ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జీజీహెచ్‌లో దారపనేని నరేంద్రకు వైద్య పరీక్షలు

By

Published : Oct 13, 2022, 6:22 PM IST

Updated : Oct 13, 2022, 6:40 PM IST

MEDICAL TESTS TO DARAPANENI NARENDRA : తెలుగుదేశం మీడియా సమన్వయకర్త దారపనేని నరేంద్రను అరెస్ట్​ చేసిన సీఐడీ పోలీసులు.. కొద్దిసేపటి క్రితం జీజీహెచ్​లో వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈరోజు నరేంద్రను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

MEDICAL TESTS TO DARAPANENI NARENDRA
MEDICAL TESTS TO DARAPANENI NARENDRA

MEDICAL TESTS TO DARAPANENI : సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన విషయంలో తెలుగుదేశం రాష్ట్ర మీడియా సమన్వయకర్త.. దారపనేని నరేంద్రను సీఐడీ అధికారులు కాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కొద్ది సేపటి క్రితం ఆయన్ను గుంటూరు సర్వజనాస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉదయం సీఐడీ కార్యాలయానికి వైద్యులను పిలిపించిన అధికారులు.. ఇప్పుడు జీజీహెచ్​కు తరలించారు. సీఐడీ కార్యాలయం ఎదుట మీడియా ప్రతినిధులు, తెలుగుదేశం నేతలు ఉండటంతో అధికారులు.. ఆఫీస్‌ వెనుక వైపు నుంచి జీజీహెచ్​కి తీసుకెళ్లారు. వైద్యుల నివేదిక తీసుకుని.. నరేంద్రను రిమాండ్‌కు పంపించాలని సీఐడీ అధికారులు కోరనున్నట్లు తెలుస్తోంది.

అసలేం జరిగిందంటే:తెలుగుదేశం కేంద్ర కార్యాలయ మీడియా సమన్వయకర్త దారపనేని నరేంద్రను.. బుధవారం రాత్రి సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. బుధవారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు గుంటూరు అరండల్‌పేట యాగంటి అపార్ట్‌మెంట్స్‌లోని నివాసానికి చేరుకున్న సీఐడీ అధికారులు.. రెండు గంటలపాటు నరేంద్రను ప్రశ్నించారు. అనంతరం ఆయన్ని అరెస్ట్‌ చేసి.. గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. అరెస్టుకు ముందు నరేంద్రకు సీఆర్​పీసీ నోటీసులు జారీ చేశారు. ఆయన భార్య సౌభాగ్యలక్ష్మికి అరెస్ట్ విషయం చెప్పి నరేంద్రను తీసుకెళ్లారు. ఆయనపై 153A, 505, 120B సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు నోటీసుల్లో పేర్కొన్నారు.

గన్నవరం విమానాశ్రయంలో పట్టుబడిన బంగారం వ్యవహారంపై.. సీనియర్ పాత్రికేయుడు కొల్లు అంకబాబు గతంలో ఓ పోస్టును షేర్ చేశారు. దాన్ని నరేంద్ర కూడా షేర్‌ చేశారంటూ సీఐడీ అధికారులు అభియోగాలు మోపారు. రెండు రోజుల క్రితం విజయవాడకు చెందిన ఓ వైద్యుడిని సీఐడీ అధికారులు విచారించారు. బంగారం పట్టుబడిన వ్యవహారంపై నరేంద్ర నుంచి పోస్టు వచ్చినట్లు విచారణలో ఆయన వెల్లడించారు. ఆ మేరకు కేసు నమోదు చేసి నరేంద్రను అరెస్ట్ చేశారు. తన భర్త చేసిన తప్పేంటో చెప్పకుండా బలవంతంగా తీసుకెళ్లారని నరేంద్ర భార్య ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తకు ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యతన్నారు.

తెదేపా నేతల నిరసన : దారపనేని నరేంద్ర అరెస్టుని ఖండిస్తూ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు.. గుంటూరు సీఐడీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. సీఐడీ అధికారులు, ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు యత్నించడంతో వాగ్వాదం జరిగింది. అనంతరం నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌తోపాటు ఇతర నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నరేంద్ర అరెస్టు చెల్లదని న్యాయవాది కోటేశ్వరరావు అన్నారు. గతంలో సోషల్ మీడియా పోస్టుల కేసుల్లో జరిగిందే పునరావృతమవుతుందని తేల్చిచెప్పారు.

ఖండించిన చంద్రబాబు : దారపనేని నరేంద్ర అరెస్టును తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. న్యాయస్థానాలు ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినా సీఐడీ అధికారుల తీరు మారడం లేదని ఆక్షేపించారు. అక్రమంగా వ్యవహరిస్తున్న పోలీసులు మూల్యం చెల్లించుకోక తప్పదని చంద్రబాబు హెచ్చరించారు. నరేంద్ర కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

జీజీహెచ్‌లో దారపనేని నరేంద్రకు వైద్య పరీక్షలు

ఇవీ చదవండి:

Last Updated : Oct 13, 2022, 6:40 PM IST

ABOUT THE AUTHOR

...view details