు. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రాంతంలో 12 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. సిద్దిపేట జిల్లా కోహెడ రహదారిపై మోయతుమ్మెద వాగు వరద రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో మల్కాపూర్, తొగరపు చెరువులు మత్తడిపై వరద ప్రవహిస్తోంది. తొగరపు చెరువు వరదతో 10 కుటుంబాలు చిక్కుకున్నాయి.
547.50 అడుగులకు చేరిన సాగర్
నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు ఈ నెల 28న మంత్రి జగదీశ్రెడ్డి నీటిని విడుదల చేయనున్నట్లు డ్యామ్ ఎస్ఈ ధర్మనాయక్ తెలిపారు. మరోవైపు జలాశయ నీటిమట్టం 547.50 (గరిష్ఠం 590.00) అడుగులకు చేరింది. సాగర్ నుంచి 1,000 క్యూసెక్కుల ఔట్ఫ్లో ఉంది.
వరదలో చిక్కిన యువకుడిని కాపాడిన పోలీసులు