ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నీళ్ల కోసం మహిళల ఆందోళన - హుటాహుటిన అధికారుల హామీలు - Women Protest in anantapur

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 30, 2024, 6:11 PM IST

Women Protest About Water Problem In Chikalaguri: పాలకుడు అనేవాడు ప్రజలు ఇబ్బంది పడకుండా వారి సంక్షేమానికి పెద్ద పీట వేయాలని, వారి అభివృద్ధికి కృషి చేయాలని అనుకుంటారు. కానీ మన జగనన్న రివర్స్ పాలనలో రూటే సెపరేటు. ప్రజలు ఇబ్బంది పడినా పర్వాలేదు. తనకు మాత్రం ఎటువంటి ఇబ్బంది కలగకూడదని ఆదేశాలు జారీ చేయటంతో నేతలు కూడా ముఖ్యమంత్రి బాటలోనే అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజల నుంచి తప్పించుకుంటున్నారు.

అనంతపురం జిల్లాలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఖాళీ బిందెలతో మహిళలు నిరసన తెలిపారు. వేసవి కాలం వచ్చింది కదా నీటి ఎద్దడి వల్ల మహిళలు రోడ్డెక్కారని అనుకుంటే పొరబాటే.  గత ఆరు నెలలుగా ఆ ప్రాంతంలో తాగునీటి సమస్య ఉంది. పేరుకైతే తాగునీటి పైప్​లైన్ వేశారు, కానీ నీరు మాత్రం సరఫరా చేయడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో విడపనకల్లు మండలం చీకలగురికి బీసీ కాలనీ సమీపంలో ముఖ్యమంత్రి బస్సు యాత్ర చేస్తున్నారని తెలిసి తాగునీటి సమస్యను పరిష్కరించాలని మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. 

ఈ కాలనీలో ఒక చేతి పంపు ఉందని దీనిని కాలనీతో పాటు గ్రామస్థులు వాడుకుంటున్నామని, చేతి పంపు నీరు వల్ల రోగాల బారిన పడుతున్నామని మహిళలు వాపోయారు. గత ఆరు నెలలుగా తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నా అధికారులు మాత్రం బీసీ కాలనీకి వచ్చిన పాపాన పోలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతానికి దగ్గరలోనే జగన్ బస్సు యాత్ర ఉండటంతో కాలనీకి అధికారులు వెళ్లి తాగునీటి సమస్యను వెంటనే పరిష్కారిస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు నిరసన విరమించారు.

ఇప్పటికే కర్నూలు జిల్లాలో మరో రెండు చోట్ల నీళ్ల కోసం మహిళలు సీఎం బస్సు యాత్రను అడ్డుకున్నారు. శుక్రవారం నాడు గూడూరు మండలు పెంచికలపాడు నుంచి ఎమ్మిగనూరు సభకు వెళ్తుండగా ఖాళీ బిందెలతో మహిళలు అడ్డుకున్నారు. అదేవిధంగా ఈ రోజు అనంతపురం వెళ్తుండగా జొన్నగిరి దగ్గర మహిళలు సీఎం బస్సును అడ్డుకుని నిరసన తెలిపారు. తమ గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details