ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Minister Balineni: 'సెకీ' నుంచి తీసుకునే సౌరవిద్యుత్ భారం రాష్ట్రమే భరిస్తుంది: బాలినేని

By

Published : Nov 5, 2021, 9:17 PM IST

Updated : Nov 6, 2021, 4:38 AM IST

balineni srinivasa reddy
balineni srinivasa reddy

21:13 November 05

విద్యుత్‌ ఒప్పందంపై తెదేపా ఆరోపణలపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం

సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకి) నుంచి విద్యుత్‌ కొనుగోలు చేయడం వల్ల ప్రస్తుతం ఉన్న డిస్కంలపై ఎలాంటి భారం ఉండదని, ఈ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. ‘‘ఈ పథకం కింద తీసుకునే విద్యుత్‌కు 25 ఏళ్ల పాటు అంతర్రాష్ట సరఫరా ఛార్జీల (ఇంటర్‌ స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ సప్లై ఛార్జీలు- ఐఎస్‌టీఎస్‌) మినహాయింపు వర్తిస్తుంది. బయటి ప్రాంతాల్లో సౌర ప్రాజెక్టుల ఏర్పాటు వల్ల ఉత్పత్తి అయిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేయటానికి అవసరమైన సబ్‌స్టేషన్లు, ఇతర అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఎలాంటి మొత్తాన్ని ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. దీనివల్ల రాష్ట్రంలో ప్రాజెక్టు ఏర్పాటు చేసే దానికంటే తక్కువ ధరకే విద్యుత్‌ అందుతుంది. అందుకే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ సెకి ప్రతిపాదనపై అపనమ్మకాన్ని కలిగించే కారణం ఏదీ ప్రభుత్వానికి కనిపించలేదు...’’ అని మంత్రి బాలినేని పేర్కొన్నారు.

ఆ ప్రకటనలో మంత్రి బాలినేని ఏమన్నారంటే..
* విద్యుత్‌ చట్టం ప్రకారం విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) యూనిట్‌ రూ.2.49కి సెకి నుంచి కొనుగోలు చేయడానికి అనుమతించింది. విద్యుత్‌ చట్టం నిబంధనల మేరకు సెకి టెండర్లు నిర్వహించి యూనిట్‌ ధర ఖరారు చేసింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రమేయం లేదు.
* ఇతర రాష్ట్రాల్లో ఏర్పాటైన ప్రాజెక్టుల నుంచి వచ్చే విద్యుత్‌ తీసుకోవడం వల్ల యూనిట్‌ ల్యాండెడ్‌ కాస్ట్‌ (మనకు చేరే ధర) తగ్గుతుంది. ఇతర రాష్ట్రాల్లో ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను తీసుకుంటే కేంద్ర గ్రిడ్‌ ఛార్జీలకు మినహాయింపు ఉండటం వల్ల చౌకగా విద్యుత్‌ అందుతుంది.
* ఒకవేళ సౌర ప్లాంట్లను కర్నూలు, అనంతపురంలలో ఏర్పాటు చేస్తే కేంద్ర గ్రిడ్‌కు అనుసంధానించడానికి తమిళనాడు, కర్ణాటక వెళ్లిన తర్వాత అక్కడి నుంచి మనం తీసుకోవాల్సి వస్తుంది. అది రాష్ట్రానికి మరింత భారం అవుతుంది. ఉత్తరాది నుంచి దక్షిణ భారత గ్రిడ్‌ ద్వారా విద్యుత్‌ సరఫరా అవుతున్నందున ముందుగా ఒడిశా నుంచి శ్రీకాకుళం మీదుగా దిగువన డిమాండ్‌ ఉన్న కృష్ణా, గుంటూరు ప్రాంతాలకు అందుతుంది.
* సెకి ఒప్పందం ద్వారా అదనంగా వచ్చే విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేయటానికి ఏపీ ట్రాన్స్‌కో, డిస్కంలు రూ.3,762 కోట్లతో నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేశాయి. గత రెండేళ్లలో కొత్తగా 20 ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్లు, 162 డిస్కం సబ్‌స్టేషన్లు ఏర్పాటయ్యాయి.
* రైతులకు పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్‌ను వచ్చే 25 ఏళ్ల పాటు అందించాలన్నది ప్రభుత్వం ఆలోచన. 2024 తర్వాత నుంచి ఏటా 7 వేల మెగావాట్ల విద్యుత్‌ను సెకి అందిస్తుంది. దీని ద్వారా రాష్ట్రంలోని 18 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్‌ అందుతుంది.
* 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం సేకరించిన భూములను ఇతర అవసరాలకు వినియోగించుకునే వెసులుబాటు కలుగుతుంది.
* ‘గత తెదేపా ప్రభుత్వ హయాంలో సౌర, పవన విద్యుత్‌ను అధిక ధరలకు కొనుగోలు చేశారు. సౌర విద్యుత్‌ ధర యూనిట్‌ రూ.6.99, పవన విద్యుత్‌ యూనిట్‌ రూ.4.84 వంతున కొనుగోలు చేసేలా విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) కుదుర్చుకున్నారు. ఇదే తెదేపా ప్రభుత్వం యూనిట్‌ రూ.4.57 వంతున 400 మెగావాట్లను(గాలివీడు) సెకి నుంచి తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకుంది. మరో 750 మెగావాట్లను యూనిట్‌ రూ.2.77 వంతున మైలవరం ప్రాజెక్టు నుంచి తీసుకుంది...’ అని మంత్రి బాలినేని పేర్కొన్నారు.

ఇదీ చదవండి

Payyavula Keshav: విద్యుత్ కొనుగోలు స్కీమ్ కాదు.. అదానీ కోసం చేసే స్కామ్: పయ్యావుల

Last Updated :Nov 6, 2021, 4:38 AM IST

ABOUT THE AUTHOR

...view details