ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టులో అద్భుత ఘట్టం... మల్లన్నను తాకిన గోదారమ్మ

By

Published : Feb 23, 2022, 4:44 PM IST

Mallanna sagar reservoir inauguration: తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ రిజర్వాయర్‌ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. ఆయన చేతుల మీదుగా నీటిని విడుదల చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని అన్ని జలాశయాల కంటే మల్లన్నసాగర్‌ అతి పెద్దది. అత్యంత ఎత్తున ఉన్న జలాశయంగా గుర్తింపు పొందింది.

కాళేశ్వరం ప్రాజెక్టులో అద్భుత ఘట్టం
కాళేశ్వరం ప్రాజెక్టులో అద్భుత ఘట్టం

Mallanna sagar reservoir inauguration: తెలంగాణలోని కాళేశ్వరం ఎత్తిపోతలలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. తెలంగాణ జలకిరీటంగా భాసిల్లే మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించిన మల్లన్నసాగర్‌ను సీఎం కేసీఆర్‌ జాతికి అంకింతం చేశారు. భారీ జలాశయంలోకి లాంఛనంగా నీటిని విడుదల చేశారు. విహంగవీక్షణం ద్వారా ప్రాజెక్టును పరిశీలించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు వద్ద సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజల్లో మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో అద్భుత ఘట్టం... మల్లన్నను తాకిన గోదారమ్మ

ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని అన్ని జలాశయాల కంటే మల్లన్నసాగర్‌ అతి పెద్దది. అత్యంత ఎత్తున ఉన్న జలాశయంగా గుర్తింపు పొందింది. భారీ మట్టికట్టతో.... 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. 11 కంపెనీలు మల్లన్నసాగర్ నిర్మాణంలో పాలుపంచుకున్నాయి. సుమారు 7వేల మంది కార్మికులు ప్రతి నిత్యం మూడు షిఫ్టుల్లో పని చేసి జలాశయం కలను సాకారం చేశారు. కొండపోచమ్మ, గంధమల, బస్వాపూర్‌ రిజర్వాయర్లకు మల్లన్నసాగర్‌ ద్వారానే నీటిని పంపుతారు. నిజాంసాగర్‌, సింగూరు, ఘనపూర్‌ ఆయకట్టు స్థిరీకరణ కూడా ఈ జలాశయంపైనే ఆధారపడి ఉంది. డ్యామ్‌ ప్రొటోకాల్‌ను అనుసరించి ఇప్పటికే నీటి నిల్వ సామర్థ్య పరీక్షలు విజయవంతమయ్యాయి. ఈ జలాశయం ద్వారా 15 లక్షల 71 వేల 50 ఎకరాలకు సాగు నీరు అందనుంది. హైదరాబాద్‌ ప్రజలకు తాగునీరు కోసం 30 టీఎంసీలు భవిష్యత్తులో సరఫరా చేయనున్నారు. పారిశ్రామిక అవసరాలకు ఈ ప్రాజెక్టు నుంచే జలాలు అందనున్నాయి.

ఎన్నో సమస్యలు అధిగమించి..

రాజకీయంగా, న్యాయపరంగా, స్థానికుల నుంచి ఎదురైన సమస్యలను అధిగమించి ప్రభుత్వం మల్లన్నసాగర్‌ను పూర్తి చేసింది. 8 గ్రామాలు పూర్తిగా, 4 గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురయ్యాయి. 17 వేల 872 ఎకరాల భూమిని మల్లన్నసాగర్ కోసం సేకరించారు. 4200 కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. వీరి కోసం ప్రభుత్వం గజ్వేల్ సమీపంలో పునరావాస కాలనీ నిర్మించింది. మల్లన్నసాగర్‌ కోసం 22.6 కిలో మీటర్ల మట్టి కట్టను నిర్మించారు. ఇందుకోసం 14.36 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని వినియోగించారు. కట్ట కోతకు గురవ్వకుండా 27లక్షల క్యూబిక్ మీటర్ల రాయిని రిబిట్‌మెంట్‌ కోసం వినియోగించారు. సొరంగం తవ్వకాల్లో వచ్చిన రాయిని ఇందుకు వినియోగించడం విశేషం. జలాశయంలో పూర్తిస్థాయిలో నిల్వ చేస్తే 75 చదరపు కిలో మీటర్ల పరిధిలో నీరు నిల్వ ఉండనుంది.

జలకిరీటం.. మల్లన్న సాగరం

సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని తుక్కాపూర్‌ గ్రామం వద్ద లిప్టు నిర్మించారు. ఒక్కొక్కటి 43 మెగావాట్ల సామర్థ్యంతో ఎనిమిది పంపులను ఏర్పాటు చేశారు. వీటి నుంచి సుమారు 0.85 టీఎంసీ నీటిని రోజూ మల్లన్నసాగర్‌లోకి ఎత్తిపోయనున్నారు. గత ఏడాది సెప్టెంబరులో మొదటిసారిగా ప్రయోగాత్మకంగా 5టీఎంసీల నీటిని నింపారు. మొదటిసారిగా నీటి నిల్వతో తలెత్తే సమస్యలను పరిశీలించిన తర్వాత మరో 5 టీఎంసీలను నింపారు. ప్రస్తుతం 10.5 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

ఇదీ చదవండి:Gowtham Reddy Funeral: ముగిసిన మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు

ABOUT THE AUTHOR

...view details